Share News

Jyoti Malhotra: పహల్గాం దాడికి ముందే ఇలా చేశాను.. జ్యోతి మల్హోత్రా సంచలన వ్యాఖ్యలు

ABN , Publish Date - May 21 , 2025 | 02:35 PM

పహల్గామ్ దాడికి ముందు నుండే తనకు పాక్ అధికారితో సంబంధాలున్నాయని యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా విచారణలో సంచలన వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా..

Jyoti Malhotra: పహల్గాం దాడికి ముందే ఇలా చేశాను.. జ్యోతి మల్హోత్రా  సంచలన వ్యాఖ్యలు
Jyoti Malhotra

Jyoti Malhotra: 'అవును.. పాకిస్థాన్ ఏజెంట్లతో నాకు సంబంధాలున్నాయి' అంటూ దేశద్రోహం కేసులో అరెస్ట్ అయిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా విచారణలో సంచలన వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. పాకిస్థాన్ తరపున గూఢచర్యం చేసినట్లు ఆమె అంగీకరించిదని హిసార్ పోలీసు ప్రతినిధి తెలిపారు. ఇటీవల అరెస్ట్ అయిన హర్యానాకు చెందిన జ్యోతి మల్హోత్రా, పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ ఏజెంట్లతో సంబంధాలు కలిగి ఉన్నట్లు ఒప్పుకుందని, న్యూఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్ మాజీ అధికారి డానిష్‌తో తాను తరచుగా సంప్రదింపులు జరిపిందని ఆమె ఒప్పుకున్నారన్నారు.


జ్యోతి షాకింగ్ కామెంట్స్

'ట్రావెల్ విత్ JO' అనే యూట్యూబ్ ఛానల్ ఉన్న జ్యోతి మల్హోత్రా 2023లో పాకిస్తాన్ వెళ్లడానికి వీసా పొందడానికి ఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్‌కు వెళ్లినట్లు తెలిపింది. అక్కడ అహ్సాన్-ఉర్-రహీం అలియాస్ డానిష్‌తో పరిచయం ఏర్పడిందని, తన మొబైల్ నంబర్ తీసుకొని తరచుగా అతనితో మాట్లాడేదానినని, రెండుసార్లు పాకిస్థాన్‌కు కూడా వెళ్లానని తెలిపింది. అక్కడ డానిష్ తనకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశాడని, అంతేకాకుండా తన ప్రయాణానికి కూడా ఏర్పాట్లు చేశాడని విచారణలో చెప్పింది. డానిష్ ద్వారా పరిచయమైన అలీ హసన్ అనే వ్యక్తి తనకు పాకిస్థాన్ నిఘా అధికారులుగా ఉన్న షకీర్, రాణా షాబాజ్‌ అనే ఇద్దరు వ్యక్తులను పరిచయం చేశాడని తెలిపింది. షకీర్ మొబైల్ నంబర్‌ను తన మొబైల్‌లో 'జాట్ రాధావన్' అనే పేరుతో సేవ్ చేసుకున్నానని.. అందువల్ల తనను ఎవరూ అనుమానించలేదని తెలిపింది.

Jyothy (1).jpg


త్రివిధ దళాల వివరాలను..

భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత తాను వాట్సాప్, స్నాప్‌చాట్, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల ద్వారా పాక్ ఏజెంట్లతో టచ్‌లోనే ఉన్నానని.. ఈ క్రమంలోనే దేశానికి సంబంధించిన సమాచారాన్ని వారికి షేర్ చేసేదానినని జ్యోతి మల్హోత్ర ఒప్పుకుంది. ఢిల్లీలోని పాక్ హైకమిషన్‌లో డానిష్‌ను తాను చాలాసార్లు కలిసినట్లు తెలిపింది. త్రివిధ దళాల వివరాలను పాకిస్థాన్ నిఘా సంస్థకు చెందిన కార్యకర్తలతో, ముఖ్యంగా పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్ (PIOలు)గా ఉన్న షకీర్, రాణా షాబాజ్ అనే వ్యక్తులతో అత్యంత సున్నితమైన సమాచారాన్ని పంచుకున్నట్లు అధికారుల విచారణలో అంగీకరించింది. ఎవరికి అనుమానం రాకుండా స్నాప్‌చాట్, టెలిగ్రామ్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో వేరే IDలను ఇందుకు ఉపయోగించింది. అట్టారి, రాజస్థాన్ సరిహద్దుల్లో దళాల మోహరింపునకు సంబంధించిన రహస్య వివరాలను షకీర్‌తో షేర్ చేసినట్లు విచారణలో తాను చేసిన తప్పులను ఒప్పుకుంది.

India.jpg

Updated Date - May 21 , 2025 | 03:19 PM