Pakistani Cleric: భారత్తో పోరాటమా
ABN , Publish Date - May 07 , 2025 | 05:08 AM
పాక్లో మతగురువు, ప్రజలకు ‘భారత్తో యుద్ధం చేయడం’పై ప్రశ్నించి, ప్రజలు మౌనంగా ఉండిపోయారు. పాక్ సైన్యం తన దేశంలోని ప్రజలపై దాడులు చేస్తున్న నేపథ్యంలో ఈ మౌనాన్ని చూసి మతగురువు అసంతృప్తి వ్యక్తం చేశారు
పాక్లో ఓ మతగురువు ప్రశ్నకు..
అక్కడి ప్రజల నుంచి మౌనమే సమాధానం
సోషల్ మీడియాలో వీడియోలు వైరల్
న్యూఢిల్లీ, మే 6: భారత్తో యుద్ధం విషయంలో పాకిస్థాన్ ప్రభుత్వానికి సొంత ప్రజల నుంచే మద్దతు లభించని పరిస్థితి కనిపిస్తోంది. పైగా బలూచిస్థాన్, ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతాల్లోని సొంత ప్రజలపైనే పాక్ సైన్యం దాడులు చేయడంపై వ్యతిరేకత కూడా వ్యక్తమవుతోంది. పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్లోని లాల్ మసీదు మతగురువు మౌలానా అబ్దుల్ అజీజ్ ఘాజీ.. మసీదుకు వచ్చిన ప్రజలు, విద్యార్థులతో మత గురువు మాట్లాడుతూ ‘‘మీ అందరికీ ఒక ప్రశ్న. ఒకవేళ భారత్తో పాకిస్థాన్ యుద్ధం చేస్తే.. మీలో ఎందరు మద్దతు ఇస్తారు? పాక్ తరఫున పోరాడుతారు?’’ అని ప్రశ్నించారు.
అక్కడున్నవారిలో ఒక్కరు కూడా చేయి ఎత్తలేదు, ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయారు. ఇది చూసిన మతగురువు అజీజ్ ఘాజీ.. ఈ మౌనం చూస్తే అంతా అర్థమైపోతోందని పేర్కొన్నారు. అంతేకాదు.. బలూచిస్థాన్, ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతాల్లో సొంత ప్రజలపైనే పాక్ సైన్యం బాంబులు వేస్తోందని మండిపడ్డారు. మరోవైపు ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతానికి చెందిన మత బోధకుడు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘‘ఒకవేళ పాకిస్థాన్పై భారత్ దాడి చేస్తే.. భారత సైన్యానికి పష్తూన్లు మద్దతు ఇస్తారు. ఖైబర్ పఖ్తుంఖ్వాలో పాక్ ఆర్మీ ఎన్నో అరాచకాలకు పాల్పడింది. మరి మనం పాకిస్థాన్ జిందాబాద్ అంటామా? అలా అనే ప్రసక్తే లేదు’’ అని పేర్కొన్నారు. ఈ రెండు ఘటనల వీడియోలు వైరల్గా మారాయి.