SP Esha Singh: ఎస్పీ వార్నింగ్.. అక్కడ 41 మందిని బలిగొన్నారు.. ఇక్కడా అవే వేషాలా ?
ABN , Publish Date - Dec 10 , 2025 | 12:59 PM
టీవీకే నేతపై ఎస్పీ ఈషా సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ 41 మందిని పొట్టనబెట్టుకున్నారు.. ఇక్కడా అవే వేషాలా?.. అనుమతి మేరకు నడుచుకోండి. సభకు భద్రత కల్పించడమెలాగో నాకు తెలుసు. మీలాంటి వారి సలహాలు నాకు అక్కర్లేదు. జాగ్రత్తగా మసలుకోండి.. అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనానికి దారితీశాయి.
- టీవీకే ఆనంద్ను నిలదీసిన ఎస్పీ ఈషా సింగ్
పుదుచ్చేరి: ‘‘అక్కడ 41 మందిని పొట్టనబెట్టుకున్నారు. ఇక్కడా అవే వేషాలా?.. అనుమతి మేరకు నడుచుకోండి. సభకు భద్రత కల్పించడమెలాగో నాకు తెలుసు. మీలాంటి వారి సలహాలు నాకు అక్కర్లేదు. జాగ్రత్తగా మసలుకోండి’’ అంటూ టీవీకే నేత బుస్సీ ఆనంద్ను పుదుచ్చేరి ఎస్పీ ఈషా సింగ్(SP Esha Singh) హెచ్చరించారు. ఎవరి మెప్పు కోసమో ఇష్టానుసారంగా జనాలను తరలిస్తానంటే కుదరదని తేల్చి చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
అనేకమంది ఆమె ధైర్యాన్ని మెచ్చుకుంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. పుదుచ్చేరిలో టీవీకే బహిరంగ సభ కోసం నిబంధనలతో అనుమతిచ్చిన విషయం తెలిసిందే. ఈ సభకు 5 వేల మందికి మాత్రమే అనుమతి ఇచ్చారు. ఆ మేరకు ఆహ్వానితులకు పాస్లు కూడా పంపిణీ చేశారు. పాస్లున్నవారిని మాత్రమే అనుమతించాలని పోలీసులకు సూచనలు వెళ్లాయి. అయితే సభా ప్రాంగణం వద్దకు వచ్చిన బుస్సీ ఆనంద్.. పాసుల్లేని వారిని కూడా లోనికి పంపించాలని పోలీసులపై ఒత్తిడి చేశారు. గమనించిన ఎస్పీ ఈషా సింగ్ అతడిని గట్టిగా మందలించారు.

పాసులున్నవారిని మాత్రమే అనుమతిస్తామని ఆమె తేల్చిచెప్పారు. రద్దీలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదని ముందస్తు ఏర్పాట్లు చేశామని, పార్టీ అధినేత మెప్పు పొందేందుకు పాసులు లేనివారిని అనుమతించాలని డిమాండ్ చేయడం సరికాదన్నారు. కరూర్లో జరిగిన రోడ్షోలో 41 మంది ప్రాణాలు కోల్పోవడానికి మీ నిర్లక్ష్యమే కారణమంటూ బుస్సీని నిలదీశారు. వీరి మధ్య సాగిన మాటల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలైంది. దీనిని చూసిన వారంతా ఈషా సింగ్ ధైర్యాన్ని మెచ్చుకుంటూ ఆమె రాజకీయ నాయకులకు సింహ స్వప్నమని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
పరువు హత్య ఆరోపణకు ఆధారాలు చూపండి
Read Latest Telangana News and National News