Mallikarjun Kharge: కేంద్రంలో నాయకత్వ సంక్షోభం, అసమర్థత
ABN , Publish Date - Jul 11 , 2025 | 04:25 AM
కేంద్రంలోని బీజేపీ నాయకత్వం ప్రసంగాలు, ప్రకటనలతో బిజీ ఉందని, వారికి ప్రజల బాధలు పట్టవని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు.
ప్రసంగాలు, ప్రకటనలతోనే వారంతా బిజీ: ఖర్గే ధ్వజం
న్యూఢిల్లీ, జూలై 10 (ఆంధ్రజ్యోతి): కేంద్రంలోని బీజేపీ నాయకత్వం ప్రసంగాలు, ప్రకటనలతో బిజీ ఉందని, వారికి ప్రజల బాధలు పట్టవని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. దేశంలో జరుగుతున్న ప్రమాదాలు వారి నాయకత్వ సంక్షోభం, అసమర్థతకు నిదర్శనమని అన్నారు. వరుస ప్రమాదాలపై గురువారం ఎక్స్ వేదికగా ఖర్గే బీజేపీ నాయకత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ నాయకత్వ సంక్షోభం, అసమర్థ పాలన కారణంగా అన్ని విభాగాల్లోనూ అవినీతి పెరిగిపోయిందని ఆరోపించారు. అందుకే గుజరాత్లో వంతెన కూలిపోవడం, అహ్మదాబాద్ విమాన ప్రమాదం వంటి విషాద ఘటనలు జరిగాయని అన్నారు. మూడేళ్ల క్రితమే వంతెన ప్రమాదకరంగా ఉన్నట్లు హెచ్చరికలు వచ్చాయని, అయినా చర్యలు తీసుకోలేదని విమర్శించారు. అలాగే, గుజరాత్లో తరచుగా వంతెనలు కూలిపోతుండడం, ఇతర ప్రమాదాలకు బాధ్యత వహిస్తూ సీఎం భూపేంద్ర పటేల్, హోంమంత్రి హర్ష్ సంఘ్వి రాజీనామా చేయాలని సీనియర్ నేతలు లాల్జీ దేశాయ్, జిగ్నేష్ మేవాని డిమాండ్ చేశారు.