Share News

IMF Loan Pakistan: పాక్‌కు ఐఎంఎఫ్‌ రుణం

ABN , Publish Date - May 10 , 2025 | 04:56 AM

సీమాంతర ఉగ్రవాదానికి ఐఎంఎఫ్‌ నిధులు వాడతారన్న భారత్‌ తీవ్ర అభ్యంతరాల మధ్య పాక్‌కు 100 కోట్ల డాలర్ల రుణాన్ని ఆమోదించింది. గతంలో కూడా పాక్‌ ఎన్నోసార్లు రుణాలు తీసుకొని వాటిని సైన్యం, ఉగ్రవాదం కోసం వాడిందని భారత్‌ ఆరోపించింది.

IMF Loan Pakistan: పాక్‌కు ఐఎంఎఫ్‌ రుణం

100 కోట్ల డాలర్ల విడుదలకు ఓకే.. భారత్‌ అభ్యంతరం

ఉగ్రవాదానికి ఊతమిచ్చే దేశానికి అప్పిస్తే తప్పుడు

సంకేతాలు వెళ్తాయని హెచ్చరిక.. ఓటింగ్‌కు దూరం

న్యూఢిల్లీ, ఇస్లామాబాద్‌, మే 9: అంతర్జాతీయ రుణ సంస్థల నుంచి తీసుకున్న అప్పులను చెల్లించకుండా.. ఆ డబ్బుతో సీమాంతర ఉగ్రవాదానికి ఊతమిస్తున్న పాకిస్థాన్‌కు కొత్తగా రుణం ఇవ్వొద్దంటూ భారత్‌ తీవ్రస్థాయిలో అభ్యంతరం చెప్పినా ఫలితం లేకపోయింది. ఎక్స్‌టెండెడ్‌ ఫండ్‌ ఫెసిలిటీ (ఈఎ్‌ఫఎఫ్‌) కింద.. దాయాది దేశానికి 100 కోట్ల డాలర్ల నిధులు (మన కరెన్సీలో దాదాపు రూ.8540 కోట్లు. పాకిస్థాన్‌ కరెన్సీలో దాదాపు రూ.28 వేల కోట్లు) తక్షణం ఇవ్వడానికి ‘అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్‌)’ ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని పాకిస్థాన్‌ ప్రధాని కార్యాలయం ధ్రువీకరించింది. పాకిస్థాన్‌కు ఈఎ్‌ఫఎఫ్‌ కింద ఇవ్వదలచిన 700 కోట్ల డాలర్లలో 100 కోట్ల డాలర్ల విడుదల, కొత్త అప్పు కింద మరో 130 కోట్ల డాలర్లు.. మొత్తం కలిపి 230 కోట్ల డాలర్ల రుణం ఇచ్చే ప్రతిపాదనలను పరిశీలించేందుకు ఐఎంఎఫ్‌ శుక్రవారం బోర్డు మీటింగ్‌ నిర్వహించింది. అయుతే.. పాక్‌కు రుణ ప్రతిపాదనను భారత్‌ తీవ్రంగా వ్యతిరేకించింది. పాకిస్థాన్‌కు ఆర్థిక సాయం అందిస్తే ఆ డబ్బును ఉగ్రవాదుల కోసమే ఉపయోగిస్తుందని ఆందోళన వెలిబుచ్చింది. సీమాంతర ఉగ్రవాదానికి పాల్పడుతున్న పాకిస్థాన్‌కు రుణమిస్తే.. అంతర్జాతీయ సమాజానికి తప్పుడు సంకేతం పంపినట్టవుతుందని, రుణసంస్థల ప్రతిష్ఠను సైతం అది దెబ్బతీస్తుందని అభిప్రాయపడింది. పాకిస్థాన్‌ చాలాకాలంగా ఐఎంఎఫ్‌ నుంచి అప్పులు తీసుకుంటూనే ఉందని..


గడిచిన 35 సంవత్సరాల్లో 28 సార్లు పాక్‌ అంతర్జాతీయ ద్రవ్యనిధి నుంచి రుణాలు తీసుకుందని.. గడిచిన ఐదేళ్లలో నాలుగు ఐఎంఎఫ్‌ ప్రోగ్రామ్‌లు పాక్‌లో అమలయ్యాయని గుర్తుచేసింది. కానీ, ఆ రుణాలు ఇచ్చే సమయంలో ఐఎంఎఫ్‌ పెట్టే షరతులకు కట్టుబడి ఉండడంలో, వాటిని అమలు చేయడంలో మాత్రం పాక్‌కు మంచి రికార్డు లేదని ధ్వజమెత్తింది. అలా పేరుకుపోయిన బకాయిల కారణంగా.. పాక్‌కు ఐఎంఎఫ్‌ మళ్లీ మళ్లీ రుణాలు ఇవ్వక తప్పని స్థితి నెలకొందని ఆవేదన వెలిబుచ్చింది. గతంలో తీసుకున్న అప్పులను పాక్‌ సక్రమంగా వినియోగించి ఉంటే ఆదేశ ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉండేదని.. ఇప్పుడిలా ఉద్దీపన ప్యాకేజీ కోసం ఐఎంఎ్‌ఫను ఆశ్రయించాల్సిన పనే ఉండేది కాదని స్పష్టం చేసింది. ‘‘ఐఎంఎఫ్‌ వంటి అంతర్జాతీయ రుణసంస్థల నుంచి నిధులు వస్తూ ఉంటే.. పాక్‌ వాటిని సైన్యానికి, ప్రభుత్వ ప్రాయోజిత సీమాంతర ఉగ్రవాదుల కోసం వినియోగిస్తుంది’’ అని హెచ్చరించింది. పాకిస్థాన్‌కు ఐఎంఎఫ్‌ రుణాల విషయంలో రాజకీయ జోక్యం ఉందన్న అభిప్రాయం సర్వత్రా వ్యాపించి ఉందని వ్యాఖ్యానించింది. పాక్‌కు రుణాలు ఇచ్చే విషయంలో ఐఎంఎఫ్‌ కేవలం విధానపరమైన, సాంకేతిక అంశాలనే పరిగణనలోకి తీసుకుంటోందని ఆక్షేపించిన భారత్‌.. అంతర్జాతీయ రుణ సంస్థలు అప్పులు ఇవ్వడానికి అనుసరించే విధానాల్లో నైతిక విలువలను సైతం పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పింది. ఈ కారణాలతో.. పాక్‌కు రుణంపై ఐఎంఎఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ బోర్డు మీటింగ్‌లో నిర్వహించిన ఓటింగ్‌కు భారత్‌ దూరంగా ఉంది.


ఇవి కూడా చదవండి

India Pakistan Tensions: భారత్, పాకిస్తాన్ ఉద్రిక్తత వేళ.. దేశంలో నిత్యావసరాలపై కీలక ప్రకటన

India Pakistan Tension: భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తత వేళ జమ్మూ నుంచి ఢిల్లీకి మూడు ప్రత్యేక రైళ్లు

Virat Kohli: సైనికుల సేవలకు హృదయపూర్వక ధన్యవాదాలు..జై జవాన్‌కు జై కోహ్లీ

RSS: దేశ భద్రత విషయంలో ప్రతి భారతీయుడు భాగస్వామ్యం కావాలి: ఆర్ఎస్ఎస్..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 10 , 2025 | 04:56 AM