ESTIC Conclave 2025: మోదీ నేతృత్వంలో ఒక్క ఏడాదిలోనే 200కి పైగా మైలురాళ్లు: ఇస్రో
ABN , Publish Date - Oct 23 , 2025 | 06:23 PM
శాస్త్ర, సాంకేతిక రంగాల వారంతా ఒకే వేదికపై కలిసేందుకు ESTIC-2025 ఎంతగానో ఉపయోగపడుతోందని ఇస్రో ఛైర్మన్ అన్నారు. పరస్పరం ఆలోచనలు పంచుకుని, కలిసి పని చేస్తూ.. వచ్చే రెండు దశాబ్దాలకు మన విజన్ రెడీ చేసుకోవాలని సూచించారు.
బెంగళూరు: ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో తాము ఒక్క ఏడాదిలోనే 200కి పైగా ముఖ్యమైన మైలురాళ్లను చేరుకున్నామని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తెలిపింది. భారత అంతరిక్ష రంగం 2025లో అద్భుత పురోగతిని సాధించిందని ఇస్రో ఛైర్మన్ వి.నారాయణన్ చెప్పారు. బెంగళూరులో ఎమర్జింగ్ సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ కాంక్లెవ్- 2025 (ESTIC-2025) కర్టన్ రైజర్ కార్యక్రమంలో నారాయణన్ మాట్లాడారు.
శాస్త్ర, సాంకేతిక రంగాల వారంతా ఒకే వేదికపై కలిసేందుకు ESTIC-2025 ఎంతగానో ఉపయోగపడుతోందని ఇస్రో ఛైర్మన్ అన్నారు. పరస్పరం ఆలోచనలు పంచుకుని, కలిసి పని చేస్తూ.. వచ్చే రెండు దశాబ్దాలకు మన విజన్ రెడీ చేసుకోవాలని సూచించారు. గగన్ యాన్, చంద్రయాన్ లాంటి ప్రాజెక్టులు సాధించడం కేవలం ఇస్రో ఘనత మాత్రమే కాదని, ఇందులో భారత సాంకేతిక వ్యవస్థ ఉమ్మడి కార్యచరణ, సామర్థ్యం ఉందన్నారు.
మరోవైపు, రూ.400 కోట్లతో మూడో లాంఛ్ ప్యాడ్ ను తమిళనాడులో నిర్మించేందుకు ఆమోదం పొందామని ఛైర్మన్ వెల్లడించారు. జనవరి 6న ఆదిత్య ఎల్-1 మిషన్ నుంచి సేకరించిన 10 టెరాబైట్ల సాంకేతిక డేటాను విడుదల చేశామన్నారు. ఇప్పటి వరకు ఆదిత్య మిషన్ నుంచి దాదాపు 15 టెరాబైట్ల డేటాను ప్రచురించామని చెప్పారు.
అంతేకాదు, తొలిసారిగా ఆర్బిట్ డాకింగ్ ప్రయోగం స్పేడెక్స్ను జనవరి 16న చేపట్టామని.. గంటకు 28,400కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే రెండు ఉపగ్రహాలను డాకింగ్ చేశామని ఇస్రో ఛైర్మన్ వెల్లడించారు. ఆల్గారిథమ్స్, కెమెరాలతోపాటు వివిధ వ్యవస్థలను ఉపయోగించి ఈ రెండు శాటిలైట్లను విజయవంతంగా డాకింగ్ చేశామని ఆయన చెప్పారు. ఫలితంగా ప్రపంచంలోనే స్పేస్ డాకింగ్ చేసిన నాలుగో దేశంగా భారత్ రికార్డ్ సృష్టించిందన్నారు.
కాగా, ESTIC-2025 కార్యక్రమాన్ని కేంద్ర శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది. ఇందులో స్పేస్ డిపార్ట్మెంట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ, డీఆర్డీఓ లాంటి సంస్థలు భాగస్వాములుగా ఉంటాయి. ఇందులో 40కి పైగా సాంకేతిక స్టార్టప్ సంస్థల నవకల్పనలు ప్రదర్శిస్తారు.
ఇవి కూడా చదవండి
చీకటి నింపిన దీపావళి.. 125 మంది కళ్ళకు గాయాలు.. ఏమైందంటే?
మధ్యాహ్నం భోజనం తర్వాత నిద్రపోవడం ఆరోగ్యానికి మంచిదేనా?