Priyanka Chaturvedi: ఓటీటీ షోలో అసభ్య కంటెంట్..ఎంపీ ప్రియాంక చతుర్వేది ఆగ్రహం
ABN , Publish Date - May 02 , 2025 | 10:28 AM
‘హౌస్ అరెస్ట్’ షో క్లిప్ వివాదం ఓటీటీ ప్లాట్ఫామ్లలో కంటెంట్ నియంత్రణపై మరోసారి చర్చను రేకెత్తించింది. ఈ అంశంపై ప్రియాంక చతుర్వేది, నిషికాంత్ దుబే వంటి నేతలు కూడా స్పందించారు. అయితే అసలు ఏం జరిగిందనే విషయాలను ఇప్పుడు చూద్దాం.
Priyanka Chaturvedi:ఇటీవల ఒక ఓటీటీ (ఓవర్ ది టాప్) ప్లాట్ఫామ్లో ప్రసారమైన రియాలిటీ షో క్లిప్ సోషల్ మీడియాలో తీవ్ర వివాదానికి దారితీసింది. ఈ క్లిప్లోని అసభ్య కంటెంట్పై ప్రజలు, రాజకీయ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది ఈ ఓటీటీ యాప్ను ఎందుకు నిషేధించలేదని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎంపీ నిషికాంత్ దుబే ఈ షోపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ వివాదం ఓటీటీ ప్లాట్ఫామ్లలో అసభ్య కంటెంట్ను నియంత్రించాలన్న చర్చను మరింత ఉధృతం చేసింది.
వివాదానికి కారణమైన క్లిప్
ఈ వివాదం ‘హౌస్ అరెస్ట్’ అనే వెబ్ సిరీస్లోని ఒక క్లిప్తో మొదలైంది. ఈ షోను ‘ఉల్లు’ అనే ఓటీటీ ప్లాట్ఫామ్లో ప్రసారం చేస్తున్నారు. ఈ షోను మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ అజాజ్ ఖాన్ నిర్వహిస్తున్నారు. ఈ క్లిప్లో అజాజ్ ఖాన్ ఒక కంటెస్టెంట్తో కామసూత్రలోని వివిధ సెక్స్ పొజిషన్ల గురించి ప్రస్తావించారు. ఆ తర్వాత మరికొందరు కంటెస్టెంట్లను ఆ పొజిషన్లను ప్రదర్శించమని అడిగారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దాదాపు రెండు నిమిషాల ఈ క్లిప్ను ప్రియాంక చతుర్వేది ఎక్స్ (ట్విట్టర్)లో షేర్ చేసి, ఇలాంటి అసభ్య కంటెంట్ను నియంత్రించాలని కేంద్రాన్ని కోరారు.
ప్రియాంక చతుర్వేది ఆగ్రహం
రాజ్యసభ ఎంపీ ప్రియాంక చతుర్వేది (Priyanka Chaturvedi) ఈ విషయంపై తీవ్రంగా స్పందించారు. ఉల్లు, ఆల్ట్ బాలాజీ వంటి ఓటీటీ యాప్లలో అసభ్య కంటెంట్ ఉందని తాను గతంలోనూ పలుమార్లు కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినట్లు ఆమె తెలిపారు. అయితే, ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి సమాధానం రాలేదని ఆమె ఆరోపించారు. గత ఏడాది మార్చి 14న సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ (ఐబీ మినిస్ట్రీ) 18 ఓటీటీ ప్లాట్ఫామ్లను అసభ్య, అశ్లీల కంటెంట్ కారణంగా నిషేధించింది. అయితే, ఉల్లు, ఆల్ట్ బాలాజీ వంటి పెద్ద యాప్లను ఎందుకు నిషేధించలేదని ఆమె ప్రశ్నించారు. ఈ రెండు యాప్లను ఎందుకు వదిలేశారో ఐబీ మంత్రిత్వ శాఖ సమాధానం చెప్పాలన్నారు.
బీజేపీ ఎంపీ, నాయకుల స్పందన
ఈ క్లిప్పై బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే కూడా స్పందించారు. “ఇలాంటి కంటెంట్ను అనుమతించబోమన్నారు. మా కమిటీ ఈ విషయంపై చర్యలు తీసుకుంటుంది,” అని ఆయన ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఐబీ మంత్రిత్వ శాఖను ట్యాగ్ చేస్తూ ఈ షోపై తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. బీజేపీ యువ మోర్చా బీహార్ చీఫ్ బరుణ్ రాజ్ సింగ్ కూడా ఈ షోను వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. “ఇలాంటి షోలు టీవీలో చూపిస్తుంటే ఐబీ మంత్రిత్వ శాఖ నిద్రపోతోందా? మన పిల్లలను కాపాడాలని ఆయన సమాచార, ప్రసార మంత్రి అశ్వినీ వైష్ణవ్ను కోరారు.
సోషల్ మీడియాలో ఆగ్రహం
ఈ క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో యూజర్లు తీవ్రంగా స్పందించారు. టీవీ షోలు ఇంత దిగజారిపోయాయా అని ఒక ఎక్స్ యూజర్ వ్యాఖ్యానించారు. ఇది ఎంటర్టైన్మెంట్ కాదన్నారు. నిర్మాతలు, దర్శకుల ఆలోచనలు ఏంటో అర్థం కావడం లేదని మరొకరు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
Mumbai Indians: అగ్రస్థానం చేరుకున్న ముంబై ఇండియన్స్.. ఆసక్తికరంగా ప్లేఆఫ్
Bank Holidays: మే 2025లో 12 రోజులు బ్యాంకులు బంద్.. పూర్తి లిస్ట్ ఇదే
Donald Trump:100 రోజుల్లో ట్రంప్ తుఫాన్..ఒప్పందాల నుంచి ఒడిదొడుకుల దాకా..
Read More Business News and Latest Telugu News