India Air Defence: కూల్చాం.. నిర్వీర్యం చేశాం
ABN , Publish Date - May 10 , 2025 | 04:53 AM
భారత్పై పాకిస్థాన్ భారీగా టర్కీ డ్రోన్లను ప్రయోగించి విఫలమైంది. భారత వాయుసేన అధునాతన ఎయిర్ డిఫెన్స్తో వాటిని సమర్థంగా అడ్డుకోగా, పాక్ పౌర విమానాల రక్షణను ఖతంలో పెట్టినట్లు భారత అధికారం ఆరోపించారు.

కశ్మీర్లోని లేహ్ నుంచి గుజరాత్లోని సర్క్రీక్ దాకా 36 నగరాల్లోని సైనిక శిబిరాలే లక్ష్యం
గురువారం ఒక్కరోజే 300-400
టర్కీ డ్రోన్లతో దాడికి పాక్ యత్నం
అత్యధిక డ్రోన్లలో ఎలాంటి ఆయుధాలూ లేవు
మన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను పరీక్షించడానికే
శిథిలాలపై దర్యాప్తు.. మరిన్ని ఆధారాల సేకరణ
పౌర విమానాలను పాక్ అడ్డుగా పెట్టుకుంది
మీడియాతో విక్రమ్ మిస్రి, సోఫియా, వ్యోమికా
న్యూఢిల్లీ, మే 9: ‘‘అటు లేహ్ నుంచి ఇటు సర్ క్రీక్ వరకూ జమ్ము కశ్మీర్, రాజస్థాన్, పంజాబ్ తదితర రాష్ట్రాల్లో 36 నగరాలు, పట్టణాల్లోని భారత సైనిక శిబిరాలపై దాడికి గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత పాకిస్థాన్ 300-400 టర్కీ డ్రోన్లతో విఫల యత్నం చేసింది. లద్ధాఖ్లోని సియాచిన్ బేస్ క్యాప్; గుజరాత్లోని కచ్ ప్రాంతంలోనూ ఈ డ్రోన్లు కనిపించాయి. ఈ రెండు ప్రాంతాల మధ్య దాదాపు 1400 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అంటే.. పాకిస్థాన్ ఏ స్థాయిలో డ్రోన్లతో దాడి చేసిందో అర్థం చేసుకోవచ్చు. వాటిలో 50 డ్రోన్లను మన ఎయిర్ డిఫెన్స్ గన్స్ కూల్చేశాయి. రేడియో ఫ్రీక్వెన్సీలను జామ్ చేయడం ద్వారా మరో 20 డ్రోన్లను పనికిరాకుండా చేశాయి. అయితే, వీటిలో అత్యధిక డ్రోన్లలో ఎటువంటి ఆయుధాలూ లేవు. బహుశా.. భారత రక్షణ వ్యవస్థను పరీక్షించడానికే వీటిని ప్రయోగించి ఉండవచ్చు’’ అని విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రి వెల్లడించారు. చాలా డ్రోన్లలో కెమెరాలు బిగించి ఉన్నాయని, వాటితో చిత్రీకరించిన ఫుటేజీని నిఘా సమాచారాన్ని పాకిస్థాన్లోని క్షేత్ర స్థాయి స్టేషన్లకు పంపించడానికే వాటిని బిగించి ఉంటారని అభిప్రాయపడ్డారు.
తమ గగనతల దాడులకు పౌర విమానాలను అడ్డుగా పెట్టుకుందని, గగనతలాన్ని తెరిచి ఉంచిందని తెలిపారు.
