PM Modi Celebrates Diwali In Goa: ఆ పేరు వింటే.. శత్రువులకు నిద్ర పట్టదు: ప్రధాని మోదీ
ABN , Publish Date - Oct 20 , 2025 | 12:07 PM
ఐఎన్ఎస్ విక్రాంత్లో దీపావళి వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు.
పనాజీ, అక్టోబర్ 20: ఐఎన్ఎస్ విక్రాంత్లో దీపావళి వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. సోమవారం గోవా కార్వార్ తీరంలోని ఐఎన్ఎస్ విక్రాంత్లో భారత నావిక దళ సిబ్బందితో కలిసి ప్రధాని మోదీ దీపావళి వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. ఛత్రపతి శివాజీ ప్రేరణతో మన నావికాదళం ముందుకెళ్తోందని ఆయన స్పష్టం చేశారు. రక్షణ రంగంలో ఆత్మనిర్బర్ భారత్, మేడిన్ ఇండియా చూస్తున్నామని చెప్పారు.
ఐఎన్ఎస్ విక్రాంత్ పేరు వింటే చాలు.. శత్రువులకు నిద్ర కూడా పట్టదన్నారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో ఐఎన్ఎస్ విక్రాంత్.. పాకిస్థాన్ను మోకాళ్లపై కూర్చోబెట్టిందని ఈ సందర్భంగా ప్రధాని మోదీ గుర్తు చేశారు.భారత దళాల నిజమైన సామర్థ్యాలను ఐఎన్ఎస్ విక్రాంత్ ప్రతిబింబిస్తుందని తెలిపారు. ఐఎన్ఎస్ విక్రాంత్ కేవలం యుద్ధ నౌక మాత్రమే కాదని.. దేశం యొక్క కఠిన శ్రమ, ప్రతిభ, నిబద్ధతకు నిదర్శనమని చెప్పారు.
ఐఎన్ఎస్ విక్రాంత్లో గడిపిన క్షణాలు మాటల్లో వర్ణించలేనన్నారు. ఈ సందర్భంగా మీలోని శక్తి, ఉత్సాహాన్ని తాను చూశానని చెప్పారు. అలాగే ఆపరేషన్ సిందూర్ సమయంలో బ్రహ్మోస్ క్షిపణి కీలక పాత్ర పోషించిందన్నారు. అనేక దేశాలు ఈ బ్రహ్మోస్ క్షిపణులు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపాయని తెలిపారు. భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రశ్రేణి రక్షణ ఎగుమతిదారులలో ఒకటిగా మార్చడమే మన ముందున్న లక్ష్యాల్లో ఒకటన్నారు.
మావోయిస్టు హింస నుంచి దేశం విముక్తి అంచున ఉందన్నారు. మావోయిస్టుల ప్రభావం ప్రస్తుతం కేవలం 11 జిల్లాలకు మాత్రమే పరిమితమైందని చెప్పారు. మావోయిస్టులపై పరాక్రమం చూపిన భద్రతా బలగాలకు ఈ సందర్భంగా ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. దేశంలో మావోయిస్టుల హింసను నిర్మూలించడంలో భద్రతా బలగాలు విజయం సాధిస్తాయని ప్రధాని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పోలీసులు అప్రమత్తం.. ప్రజలకు కీలక సూచన
For More National News And Telugu News