Diwali Celebrations: గవర్నర్ నివాసంలో ఘనంగా దీపావళి వేడుకలు.. హాజరైన ప్రవాసాంధ్రులు
ABN , Publish Date - Oct 21 , 2025 | 10:15 AM
టెక్సాస్ గవర్నర్ నివాసంలో దీపావళి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకలకు భారీగా ప్రవాసాంధ్రులు హాజరయ్యారు. టెక్సాస్ రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతుందని.. అందులో ప్రవాసుల పాత్ర కీలకమని తెలిపారు.
డాలస్, టెక్సాస్: వివిధ రంగాల్లో విశేషంగా కృషి చేస్తూ.. శరవేగంగా రాష్ట్రాభివృద్ధికి ప్రవాస భారతీయులు తోడ్పాటు అందిస్తున్నారని టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబ్బాట్ తెలిపారు. ఆ క్రమంలో వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం టెక్సాస్ గవర్నర్ అధికారిక నివాస భవనంలో దీపావళి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. వెండి దీపపు స్తంభాల్లోని జ్యోతులను వెలిగించి ద్వారా గవర్నర్ దంపతులు ఈ వేడుకలను ప్రారంభించారు. ఈ వేడుకల్లో గవర్నర్ గ్రెగ్ అబ్బాట్తోపాటు ఆయన సతీమణి సిసిలీయా అబ్బాట్ పాల్గొన్నారు.

ఈ వేడుకులకు పలువురు ప్రవాస భారతీయులను గవర్నర్ దంపతులు ఆహ్వానించారు. ఈ సందర్భంగా అతిథులందరినీ గవర్నర్ దంపతులు ఆప్యాయంగా పలకరించి.. వారితో ఫొటోలు దిగారు. అలాగే ఈ వేడుకల వేళ.. భారతీయ వంటకాలు ఏర్పాటు చేశారు. అదే విధంగా దీపావళి కానుకలిచ్చి.. వారందరిని ఘనంగా గవర్నర్ దంపతులు సత్కరించారు. భారత, అమెరికా దేశాల మధ్య సంబంధాలు బలోపేతం కోసం నిరంతరం కృషి చేస్తున్నారంటూ టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబ్బాట్కు ప్రవాసభారతీయులందరి తరపున డా. ప్రసాద్ తోటకూర కృతజ్ఞతలు తెలిపారు. ప్రముఖ పారిశ్రామికవేత్త అనురాగ్ జైన్ దంపతులు ఈ ఏడాది దీపావళి వేడుక ఏర్పాట్లను సమన్వయపరచారు.

గౌరవ కాన్సుల్ జనరల్ ఆఫ్ ఇండియా డి.సి.మంజునాథ్ దంపతులు, టెక్సస్ రాష్ట్ర కార్యదర్శి జేన్ నెల్సన్లు ప్రత్యేక అతిథులుగా ఈ వేడుకులకు హాజరయ్యారు. టెక్సాస్ రాష్ట్రంలోని వివిధ నగరాలైన డాలస్, హూస్టన్, ఆస్టిన్, శాన్అంటానియో, కార్పస్ క్రిస్టీ, మిడ్ల్యాండ్, ఓడిస్సా తదితర నగరాల నుంచి ఈ వేడుకలకు 100 మందికిపైగా ప్రవాస భారతీయులు పాల్గొన్నారు. వారిలో ప్రవాసాంధ్రలు డా. ప్రసాద్ తోటకూర, చిన సత్యం వీర్నపు, కుమార్ నందిగం, వెంకట్ ఏరుబండి, వెంకట్ గొట్టిపాటి, సతీశ్ మండువ, నీలిమా గోనుగుంట్ల, ఆశా రెడ్డి, సుజిత్ ద్రాక్షారామ్, బంగార్ రెడ్డి, రాజ్ కళ్యాణ్ దుర్గ్ వారి కుటుంబ సభ్యులు ఉన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..
చిత్ర గానాలహరి.. ఓలలాడిన అభిమానులు
హాంబర్గ్లో ఘనంగా శ్రీనివాసుడి కళ్యాణోత్సవం