Afghanistan Earthquake: అఫ్గాన్లో భూకంపం
ABN , Publish Date - Sep 02 , 2025 | 02:00 AM
భారీ భూకంపం ఆఫ్గానిస్థాన్ను కుదిపేసింది. ఇంతవరకు 802 మంది మరణించగా, 2,800 మంది గాయపడ్డారని సోమవారం అధికారవర్గాలు తెలిపాయి.
800 మందికి పైగా మృతి
2,800 మందికి గాయాలు
మృతుల సంఖ్య పెరిగే ప్రమాదం
తెరిపిలేని వర్షాలతో సహాయ చర్యలకు ఆటంకం
భారత్ తక్షణ సాయం.. 15 టన్నుల ఆహారం, వెయ్యి గుడారాలు
ఆదుకోవాలని అన్ని దేశాలకు తాలిబాన్ ప్రభుత్వం వినతి
కాబూల్/ న్యూఢిల్లీ, సెప్టెంబరు 1: భారీ భూకంపం ఆఫ్గానిస్థాన్ను కుదిపేసింది. ఇంతవరకు 802 మంది మరణించగా, 2,800 మంది గాయపడ్డారని సోమవారం అధికారవర్గాలు తెలిపాయి. మారుమూల పర్వత ప్రాంతాల్లో భూకంపం సంభవించడం, అక్కడ తెరిపి లేకుండా భారీగా వర్షాలు కురుస్తుండడం, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉండడంతో సహాయ బృందాలు వెళ్లడం కష్టంగా మారింది. తూర్పు రాష్ట్రాలైన కునార్, నంగర్హార్లలో ఆదివారం అర్ధరాత్రి భూమి కంపించింది. భూమిలోపల పది కిలోమీటర్ల (5 మైళ్లు) లోతులో భూకంప కేంద్రం నమోదయింది. రెక్టార్ స్కేల్పై దీని తీవ్రత 6.0 పాయింట్లుగా రికార్డయింది. అనంతరం రాత్రంతా అయిదుసార్లు భూమి కంపించింది. కునార్ ప్రావిన్స్లో మొత్తం మూడు గ్రామాలు పూర్తిగా తుడిచిపెట్టుకొని పోయాయి. ఈ ప్రాంతంలో మట్టితో నిర్మించిన ఇళ్లే అధికం కావడంతో మృతుల సంఖ్య మరింతగా పెరిగే సూచనలు ఉన్నాయని అధికార వర్గాలు భావిస్తున్నాయి. అయిదు రాష్ట్రాల్లోని సుమారు 10.20 లక్షల మందిపై భూకంప ప్రభావం ఉంటుందని అమెరికా భూగర్భ సర్వే విభాగం అంచనా వేసింది. రోడ్లు పూర్తిగా పాడవడంతో సహాయ బృందాలు వెళ్లలేకపోతున్నాయి. దాంతో సైన్యమే విమానాల ద్వారా క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తోంది. 40 విమానాలు సేవలు అందిస్తున్నాయని, ఇంతవరకు 420 మంది క్షతగాత్రులను తరలించినట్టు సైన్యం ప్రకటించింది. నష్టం అధికంగా ఉండడంతో ఆదుకోవాలని తాలిబన్ ప్రభుత్వం అన్ని దేశాలను కోరింది. 2021లో ఆఫ్గాన్లో తాలిబాన్ ప్రభుత్వం ఏర్పాటయిన నుంచి చాలా దేశాలు సహాయాన్ని నిలిపివేశాయి. ఈ నేపథ్యంలో తాలిబన్ ప్రభుత్వం చేసిన ఈ వినతి ప్రాధాన్యం సంతరించుకొంది. అంతర్జాతీయంగా తమను ఆదుకోవాలని ఆరోగ్య శాఖ అధికార ప్రతినిధి షరాఫత్ జమాన్ కోరారు. భారీ వర్షాలు కురుస్తుండడం, రోడ్లు పూర్తిగా పాడవడంతో సహాయ బృందాలు వెళ్లలేకపోతునున్నాయని ఐక్యరాజ్యసమితి మానవతా వ్యవహారాల సమన్వయ విభాగం అధికారి కేట్ కారే చెప్పారు. నీటి వనరులు కలుషితం కాకుండా జంతువుల కళేబరాలను వెంటవెంటనే తొలగిస్తున్నట్టు తెలిపారు.
అండగా ఉంటాం: మోదీ
అఫ్గాన్లో భూకంపం కారణంగా భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభించడంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. అండగా ఉంటామని, మానవతా సాయం అందిస్తామని ప్రకటించారు. మరోవైపు తక్షణ సాయం కింద భారత్ 15 టన్నుల ఆహార పదార్థాలను కాబూల్ నుంచి కునార్కు పంపించిందని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయ్ శంకర్ ఎక్స్ ద్వారా తెలిపారు. 1,000 ఫ్యామిలీ టెంట్లను పంపించినట్టు పేర్కొన్నారు. మంగళవారం నుంచి పలు రకాల సహాయ సామగ్రిని పంపిస్తామని పేర్కొన్నారు. ఆయన అఫ్గాన్ విదేశాంగ శాఖ మంత్రి మావ్లావీ అమీర్ ఖాన్ ముత్తాకీతో మాట్లాడారు. అఫ్గాన్లోని తమ బృందాలు సహాయ చర్యల్లో పాల్గొంటున్నాయని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ అంటోనియా గుటెర్రస్ ప్రకటించారు. మృతులకు సంతాపం తెలుపుతూ పోప్ లియో సందేశం పంపారు. సాధ్యమైనంత మేర సాయం అందిస్తామని చైనా కూడా ప్రకటించింది. తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తరువాత మూడు పెద్ద భూకంపాలు సంభవించడం గమనార్హం.
ఇవి కూడా చదవండి..
ఒకే కారులో ప్రయాణించిన మోదీ, పుతిన్
ఎస్సీఓ సమిట్లో ప్రత్యేక ఆకర్షణగా మోదీ, పుతిన్ బంధం..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి