Rahul Gandhi: నా ప్రాణాలకు వారి నుంచి ముప్పు ఉండొచ్చు: రాహుల్ గాంధీ
ABN , Publish Date - Aug 13 , 2025 | 09:27 PM
రాహుల్ గాంధీ 2023లో లండన్ పర్యటన సమయంలో సావర్కర్ను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై సావర్కర్ మునిమనవడు సాత్యకి సావర్కర్ పరువునష్టం కేసు వేశారు.
న్యూఢిల్లీ: వీడీ సావర్కర్పై వ్యాఖ్యల కేసులో తనకు సావర్కర్, గాడ్సే భావజాలాన్ని అనుసరిస్తున్న వారి నుంచి ముప్పు ఉండవచ్చని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) బుధవారంనాడు పుణె కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో తనకు అవసరమైన భద్రత కల్పించాలని కోరారు. ఇందువల్ల విచారణ సజావుగా, పారదర్శకంగా జరిగేందుకు వీలుంటుందని కోర్టుకు విన్నవించారు.
రాహుల్ గాంధీ 2023లో లండన్ పర్యటన సమయంలో సావర్కర్ను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై సావర్కర్ మునిమనవడు సాత్యకి సావర్కర్ పరువునష్టం కేసు వేశారు. ఈ కేసులో రాహుల్ గాంధీకి ఇప్పటికే కోర్టు బెయిలు మంజూరు చేసింది. ప్రజాప్రతినిధుల కోర్టులో కేసు విచారణ ప్రారంభం కావాల్సి ఉంది. ఈ క్రమంలో రాహుల్ తరఫున ఆయన లాయర్ మిలింద్ దత్తాత్రేయ పవార్ తాజాగా కోర్టుకు ఒక అప్లికేషన్ సమర్పించారు.
నాథూరాం గాడ్కే, సావర్కర్ కుటుంబాలతో తనకు సంబంధం ఉందని సాత్యకి గతంలో వెల్లడించినట్టు ఆ పిటిషన్లో న్యాయవాది పేర్కొన్నారు. గత చరిత్ర, ప్రస్తుత రాజకీయ వాతావరణం పరిగణనలోకి తీసుకుంటే రాహుల్ గాంధీకి సావర్కర్, గాడ్సే భావజాలానికి మద్దతిచ్చే వ్యక్తుల నుంచి ముప్పు పొంచి ఉండే అవకాశాలను కొట్టివేయలేమని అన్నారు. ఆ కారణంగా రాహుల్కు తగిన భద్రత కల్పించడం రాజ్యాంగపరమైన బాధ్యత అని ఆ అప్లికేషన్లో పేర్కొన్నారు. కాగా, ఈ కేసు తదుపరి విచారణను కోర్టు సెప్టెంబర్ 10వ తేదీకి వాయిదా వేసింది.
ఇవి కూడా చదవండి..
వీధి కుక్కల అంశం విస్తృత ధర్మాసనానికి బదిలీ
కేదార్నాథ్ యాత్ర మూడు రోజులు నిలిపివేత
For More National News and Telugu News