Share News

Jaipur Hospital Fire: జైపూర్ ప్రమాదంపై అమిత్ షా విచారం, సిబ్బంది నిర్లక్ష్యం వల్లేనని బాధితుల మండిపాటు

ABN , Publish Date - Oct 06 , 2025 | 01:01 PM

జైపూర్‌లోని సవాయి మాన్ సింగ్ హాస్పిటల్ ట్రామా సెంటర్‌‌లో జరిగిన అగ్ని ప్రమాదంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా విచారం వ్యక్తం చేశారు.అయితే, ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని..

Jaipur Hospital Fire:  జైపూర్ ప్రమాదంపై అమిత్ షా విచారం, సిబ్బంది నిర్లక్ష్యం వల్లేనని బాధితుల మండిపాటు
Jaipur hospital fire

న్యూఢిల్లీ, అక్టోబర్ 6: జైపూర్‌లోని సవాయి మాన్ సింగ్ హాస్పిటల్ ట్రామా సెంటర్‌‌లో జరిగిన ప్రమాదంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా విచారం వ్యక్తం చేశారు. ఆస్పత్రి ఐసియు యూనిట్ లో జరిగిన అగ్నిప్రమాదంలో ఆరుగురు మరణించిన ఘటనపై అమిత్ షా 'ఎక్స్' లో స్పందించారు. మృతుల కుటుంబాలకు అమిత్ షా సంతాపం తెలిపారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.

సోషల్ మీడియా Xలో రాసిన ఒక పోస్ట్‌లో అమిత్ షా.. 'జైపూర్‌లోని సవాయి మాన్ సింగ్ ఆసుపత్రిలో జరిగిన అగ్నిప్రమాదం విషాదకరం. రోగుల భద్రత, వారి చికిత్స, బాధితుల సంరక్షణ కోసం స్థానిక యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంటోంది. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా సంతాపం. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.' అని అమిత్ షా చెప్పారు.


ఇలా ఉండగా, ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపిస్తూ బాధిత బంధువులు ఆసుపత్రి యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వంపై తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. జనం ఆస్పత్రి వెలుపల గుమిగూడి, హాస్పిటల్ సిబ్బంది.. యాజమాన్యం, రాష్ట్రంలోని బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఐసియులో షార్ట్ సర్క్యూట్ గురించి తెలియజేసినప్పుడు ఆసుపత్రి సిబ్బంది ఎంతో నిర్లక్ష్యంగా వ్యవహరించారని నిరసనకారులు ఆరోపించారు.. సమాచారం ఇచ్చినప్పటికీ వారు మా మాట వినలేదని వాపోయారు. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా తమ ప్రియమైన వారిని కోల్పోయామని కన్నీటి పర్యంతమయ్యారు. వాళ్లు బాధ్యతగా వ్యవహరించి ఉంటే, ప్రాణాలు పోయే పరిస్థితి ఉండేది కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరోవైపు, ఐసియులో చేరిన రోగుల బంధువులు ఆ ప్రమాద క్షణాల్లో ఏం జరిగిందో చెప్పారు. 'స్పార్క్ వచ్చినప్పుడు, దాని పక్కన ఒక సిలిండర్ ఉంది. పొగ ఐసియు అంతటా వ్యాపించింది. దీనివల్ల అందరూ భయాందోళనకు గురై పారిపోయారు. కొందరు తమ సొంత వాళ్లని రక్షించగలిగారు, అక్కడ మంటలు ఆర్పటానికి ఎలాంటి పరికరాలు కనిపించలేదు. ఇదే విషయాన్ని చాలా మంది అనడం మాకు వినిపించింది.' అని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి...

ఏపీలో భారీ అగ్ని ప్రమాదం.. ఏమైందంటే..

వాయుగుండం ఎఫెక్ట్.. ఏపీలో భారీ వర్షాలు

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 06 , 2025 | 01:19 PM