Food Cecurity: నిత్యావసరాలకు కొరత లేదు
ABN , Publish Date - May 10 , 2025 | 04:14 AM
సరిహద్దు రాష్ట్రాల్లో నిత్యావసరాలు నిల్వ చేసుకుంటున్నదంటూ వచ్చిన ప్రచారంపై కేంద్రం స్పందించింది. దేశంలో సరిపడా నిల్వలు ఉన్నాయని, కృత్రిమ కొరత సృష్టించే వ్యాపారులకు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

దేశంలో అవసరానికి మించి ఆహార ధాన్యాల నిల్వలున్నాయి
ఏ మాత్రం ఆందోళన అవసరం లేదు
ధరలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం
కృత్రిమ కొరత సృష్టించే వ్యాపారులపై కఠిన చర్యలు తప్పవు
కేంద్ర ఆహార మంత్రి ప్రహ్లాద్ జోషీ వెల్లడి
పాక్తో ఉద్రిక్తతల నేపథ్యంలో పలుచోట్ల హడావుడి కొనుగోళ్లపై మంత్రి స్పందన
పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ నిల్వలు సరిపడా ఉన్నాయన్న చమురు కంపెనీలు
న్యూఢిల్లీ, మే 9: సరిహద్దు రాష్ట్రాల్లో హడావుడిగా నిత్యావసరాలు కొని నిల్వ చేసుకుండటంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. దేశంలో పప్పులు, కూరగాయలు సహా ఎలాంటి నిత్యావసరాలకు కూడా కొరత లేదని.. సరిపడా నిల్వలు ఉన్నాయని ప్రకటించింది. జనం ఏమాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. భారీగా సరుకులు నిల్వ చేసుకుని, కృత్రిమ కొరత సృష్టించే వ్యాపారులకు కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించింది. ఈ మేరకు కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ‘‘దేశంలో నిత్యావసరాల కొరత తలెత్తుతోందంటూ జరుగుతున్న దుష్ప్రచారాన్ని నమ్మొద్దు. దేశంలో అవసరానికి మించి ఆహార పదార్థాల నిల్వలు ఉన్నాయి. ట్రేడర్లు, హోల్సేల్, రీటైల్ వ్యాపారులు ప్రభుత్వానికి సహకరించాలి. భారీగా నిల్వ చేసి కృత్రిమ కొరత సృష్టిస్తే.. కఠిన చర్యలు చేపడతాం. ధరలనూ నిత్యం పర్యవేక్షిస్తున్నాం..’’ అని తెలిపారు. దీనికి సంబంధించి వివిధ రాష్ట్రాల్లో ఆహార, నిత్యావసర సరుకుల సరఫరా, నిల్వలపై రాష్ట్రాల కార్యదర్శులు, సరుకుల ఉత్పత్తిదారులతో కేంద్ర ప్రభుత్వం సమావేశాలు నిర్వహిస్తోందని వెల్లడించారు. కాగా, సరిహద్దు రాష్ట్రాల్లో జనం పెట్రోల్ బంకులకు పోటెత్తడం, వంటగ్యాస్ సిలిండర్లు బుక్ చేసుకుంటుండటంపై ఇండియన్ ఆయిల్, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ స్పందించాయి. ‘‘దేశవ్యాప్తంగా గణనీయంగా పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ నిల్వలు ఉన్నాయి. ఎలాంటి ఆటంకం లేకుండా సరఫరా జరుగుతోంది.
ఎవరూ హడావుడి కొనుగోళ్లు, నిల్వ చేసుకోవడం వంటివి చేయవద్దు..’’ అని పేర్కొన్నాయి. మరోవైపు.. పౌర రక్షణ విభాగాలకు అవసరమైన సామగ్రి కొనుగోలు చేసుకునే అధికారం ఇవ్వాలని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. మరోవైపు.. మొబైల్ సేవలకు ఎలాంటి ఆటంకం తలెత్తవద్దన్న కేంద్రం సూచన మేరకు టెలికం కంపెనీలు చర్యలు చేపట్టాయి. ప్రతి సంస్థ జాతీయ స్థాయిలో కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేయడం, ఒక నోడల్ అధికారిని నియమించడం, విద్యుత్ సరఫరా నిలిచిపోయినప్పుడు సర్వీసులకు ఆటంకం కలగకుండా టవర్ల వద్ద జనరేటర్ల కోసం సరిపడా డీజిల్ నిల్వ ఉంచడం వంటి చర్యలు చేపట్టాయి. మరోవైపు ఏటీఎంలలో నగదు రావడం లేదని, కొరత ఏర్పడిందన్న ప్రచారాన్ని ఎస్బీఐ, పీఎన్బీసహా జాతీయ బ్యాంకులన్నీ ఖండించాయి. దేశం లోని అన్ని బ్యాంకులు, ఏటీఎంల్లో సరిపడా నగదు ఉందని స్పష్టం చేశాయి.
ఇవి కూడా చదవండి
India Pakistan Tensions: భారత్, పాకిస్తాన్ ఉద్రిక్తత వేళ.. దేశంలో నిత్యావసరాలపై కీలక ప్రకటన
India Pakistan Tension: భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తత వేళ జమ్మూ నుంచి ఢిల్లీకి మూడు ప్రత్యేక రైళ్లు
Virat Kohli: సైనికుల సేవలకు హృదయపూర్వక ధన్యవాదాలు..జై జవాన్కు జై కోహ్లీ
RSS: దేశ భద్రత విషయంలో ప్రతి భారతీయుడు భాగస్వామ్యం కావాలి: ఆర్ఎస్ఎస్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి