PM Modi Speaks Macron: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్కి మోదీ ఫోన్
ABN , Publish Date - Sep 06 , 2025 | 08:31 PM
మాక్రాన్తో సంభాషణల వివరాలను సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ప్రధాని మోదీ పంచుకున్నారు. అధ్యక్షుడు మాక్రాన్తో చక్కటి సంభాషణలు జరిగాయని, వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారంపై సమీక్షించామని చెప్పారు.
న్యూఢిల్లీ: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ (Emmanuel Macron)తో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) శనివారంనాడు ఫోన్లో మాట్లాడారు. వివిధ రంగాల్లో ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలలో పురోగతిని సమీక్షించారు. ఉక్రెయిన్ యుద్ధానికి తెరపడే మార్గాలపై కూడా చర్చించారు.
మాక్రాన్తో సంభాషణల వివరాలను సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ప్రధాని పంచుకున్నారు. అధ్యక్షుడు మాక్రాన్తో చక్కటి సంభాషణలు జరిగాయని, వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారంపై సమీక్షించామని చెప్పారు. ఉక్రెయిన్ యుద్ధం సాధ్యమైనంత త్వరలో ముగిసేందుకు చేయాల్సిన ప్రయత్నాలతో సహా పలు అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలపై అభిప్రాయాలు పంచుకున్నామని చెప్పారు. అంతర్జాతీయ శాంతి, సుస్థిరతను పెంపొందించడంలో ఇండియా-ఫ్యాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యం కీలక పాత్ర కొనసాగించాలని కూడా నిర్ణయించినట్టు చెప్పారు.
కాగా, 2026 ఫిబ్రవరిలో ఏఐ ఇంపాక్ట్ సదస్సుకు భారత్ అతిథ్యం ఇవ్వనుంది. ఈ సదస్సుకు హాజరుకావాలని మాక్రాన్తో జరిపిన సంభాషణల్లో మోదీ ఆహ్వానించారని, మాక్రాన్ అంగీకరించినందుకు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారని విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అంతర్జాతీయ శాంతి, సుస్థిరత కోసం ఇరుదేశాలు ఎప్పటికప్పుడు సంప్రదించుకుంటూ, కలిసి పనిచేయాలని కూడా ఉభయనేతలు నిర్ణయించినట్టు పేర్కొంది. గత నెల రోజుల్లో మోదీ-మాక్రాన్ ఫోనులో సంభాషించుకోవడం ఇది రెండోసారి. ఆగస్టు 21 మోదీకి మాక్రాన్ ఫోన్ చేశారు. ఉక్రెయిన్ యుద్ధం, గాజాలో ఇజ్రాయెల్-హమాస్ ఘర్షణలపై శాంతియుత పరిష్కారం కనుగొనే విషయంపై చర్చించారు.
ఇవి కూడా చదవండి..
తిహాడ్ జైలును పరిశీలించిన యూకే అధికారులు.. నీరవ్ మోదీ, మాల్యాను అప్పగించే అవకాశం
అన్నాడీఎంకేలో ముదిరిన విభేదాలు.. సెంగోట్టియన్ను పార్టీ పదవుల నుంచి తొలగించిన ఈపీఎస్
For More National News And Telugu News