అంతర్జాతీయ సరిహద్దు వద్ద అంతర్జాతీయ పౌర విమానాలు తిరుగుతూ ఉంటాయని, వాటిపై నిఘా ఉండదని, ఇటువంటి పరిస్థితుల్లో పాకిస్థాన్ తమ గగనతలాన్ని అడ్డుగా పెట్టుకోవడం మిగిలిన పౌర విమానాలకు ఏమాత్రం సురక్షితం కాదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతంలో విమానాల కదలికలకు సంబంధించిన స్ర్కీన్ షాట్లను ప్రదర్శించారు. ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్తో కలిసి శుక్రవారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడారు. శుక్రవారం రాత్రి కూడా పాకిస్థాన్ పలు డ్రోన్లతో దాడులు చేసిందని, మరీ ముఖ్యంగా ప్రార్థన స్థలాలను లక్ష్యంగా చేసుకుందని తెలిపారు. తప్పంతా భారతీయ సైన్యానిదేనంటూ ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించడానికి దుష్ట పన్నాగాలను పన్నుతోందని మండిపడ్డారు. అమృత్సర్లోని గురుద్వారాపై దాడి చేసిన పాకిస్థాన్.. ఆ తప్పును మన భద్రతా దళాలపై నెట్టేయడాన్ని గుర్తు చేశారు. తన సొంత నగరాలపై భారత్ దాడి చేసుకుంటుందనే అపరిపక్వ అంచనాల్లో పాకిస్థాన్ ఉందని, అటు వంటివన్నీ పాకిస్థాన్ అలవాట్లని దుయ్యబట్టారు. భారత సైనిక స్థావరాలు, పౌర ఆవాసాలపై పాకిస్థాన్ దాడులు చేయడం రెచ్చగొట్టే చర్యలేనని మండిపడ్డారు. చాలా డ్రోన్లను కూల్చేశామని, నిర్వీర్యం చేశామని, వాటి శిథిలాలపై దర్యాప్తు సాగుతోందని, ప్రాథమిక వివరాల ప్రకారం టర్కీ తయారు చేసిన ఆసిస్ గార్డ్ సోంగార్ డ్రోన్లుగా గుర్తించారని కల్నల్ సోఫియా ఖురేషీ వివరించారు. సైనిక స్థావరాలపై దాడులు చేస్తే భారత్ నుంచి తీవ్ర ప్రతిస్పందన ఉంటుందని పాకిస్థాన్కు తెలుసునని, అందుకే, ప్రతి దాడులు చేయకుండా పౌర విమానాలను అడ్డుగా పెట్టుకుందని ఆరోపించారు.
భఠిండాపై సాయుధ యూఏవీ దాడిని కూడా అడ్డుకున్నామని తెలిపారు. పాకిస్థాన్ వందలాది డ్రోన్లను ప్రయోగించిందని, వాటన్నిటినీ మన వాయు రక్షణ వ్యవస్థ అడ్డుకోవడమో, కూల్చడమో చేసినా.. ఈ చర్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని యధేచ్ఛగా ఉల్లంఘించడమేనని తప్పుబట్టారు. అలాగే, చిన్న చిన్న ఆయుధాలతోనూ కాల్పులు జరిపిందని, జమ్ము కశ్మీరులో నియంత్రణ రేఖ వెంబడి గుళ్ల వర్షం కురిపించిందని, ఈ ఘటనల్లో ఓ జవాను సహా 16 మంది చనిపోయారని వెల్లడించారు. ఇందుకు బదులుగా భారత బలగాలు వందలాది పాక్ డ్రోన్లు, క్షిపణులను కూల్చేయడమే కాకుండా ఆ దేశ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను ధ్వంసం చేశాయని తెలిపారు. కూల్చేసిన డ్రోన్లు, క్షిపణుల శిథిలాలను సేకరించామని, వాటిని విశ్లేషించి.. భారత్లో ఉగ్రవాద దాడుల వెనక పాకిస్థాన్ ఉందనే ఆధారాలకు వీటిని కూడా జత చేస్తామని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన కొన్ని శిథిలాలు పంజాబ్లోని అమృత్సర్లో దొరికాయన్నారు. పాకిస్థాన్ భారీ ఎత్తున డ్రోన్లతో దాడి చేసింది మన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను పరీక్షించడం కోసమేనని వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ చెప్పారు. భారత సైన్యం కూడా సాయుధ డ్రోన్లతో నాలుగు పాక్ వాయు రక్షణ వ్యవస్థలపై దాడి చేసిందని, వాటిలో ఒకటి ఎయిర్ డిఫెన్స్ రాడార్ను ధ్వంసం చేసిందని వివరించారు. అంతర్జాతీయ విమానాల రక్షణ కోసం భారత వాయు సేన నియంత్రణ పాటించిందని తెలిపారు.
గగనతలంపై భారత్ పట్టు
పాకిస్థాన్ డ్రోన్లను కూల్చేయడం ద్వారా గగనతలంపై భారత్ తన పట్టును నిలుపుకొందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. గగనతంలో తనను తాను కాపాడుకోవడమే కాకుండా దానిపై ఆధిపత్యం కూడా సాధించగలదని తాజా ఘటనతో రుజువైందని వివరించాయి.
ఇవి కూడా చదవండి
India Pakistan Tensions: భారత్, పాకిస్తాన్ ఉద్రిక్తత వేళ.. దేశంలో నిత్యావసరాలపై కీలక ప్రకటన
India Pakistan Tension: భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తత వేళ జమ్మూ నుంచి ఢిల్లీకి మూడు ప్రత్యేక రైళ్లు
Virat Kohli: సైనికుల సేవలకు హృదయపూర్వక ధన్యవాదాలు..జై జవాన్కు జై కోహ్లీ
RSS: దేశ భద్రత విషయంలో ప్రతి భారతీయుడు భాగస్వామ్యం కావాలి: ఆర్ఎస్ఎస్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి