HawkEye 360 Tech: డార్క్ షిప్లను గుర్తించే హాక్ఐ 360
ABN , Publish Date - May 07 , 2025 | 05:33 AM
పహల్గాంలో ఉగ్రదాడి నేపథ్యంలో భారత నిఘా సామర్థ్యం పెంచుకునేందుకు అమెరికా హాక్ఐ 360 టెక్నాలజీ విక్రయానికి ఆమోదం తెలిపింది
భారత్కు నిఘా టెక్నాలజీ విక్రయానికి అమెరికా ఆమోదం
న్యూఢిల్లీ, మే 6: పహల్గాంలో ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ.. భారత నిఘా సామర్థ్యాన్ని పెంచేలా కీలక ముందడుగు పడింది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో సముద్ర నిఘాను పెంచేందుకు వీలుగా హాక్ఐ 360 అనే ఉపగ్రహ ఆధారిత నిఘా సాంకేతికతను భారత్కు విక్రయించడానికి అమెరికా ఆమోదం తెలిపింది. ‘సీ విజన్ సాఫ్ట్వేర్తోపాటు ప్రాధాన్యత కలిగిన సాఫ్ట్వేర్ మెరుగుదల, సాంకేతిక సహాయ బృందం ద్వారా శిక్షణ, రిమోట్ సాఫ్ట్వేర్, డాక్యుమెంట్లు, ఇతర లాజిస్టిక్స్, ప్రోగ్రామ్ సపోర్ట్ కావాలని భారత్ కోరింది. ఈ ప్యాకేజీ మొత్తం అంచనా వ్యయం సుమారు రూ.11 వేల కోట్లు’ అని అమెరికా డిఫెన్స్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఏజెన్సీ తెలిపింది. హాక్ ఐ 360 అనేది అమెరికాకు చెందిన జియోస్పేషియల్ అనలిటిక్స్ కంపెనీ. ఇది తన సాంకేతికతతో తక్కువ భూ కక్ష్యలోని ఉపగ్రహాల సాయంతో రేడియో ఫ్రీక్వెన్సీ (ఆర్ఎఫ్) ఉద్గారాల ఆధారంగా ఆ సిగ్నల్ ఎక్కడి నుంచి వస్తుందో గుర్తిస్తుంది.
నౌకలు, విమానాలతోపాటు తీర వ్యవస్థల నుంచి వచ్చే సంకేతాలను ట్రాక్ చేస్తుంది. ట్రాకింగ్ నుంచి తప్పించుకునేందుకు ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ (ఏఐఎ్స)ను ఆఫ్ చేసుకుని తిరిగే ‘డార్క్ షిప్’లను సైతం హాక్ఐ 360 టెక్నాలజీ గుర్తిస్తుంది. ఈ సాంకేతికత భారత్కు అందుబాటులోకి వస్తే హిందూ మహాసముద్ర ప్రాంతంలో అక్రమంగా చేపలు పట్టే వారిని, స్మగ్లింగ్ చేసే వారిని, డార్క్ షిప్లను సులువుగా గుర్తించవచ్చు. అలాగే సముద్ర ప్రాంతంపై గట్టి నిఘా పెట్టవచ్చు. ప్రస్తుతం భారత నౌకాదళం వ్యూహాత్మక ప్రదేశాలను పర్యవేక్షించడానికి, ఏఐఎ్సను ఆఫ్ చేసుకుని తిరిగే డార్క్ షిప్లను గుర్తించడానికి పీ 8 ఐ నిఘా విమానాలు, సీ గార్డియన్ డ్రోన్లను వినియోగిస్తోంది. అయితే హాక్ఐ 360 టెక్నాలజీతో భారత్ తన ఎకనామిక్ జోన్ అంతటా నిఘా పెట్టడానికి అవకాశం ఉంటుంది.