Drone Attacks: ఉద్రిక్తంగానే..
ABN , Publish Date - May 10 , 2025 | 04:22 AM
భారత్-పాకిస్థాన్ సరిహద్దులపై రెండో రోజూ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. పాకిస్థాన్ డ్రోన్ దాడులను భారత సైన్యం సమర్థంగా అడ్డుకుంటూ, వీటిలో కొంతమంది గాయపడ్డారు.

వరుసగా రెండో రోజూ పాక్ డ్రోన్ దాడులు
కశ్మీరు నుంచి కచ్ వరకూ 20 నగరాలు లక్ష్యంగా..
నాలుగు రాష్ట్రాల్లో 26 డ్రోన్లు.. కూల్చివేసిన భారత సైన్యం
డ్రోన్ దాడికి ఫిరోజ్పూర్లో ముగ్గురికి గాయాలు.. ఒకరు విషమం
సరిహద్దు ప్రాంతాల్లో రెండో రోజూ సైరన్ మోతలు, చిమ్మ చీకట్లు
జమ్మూ, శ్రీనగర్, అమృత్సర్, మే 9: భారత్, పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతాల్లో వరుసగా రెండో రోజు కూడా ఉద్రిక్త పరిస్థితులే కొనసాగుతున్నాయి. జమ్మూ కశ్మీరు నుంచి గుజరాత్ వరకూ సైరన్ మోతలు వినిపిస్తున్నాయి. రాజస్థాన్లోని జైసల్మేర్, జోధ్పూర్ సహా జమ్ము నుంచి పంజాబ్ వరకూ చాలా ప్రాంతాల్లో బ్లాకవుట్ కొనసాగుతోంది. ఇళ్లల్లోనూ బయటా లైట్లు ఆర్పేయడంతో చిమ్మ చీకట్లు నెలకొన్నాయి. అదే సమయంలో, పాకిస్థాన్ తన దుర్భుద్దిని పోనిచ్చుకోలేదు. జమ్మూ కశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ల్లోని 20 నగరాల్లోని సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని శుక్రవారం రాత్రి కూడా పాకిస్థాన్ డ్రోన్ దాడులు చేసింది. మరోసారి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడింది. బారాముల్లా నుంచి భుజ్ వరకూ నాలుగు రాష్ట్రాల్లో 26 డ్రోన్ దాడులు చేసింది. వాటన్నిటినీ భారత్ అడ్డుకుని కూల్చేసింది. వీటిలో శ్రీనగర్ విమానాశ్రయం, దక్షిణ కశ్మీరులోని అవంతిపుర స్థావరమే లక్ష్యంగా చేసిన దాడిని భారత్ సమర్థంగా అడ్డుకుంది. అయితే, అవంతిపుర వైమానిక స్థావరం చుట్టుపక్కల పేలుళ్లు వినిపించాయి. పాకిస్థాన్ డ్రోన్లను గగనతలంలోనే పేల్చేయడంతో బారాముల్లాలో ఆకాశం అరుణ వర్ణాన్ని తలపించింది.
పాక్ డ్రోన్ బాంబు దాడిలో పంజాబ్లోని ఫిరోజ్పూర్కు చెందిన కుటుంబంలోని ముగ్గురు శుక్రవారం రాత్రి గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.
