Vemayya Badvel : పిల్లలు లేరనే లోటు లేదు.. పశుపక్ష్యాదులే పంచప్రాణాలు...
ABN, Publish Date - Feb 27 , 2025 | 08:02 PM
ఇది స్మార్ట్ యుగం. నూటికి తొంభై శాతం మంది రోజులో ఎక్కువ సమయాన్ని ఫోన్ లేదా స్వంత పనులతోనే గడుపుతుంటారు. ప్రకృతితో మమేకమయ్యే తీరిక, ఓపిక ఉండేది తక్కువ మందికే. ఉద్యోగం, కుటుంబ బాధ్యతల్లో పడి సొంత పిల్లలనే సరిగా పట్టించుకోలేరు చాలామంది తల్లిదండ్రులు. కానీ, ఓ వ్యక్తి వీటినే తన బిడ్డలుగా సాకుతూ..

చెట్లు, పశుపక్ష్యాదులంటే చాలామందికి ఇష్టముంటుంది. కానీ ఎవరిపనుల్లో వారు బిజీగా గడుపుతూ వాటికోసం తమ సమయాన్ని కేటాయించకలేకపోతున్నామని చింతిస్తుంటారు. పై ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి అలా కాదు.

చెట్లు, పశుపక్ష్యాదుల లోకంగా బతుకుతున్న రామాపురం వేమయ్య స్వగ్రామం బద్వేల్ సమీపంలోని నెమళ్ల గొంది. ప్రస్తుతం సాయిపేటలోని 9వ డివిజన్లో నివాసం ఉంటున్నాడు.

1982లో సోమశిల ప్రాజెక్టు కోసం తమ సొంతూరు వదిలి బ్రతుకుతెరువు కోసం బద్వేలు చేరుకున్నారు వేమయ్య.

తర్వాత పెళ్లి చేసుకుని సాయిపేటలో చిన్న పూరిల్లులో స్థిరపడ్డాడు. ఆ సమయంలో ఒక కొబ్బరి మొక్కను ఆయన నాటారు.

కొంతకాలానికి వేమయ్యకు పక్కా గృహం మంజూరు అయింది. కొబ్బరి చెట్టుపై పెంచుకున్న ప్రేమను తుంచుకోలేక చెట్టును నరికి వేయకుండా ఇంట్లోనే ఉండేలా పైకప్పుకు రంధ్రం వేసి వదిలేశాడు. ఆ చెట్టుకు ప్రతి సీజన్లోనూ 300 నుంచి 400 వరకు కాపు వచ్చినా అందరికీ ఉచితంగా ఇస్తాడు.

కొబ్బరిచెట్లే కాదు. పశువులు, పక్షులన్నా వేమయ్యకు అమితమైన ప్రేమ. ఇతడి దాదాపు 100కు పైగా నాటు కోళ్లు ఉంటాయి. ఇవి కాకుండా 150 పావురాలు, 45 కుందేళ్లు కూడా పెంచుతున్నాడు.

నిజానికి వేమయ్యకు పిల్లలు లేరు. అయినా ఆ బాధే లేదని అంటాడు. చెట్లు, పశు పక్ష్యాదులే ఆ లోటు పూడ్చుతున్నాయని సంతోషంగా చెబుతాడు.
Updated at - Feb 27 , 2025 | 08:06 PM