Marriages: అధికారులే అమ్మా.. నాన్న అయ్యారు..
ABN , Publish Date - Dec 13 , 2025 | 01:07 PM
అక్కడ.. అధికారులే అమ్మా.. నాన్న అయ్యారు. పునరావాస కేంద్రంలో ఉన్న మహిళలకు స్థానిక, ఉన్నతాధికారులే దగ్గరుండి పుళ్లి జరిపించారు. జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు పెళ్లిపెద్దలుగా మారి ఆ వివాహాలను జరిపించారు. ఇక వివరాల్లోకి వెళితే...
- ఘనంగా పునరావాస కేంద్రంలోని యువతుల వివాహం
- జిల్లా అధికారి, డీఎస్పీలే పెళ్లిపెద్దలు
బెంగళూరు: రంగురంగుల పూలతో సింగారించుకున్న భవనం... రంగవల్లులతో ప్రత్యేక ఆకర్షణ, అతిథులను స్వాగతించిన అధికారులు... ఈ అపురూపమై ఘట్టం సాగింది ఉడుపిలోని నిట్టూరు ప్రాంతంలోని మహిళా పునరావాస కేంద్రం. ఇక్కడ ఆశ్రయం పొందుతున్న సుశీలకు హాసన్ జిల్లా హొళె నరసీపుర తాలూకా కృష్ణాపుర గ్రామానికి చెందిన మల్లప్ప కుమారుడు నాగరాజ్తో వివాహం కుదిరింది. మరో యువతి మల్లీశ్వరికి దక్షిణకన్నడ జిల్లా మూల్కి ప్రాంతానికి చెందిన సతీశ్ప్రభు కుమారుడు సంజయ్ ప్రభుతో శుక్రవారం వివాహం జరిగింది.
ఉడుపి జిల్లాధికారి స్వరూప(Swarupa) వధువుల తరపున పెళ్లిపెద్దగా వ్యవహరించి కన్యాదానం చేశారు. డీఎస్పీ ప్రభు, స్త్రీశిశుసంక్షేమశాఖ డిప్యూటి డైరెక్టర్ శ్యామలతోపాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. బళ్ళారి జిల్లాకు చెందిన మల్లీశ్వరికి 18 ఏళ్లు నిండడంతో కారవార శిశుభవనం నుంచి రాష్ట్ర మహిళా పునరావాస కేంద్రానికి వచ్చారు. ప్రస్తుతం బీఏ ఫైనలియర్ చదువుతుండగా, సంజయ్ప్రభు ఎంకామ్ చదివి బెంగళూరులోని ప్రముఖ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.
సుశీల పునరావాసకేంద్రంలోని చింతపండు సంస్కరణ విభాగంలో పనిచేస్తుండగా, నాగరాజు బెంగళూరులో మొబైల్ క్యాంటీన్ నిర్వహిస్తున్నాడు. మహిళా పునరావాసకేంద్రంలో ఇప్పటివరకు 27 పెళ్లిళ్లు చేసినట్టు అయ్యిందని సూపరింటెండెంట్ పుష్పరాణి తెలిపారు. ప్రస్తుతం 51మంది మహిళలు, ఇద్దరు యువతులు ఆశ్రయం పొందుతున్నారని, వీరిలో నలుగురు డిగ్రీ చదువుతున్నారు.

యువ రైతులను పెళ్లాడిన వధువులకు రూ.5లక్షలు
వ్యవసాయం చేసేవారిని పెళ్లి చేసుకునేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని బీజేపీ కార్యకర్తలు మండ్య జిల్లాధికారికి వినతిపత్రం అందచేశారు. యువరైతులను పెళ్లి చేసుకునే వధువుకు రూ.5లక్షల ప్రోత్సాహకం ఇవ్వాలని మండ్య అదనపు జిల్లా అధికారి శివానందమూర్తికి శుక్రవారం వినతిని ఇచ్చారు. ప్రభుత్వం షాదీభాగ్య పథకం తరహాలోనే యువరైతులను పెళ్లాడేందుకు ముందుకొచ్చే యువతులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
చదవడం లేదని..బాలుడిని అట్లకాడతో కాల్చిన ట్యూషన్ టీచర్
Read Latest Telangana News and National News