జమ్ము కశ్మీరులోని జమ్ము, సాంబ, రాజౌరి; పంజాబ్లోని పఠాన్కోట; అమృత్సర్, రాజస్థాన్లోని పోఖ్రాన్ల్లో డ్రోన్ దాడులు జరిగాయి. కుప్వారా, సాంబ, పూంచ్, యురి, నౌగమ్ హండ్వారాల్లో నియంత్రణ రేఖ వెంట భారీగా శతఘ్ని గుళ్ల వర్షం కురిపించింది. అలాగే, జమ్ము, పఠాన్ కోట్ల్లో రెండో రోజూ సైరన్లు వినిపించాయి. చిమ్మ చీకట్లు నెలకొన్నాయి. అమృత్సర్లో భారీగా కాల్పులు జరిగినట్లు తెలిసింది. డ్రోన్లు తిరగడం కనిపించింది. జమ్ము, కశ్మీర్, పఠాన్కోట్, ఫిరోజ్పూర్, జైసల్మేర్ల్లో పేలుళ్లు వినిపించాయి. పంజాబ్లోని గురుదా్సపూర్, తరణ్ తరణ్ వాసులు కూడా తమకు పేలుళ్లు వినిపించాయని చెప్పారు. వరుసగా రెండో రోజు కూడా జైసల్మేర్లో డ్రోన్ దాడులను మన దళాలు అడ్డుకున్నాయి. ఇక, భారీ పేలుళ్లు తనకూ వినిపించాయని జమ్ము కశ్మీరు సీఎం ఒమర్ అబ్ధుల్లా తెలిపారు. ‘‘అప్పుడప్పుడు భారీగా పేలుళ్ల శబ్ధాలు వినిపిస్తున్నాయి. అవి భారీ శతఘ్నులు కావచ్చు. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.. ఎవరూ వీధుల్లో తిరగొద్దు. మరికొన్ని గంటలపాటు ఇళ్లల్లోనే ఉండండి. వదంతులను నమ్మొద్దు’’ అని ఎక్స్లో పోస్టు పెట్టారు. అలాగే, ఇళ్లల్లో లైట్లను ఆర్పేయాలంటూ మసీదుల్లోని లౌడ్ స్పీకర్ల ద్వారా ప్రకటిస్తున్నారు. మరోవైపు, జమ్ము, సాంబ జిల్లాల్లోని సుచేత్గఢ్, రామ్గఢ్ సెక్టార్లలో చొరబాట్లకు అనుకూలంగా భారీగా గుళ్ల వర్షం మొదలైంది. ప్రస్తుత పరిస్థితిపై తమలో భయాందోళనలు నెలకొన్నాయని, అయినా, పాకిస్థాన్ కుట్రలను మన సైన్యం తిప్పికొడుతుందన్న భరోసా ఉందని పఠాన్కోట్లో స్థానికులు చెప్పారు.
అమృత్సర్లో లోహ శకలాలు
అమృత్సర్లోని జెథువాల్ గ్రామంలో స్థానికులు లోహ శకలాలను గుర్తించారు. అవి క్షిపణి భాగాలుగా అనుమానిస్తున్నారు. స్థానిక పోలీసులు దానిపై సైన్యానికి సమాచారమిచ్చారు. దర్యాప్తు తర్వాతే వివరాలు వెల్లడవుతాయని వారు వివరించారు. అలాగే, కచ్ జిల్లాలోని మారుమూల ఖావ్డా గ్రామంలోనూ డ్రోన్ శకలాలను గుర్తించారు. అలాగే, పాకిస్థాన్కు చెందిన పలు సైనిక పోస్టులను మన దళాలు ధ్వంసం చేశాయి. సంబంధిత వీడియోను భారత సైన్యం విడుదల చేసింది. రాజస్థాన్ జైసల్వేర్ జిల్లాలోని కిషన్ఘాట్ ప్రాంతంలో శుక్రవారం ఉదయం బాంబులా ఉన్నదాన్ని గుర్తించారు. ముందు జాగ్రత్త చర్యగా ఆ ప్రాంతాన్ని దిగ్బంధించారు. ఆర్మీ నుంచి నిపుణులు వచ్చి దానిని పరిశీలిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
India Pakistan Tensions: భారత్, పాకిస్తాన్ ఉద్రిక్తత వేళ.. దేశంలో నిత్యావసరాలపై కీలక ప్రకటన
India Pakistan Tension: భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తత వేళ జమ్మూ నుంచి ఢిల్లీకి మూడు ప్రత్యేక రైళ్లు
Virat Kohli: సైనికుల సేవలకు హృదయపూర్వక ధన్యవాదాలు..జై జవాన్కు జై కోహ్లీ
RSS: దేశ భద్రత విషయంలో ప్రతి భారతీయుడు భాగస్వామ్యం కావాలి: ఆర్ఎస్ఎస్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి