Viral: ఐపీఎస్ బదిలీల్లో ఆసక్తికర ఘటన.. భార్య స్థానంలో భర్తకు జిల్లా ఎస్పీగా బాధ్యతలు!
ABN , Publish Date - Feb 02 , 2025 | 04:52 PM
రాజస్థాన్ ఐపీఎస్ బదిలీలకు సంబంధించి తాజాగా ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. దౌసా జిల్లా ఎస్పీగా ఉన్న రంజిత శర్మ పోలీసు హెడ్ కార్వర్టర్స్కు బదిలీకాగా ఆ స్థానంలో ఆమె భర్త సాగర్ రాణా ఎస్పీగా నియమితులయ్యారు.

ఇంటర్నెట్ డెస్క్: దేశంలో ఎందరో ఐఏఎస్, ఐపీఎస్ జంటలు ఉన్నాయి. భార్య లేదా భర్త ఐపీఎస్ అయితే రెండో వారు ఐఏఎస్లో ఉండటం కూడా చూస్తూనే ఉన్నాం. అయితే, భార్యాభర్తల్లో ఒకరు పని చేసిన చోటుకు రెండోవారు బదిలీ కావడం అరుదనే చెప్పాలి. తాజాగా రాజస్థాన్లో సరిగ్గా ఇదే జరిగింది. దీంతో, ఈ ఉదంతంపై నెట్టింట ఆసక్తి వ్యక్తమవుతోంది.
రాజస్థాన్ కేడర్కు చెందిన రంజిత్ శర్మ, సాగర్ రాణా ఇద్దరూ ఐపీఎస్ అధికారులే. అయితే, ఇప్పటివరకూ దౌసా జిల్లా ఎస్పీగా ఉన్న రంజిత శర్మ పోలీసు హెడ్క్వార్టర్స్కు బదిలీ అయ్యారు. ఆ తరువాత జిల్లా బాధ్యతలను ప్రభుత్వం ఆమె భర్త సాగర్ రాణాకు అప్పగించారు. దౌసా కొత్త ఎస్పీగా ఆయనను ఎంపిక చేశారు. సాగర్ రాణా అంతకుముందు జైపూర్లో ట్రాఫిక్ డీసీపీగా విధులు నిర్వర్తించారు.
Uttarpradesh: దారుణం.. మరదలిని హత్య చేయించేందుకు రూ.40 వేలు అప్పు చేసి.. ఆపై..
రంజిత శర్మ, సాగర్ రాణా ఇద్దరూ 2019 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్లు. హర్యానాలోని రెవారీ జిల్లాకు చెందిన రంజిత తన పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక ఐపీఎస్కు ఎంపికయ్యారు. యూపీఎస్సీ పరీక్షల్లో 5 సార్లు విఫలమైయ్యారు. తొలి మూడు ప్రయత్నాల్లో ఆమె కనీసం ప్రిలిమినరీ దశ కూడ దాట లేకపోయారు. మరో రెండు సార్లు ఇంటర్వ్యూ దశలో వెనుదిరగాల్సి వచ్చింది. అయితే, పట్టు విడవకుండా కృషి చేసిన ఆమె చివరకు 2018లో తన లక్ష్యాన్ని చేరుకున్నారు. దౌసాకు ఎస్పీగా చేయకమునుపు రంజిత జోధ్పూర్ కమిషనరేట్ ఏసీపీగా, ఉదయ్పూర్ ఏఎస్పీగా, బెహ్రోర్, కోట్పుత్లీ ఎస్పీగా సేవలందించారు.
ఇక హర్యానాకు చెందిన సాగర్ రాణా సివిల్ ఇంజినీరింగ్లో బీటెక్ చేశారు. ఆ తరువాత సివిల్స్కు సన్నద్ధమైన ఆయన 2018లో ఐపీఎస్కు ఎంపికయ్యారు. ఆయన తొలి పోస్టింగ్ సాంచోర్ ఎస్పీగా లభించింది. పహ్లోడీ ఎస్పీగా కూడా పని చేశారు. అయితే, ఇప్పుడు ఆయన భార్య స్థానంలోకి బదిలీ కావడం ఆసక్తికరంగా మారింది.