BCCI: కప్ గెలిస్తే.. టీమిండియాకు బీసీసీఐ భారీ ఆఫర్
ABN , Publish Date - Nov 01 , 2025 | 06:44 PM
టీమిండియా ప్రపంచ కప్ గెలిస్తే బీసీసీఐ వారికి భారీ బొనాంజా ఇవ్వాలని యోచిస్తున్నట్లు సమాచారం. భారత పురుషుల జట్టు 2024 టీ20 వరల్డ్ కప్ గెలిచినప్పుడు ఆటగాళ్లు, సహాయక సిబ్బందికి బీసీసీఐ రూ.125కోట్ల ప్రైజ్ మనీ అందించింది. ఒకవేళ హర్మన్ సేన విశ్వవిజేతగా నిలుస్తే అంతే మొత్తంలో నజరానా ప్రకటించాలని బోర్డు డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: మహిళల వన్డే ప్రపంచ కప్( Women’s World Cup Final 2025) తుది అంకానికి చేరుకుంది. ఆదివారం ముంబై వేదికగా జరిగనున్న ఫైనల్లో టీమిండియా-సౌతాఫ్రికా(India vs South Africa) తలపడనున్నాయి. ఈ రెండు జట్లు ఇప్పటి వరకు కప్ గెలవలేదు. దీంతో ఈసారి కొత్త ఛాంపియన్ను చూడబోతున్నాం. ఇప్పటి వరకు రెండుసార్లు (2005, 2017) ఫైనల్ చేరినా భారత జట్టు కప్ను ముద్దాడలేకపోయింది. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.
ఈ క్రమంలో టీమిండియా ప్రపంచ కప్ గెలిస్తే బీసీసీఐ(BCCI) వారికి భారీ బొనాంజా ఇవ్వాలని యోచిస్తున్నట్లు సమాచారం. భారత పురుషుల జట్టు 2024 టీ20 వరల్డ్ కప్ గెలిచినప్పుడు ఆటగాళ్లు, సహాయక సిబ్బందికి బీసీసీఐ రూ.125కోట్ల ప్రైజ్ మనీ అందించింది. ఒకవేళ హర్మన్ సేన విశ్వవిజేతగా నిలుస్తే అంతే మొత్తంలో నజరానా ప్రకటించాలని బోర్డు డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.
‘పురుషులు, మహిళా క్రికెటర్లకు బీసీసీఐ సమానంగా వేతనాలు చెల్లిస్తోంది. అందువల్ల భారత మహిళల జట్టు ప్రపంచ కప్ గెలిస్తే పురుషుల టీమ్ టీ20 ప్రపంచ కప్ సాధించినప్పుడు ఎంత మొత్తంలో నజరానా ప్రకటించారో ఇప్పుడు కూడా అదే స్థాయిలో బొనాంజా ప్రకటించడం కోసం చర్చలు జరుగుతున్నాయి. కానీ కప్ గెలవక ముందే ప్రకటన చేయడం మంచిది కాదు’ అని బీసీసీఐ వర్గాలు పీటీఐకి తెలిపాయి.
అప్పుడు అలా..
లార్డ్స్లో జరిగిన 2017 ప్రపంచ కప్ ఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో భారత్ 9 పరుగుల తేడాతో ఓడిపోయింది. అప్పుడు భారత జట్టులోని ప్రతి ప్లేయర్కు బీసీసీఐ రూ.50 లక్షల చొప్పున ప్రైజ్మనీ ఇచ్చింది. సహాయక సిబ్బందికి ఒక్కొక్కరికి రూ.25 లక్షలు అందించింది. 2024 టీ20 ప్రపంచ కప్ను టీమిండియా సాధించిన సంగతి తెలిసిందే. రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు బార్బడోస్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్లో 7 పరుగుల తేడాతో గెలిచి విశ్వవిజేతగా నిలిచింది. 17 ఏళ్ల నిరీక్షణ తర్వాత భారత్ పొట్టి కప్పును సాధించడం విశేషం. ఈ మ్యాచ్ ముగిసిన అనంతరం రోహిత్, విరాట్ కోహ్లీ అంతర్జాతీయ టీ20 కెరీర్కు వీడ్కోలు పలికారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Bopanna Retirement: రిటైర్మెంట్ ప్రకటించిన బోపన్న
Rodrigues: నా కోసం వికెట్ త్యాగం చేసింది: జెమీమా