J&K Police: ఉగ్రవాదులకు ఝలక్ ఇచ్చిన జమ్మూ కశ్మీర్ పోలీసులు
ABN , Publish Date - Jun 22 , 2025 | 09:28 AM
ఉగ్రవాద చర్యల కారణంగా జమ్మూ కశ్మీర్లో ఆశాంతి నెలకొంటుంది. అలాంటి వేళ.. ఆ రాష్ట్రంలో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది.
శ్రీనగర్, జూన్ 22: పాకిస్థాన్ పారిపోయి అక్కడి నుంచి జమ్మూ కాశ్మీర్తోపాటు పాక్ సరిహద్దు ప్రాంతంలో ఉగ్రవాద చర్యలను ప్రోత్సహిస్తున్న ఇద్దరు వ్యక్తుల స్థిరాస్తులను కోర్టు ఆదేశాల మేరకు ఆ రాష్ట్ర పోలీసులు సీజ్ చేశారు. 2003లో హంద్వారాలో మహమ్మద్ షఫీ బారా, జీ హెచ్ ముస్తాఫాలు ఉగ్రవాద చర్యలకు పాల్పడ్డారు. హంద్వారా, మూన్బాల్ వాసులైన వీరిద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం వీరిద్దరు పాకిస్థాన్కు పారిపోయారు.
వీరిపై కొనేళ్లుగా కోర్టులో విచారణ కొనసాగుతోంది. ఆ క్రమంలో జూన్ 20వ తేదీన కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. వీరిద్దరి ఆస్తులను సీజ్ చేయాలంటూ జమ్మూ కశ్మీర్ పోలీసులను కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో షఫీ బారా, ముస్తాఫాల ఆస్తులను పోలీసులు సీజ్ చేశారు. సరిహద్దు ప్రాంతంలో ఉద్రిక్తతలు రేకెత్తించేందుకు వీరిద్దరు ఉగ్రవాద చర్యలను చాలా కాలంగా ప్రోత్సహిస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. అంతేకాకుండా.. ఆ ప్రాంతంలో ఉగ్రవాద చర్యల్లో వీరిద్దరి ప్రమేయం బలంగా ఉందనే ఆరోపణలు సైతం ఉన్నాయి.
మరోవైపు ఏప్రిల్ 22వ తేదీ జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మరణించారు. ఈ ఘటనకు తామే బాధ్యులమంటూ ప్రముఖ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా అనుబంధ సంస్థ ది రిసిస్టెన్స్ ఫ్రెంట్ ప్రకటించింది. దీంతో ఈ ఉగ్రదాడి ఘటనకు కర్త, కర్మ, క్రియ అంతా పాకిస్థానేనని భారత్ భావించింది. ఆ క్రమంలో పాక్కు వ్యతిరేకంగా భారత్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. గతంలో పాక్తో చేసుకున్న సింధు జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసుకుంది.
అలాగే పాక్ సైతం సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసింది. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అలాంటి వేళ.. భారత్ ఆపరేషన్ సిందూర్ పేరిట పాకిస్థాన్తోపాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు నిర్వహించింది. ఈ ఘటనలో వంద మందికి పైగా ఉగ్రవాదులు మరణించారు. అనంతరం సరిహద్దు వెంబడి రాష్ట్రాలే లక్ష్యంగా పాకిస్థాన్ క్షిపణులు, డ్రోనులతో దాడులు నిర్వహించింది. వీటిని భారత్ తిప్పికొట్టింది. ఇక పాకిస్థాన్ ఎయిర్బేస్లే లక్ష్యంగా భారత సైనిక బలగాలు దాడులు చేయడంతో పొరుగుదేశం పాక్ కాళ్ల బేరానికి దిగింది.
అనంతరం సరిహద్దు వద్ద కొన్ని చెదురు మదురు సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఆ తర్వాత అంటే.. ప్రస్తుతం జమ్మూ కశ్మీర్లోనే కాకుండా.. సరిహద్దు ప్రాంతంలో సైతం ఉగ్రవాద దాడులు జరగడం లేదు. ఇది కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్లే సాధ్యమైందనే చర్చ జరుగుతోంది. అంతేకాకుండా.. కోర్టు తాజా తీర్పుతో ఉగ్రవాద చర్యలుకు పాల్పడుతున్న వారి ఆస్తులు సీజ్ చేయడం వల్ల కూడా భవిష్యత్తులో ఈ తరహా చర్యలకు ఆస్కారమే ఉండదనే ఓ ప్రచారం సైతం సాగుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
తరగతి గదిలో విద్యార్థులు.. వారి ఎదుటే ఆ ఉపాధ్యాయుడు ఏం చేశాడంటే..
ఢిల్లీలో పాత వాహనాలకు పెట్రోల్, డీజిల్ బంద్
For National News And Telugu News