Tiruchanur: వైభవంగా శ్రీ పద్మావతి అమ్మవారి పంచమి తీర్థం
ABN, Publish Date - Nov 25 , 2025 | 09:59 PM
తిరుచానూరు పద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాలు మంగళవారం పంచమీ తీర్థంతో (చక్రస్నానం) వైభవంగా ముగిశాయి. చివరి రోజు కావడంతో భక్తులు వేలాదిగా తరలివచ్చారు.
1/11
తిరుచానూరు పద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాలు మంగళవారం పంచమీ తీర్థంతో (చక్రస్నానం) వైభవంగా ముగిశాయి. చివరి రోజు కావడంతో భక్తులు వేలాదిగా తరలివచ్చారు. ఈ సందర్భంగా పద్మ పుష్కరిణిలో పవిత్రస్నానం ఆచరించి ఆధ్యాత్మిక తన్మయత్వాన్ని పొందారు.
2/11
మధ్యాహ్నం 12:10 గంటలకు పద్మ పుష్కరిణి పవిత్ర జలాల్లో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. పంచమీ తీర్థం సందర్భంగా మండపంలో అమ్మవారికి, చక్రత్తాళ్వార్కు ఉదయం స్నపన తిరుమంజనం నిర్వహించారు.
3/11
పంచమీ తీర్థం సందర్భంగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. పద్మావతి అమ్మవారి పంచమితీర్థ మహోత్సవం వందలాది మంది భక్తుల సమక్షంలో ఘనంగా జరిగిందని తెలిపారు.
4/11
భక్తులకు ఎక్కడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా విస్తృతమైన ఏర్పాట్లు చేయడంపై టీటీడీలోని అన్ని విభాగాలకు సంబంధించిన అధికారులు, సిబ్బందిని టీటీడీ చైర్మన్ అభినందించారు. జిల్లా పోలీసులు, శ్రీవారి సేవకులతో పాటు పారిశుధ్య కార్మికుల సేవలకు అభినందనలు తెలిపారు.
5/11
పంచమీ తీర్థం సందర్భంగా పద్మావతీ అమ్మవారికి భక్తులు కానుకలు సమర్పించుకున్నారు. దేవికి కానుకగా రూ. 1.3 కోట్ల విలువైన ఆభరణాలు సమర్పించినట్లు అధికారులు తెలిపారు.
6/11
పంచమి తీర్థం సందర్భంగా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం నుంచి.. పద్మావతీ అమ్మవారికి బంగారు కమలా హారం, 1.14 కిలోల బరువున్న రూ.1.31 కోట్ల విలువైన ఒక అత్తి చెట్టును కానుకగా పంపారు.
7/11
పంచమీ తీర్థ మండపంలో అమ్మవారికి, చక్రత్తాళ్వార్లకు స్నపన తిరుమంజనం వైభవంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.
8/11
ఈ సందర్భంగా పద్మావతీ అమ్మవారిని కుంకుమ, పైనాపిల్, డ్రై ఫ్రూట్స్, ఎరుపు, పసుపు గులాబీ రేకులు, తులసి దండలు, కిరీటాలతో సర్వాంగసుందరంగా అలంకరించారు.
9/11
పంచమి తీర్థం (చక్రస్నానం) వేడుక మధ్యాహ్నం 12.10 నుంచి 12.20 గంటల మధ్య ఘనంగా జరిగింది. సుదర్శన చక్రత్తాళ్వార్తో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పద్మ పుష్కరిణిలో పవిత్ర స్నానాలు ఆచరించారు.
10/11
తిరుచానూరుకు వచ్చే భక్తుల సౌకర్యార్థం టీటీడీ భద్రత, నిఘా విభాగం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. 600 మంది టీటీడీ భద్రతా సిబ్బంది, 200 మంది స్కౌట్స్ అండ్ గైడ్స్, 200 మంది ఎన్సీసీ విద్యార్థులు, 900 మంది శ్రీవారి సేవకులు, 1600 మంది పోలీస్ సిబ్బందితో భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు.
11/11
భక్తుల సౌకర్యార్థం వైద్య, పారా మెడికల్ సిబ్బందిని నియమించారు. 3 ప్రాంతాలలో ప్రథమచికిత్స కేంద్రాలు, 5 అంబులెన్స్లు, అవసరమైన మందులను అందుబాటులో ఉంచారు. అదేవిధంగా స్విమ్స్, రుయా ఆసుపత్రులకు చెందిన వైద్యులు, ఆయుర్వేద వైద్యులు భక్తులకు సేవలందించారు. మరోవైపు ఫైర్, జాతీయ విపత్తు నివారణ సిబ్బందిని కూడా అందుబాటులో ఉంచారు.
Updated at - Nov 25 , 2025 | 10:00 PM