Defense: రంగంలోకి ప్రాదేశిక సైన్యం
ABN , Publish Date - May 10 , 2025 | 04:02 AM
పాకిస్థాన్తో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ప్రభుత్వం ప్రాదేశిక సైన్యాన్ని రంగంలోకి దించాలని కీలక నిర్ణయం తీసుకుంది. గత యుద్ధాల్లోని అనుభవంతో ఈ సిబ్బంది దేశ రక్షణకు మరింత బలంగా నిలవనున్నారు.

అవసరమైతే పిలిపించాలన్న కేంద్రం
ఆర్మీ చీఫ్కు మరిన్ని అధికారాల అప్పగింత
టెరిటోరియల్ ఆర్మీలో 50 వేల సిబ్బంది
వీరిలో క్రీడాకారులు, రాజకీయ నేతలూ..
గతంలో పలు యుద్ధాల్లో ఆర్మీకి సహకారం
న్యూఢిల్లీ, మే 9: పాకిస్థాన్తో తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అవసరమైతే ప్రాదేశిక సైన్యం (టెరిటోరియల్ ఆర్మీ)ని కూడా రంగంలోకి దించాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రాదేశిక సైన్యంలోని అధికారులను, నమోదు చేసుకున్న సిబ్బందిని పిలవాల్సిందిగా ఆర్మీ చీఫ్కు సూచించింది. ఇప్పటికే డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేసిన పాక్ను భారత్ సమర్థంగా అడ్డుకున్న విషయం తెలిసిందే. పాక్ చేసిన ఆ రెండు ప్రయత్నాలు విఫలం కావడంతో ఆ దేశం మరో కుతంత్రానికి తెర తీసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. సరిహద్దు ప్రాంతాల్లో దాడులు చేసి భారత్ను ఇబ్బంది పెట్టేలా పాక్ పన్నాగం పన్నుతోంది. పాక్కు ఆ అవకాశం ఇవ్వకుండా భారత ఆర్మీని మరింత దృఢంగా తయారు చేసేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు భారత ఆర్మీ చీఫ్కు మరిన్ని అధికారాలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతకుముందు కూడా ప్రాదేశిక సైన్యం సిబ్బంది పలు సందర్భాల్లో యుద్ధాల్లో పాల్గొన్నారు. 1962లో చైనాతో, 1965, 1971లో పాకిస్థాన్తో యుద్ధాల్లో ప్రాదేశిక సైన్యం.. భారత ఆర్మీతో కలిసి పని చేసింది. ప్రకృతి వైపరీత్యాల్లోనూ వీరు సేవలందించారు.
ప్రాదేశిక సైన్యం అంటే?
ప్రాదేశిక సైన్యం అనేది భారత సైన్యానికి రిజర్వ్ ఫోర్స్. దేశంలో క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు భారత ఆర్మీకి సహకారం అందించేందుకు ఈ సైన్యం సిద్ధంగా ఉంటుంది. వీరంతా రెగ్యులర్ ఆర్మీలో భాగమే అయినా.. నిరంతరం సైన్యంతో ఉండరు. యుద్ధంలో అవసరమైన సందర్భాల్లో, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు రంగంలోకి దిగుతారు. వీరంతా బయట ఇతర ఉద్యోగాలు, స్వయం ఉపాధి పొందుతూనే స్వచ్చందంగా సైన్యంతో పనిచేస్తుంటారు. ప్రాదేశిక సైన్యం రెండు యూనిట్లుగా ఉంది. మొదటిది.. ప్రభుత్వరంగ సంస్థలు, భారత రైల్వే, మాజీ సైనికోద్యోగులతో కూడిన డిపార్ట్మెంటల్ యూనిట్. రెండోది.. సాధారణ పౌరులతో కూడిన నాన్ డిపార్ట్మెంటల్ యూనిట్. శారీరకంగా, మానసికంగా తగిన ఫిట్నెస్ ఉన్నవారినే ఈ సైన్యంలోకి తీసుకుంటారు. ఇందులోని సిబ్బంది, అధికారులకు రెగ్యులర్ ఆర్మీ తరహాలోనే శిక్షణ ఇస్తారు. కనీసం ఐదేళ్లు సర్వీస్ పూర్తి చేసిన వారికి పింఛనుతోపాటు ఇతర ప్రయోజనాలు అందజేస్తారు. ప్రస్తుతం 32 బెటాలియన్లలో దాదాపు 50 వేల మంది ఈ ఆర్మీలో ఉన్నట్లు సమాచారం. పలువురు పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులు, రాజకీయ నాయకులు కూడా వీరిలో ఉంటారు. మలయాళ నటుడు మోహన్లాల్, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎం.ఎ్స.ధోనీ, దిగ్గజ క్రికెటర్ కపిల్దేవ్, రాజకీయ పార్టీల నేతలు సచిన్ పైలట్, అనురాగ్ ఠాకూర్, అభినవ్ బింద్రా తదితరులు ప్రాదేశిక సైన్యంలో లెఫ్టినెంట్ కల్నల్ హోదా కలిగి ఉన్నారు.
ఇవి కూడా చదవండి
India Pakistan Tensions: భారత్, పాకిస్తాన్ ఉద్రిక్తత వేళ.. దేశంలో నిత్యావసరాలపై కీలక ప్రకటన
India Pakistan Tension: భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తత వేళ జమ్మూ నుంచి ఢిల్లీకి మూడు ప్రత్యేక రైళ్లు
Virat Kohli: సైనికుల సేవలకు హృదయపూర్వక ధన్యవాదాలు..జై జవాన్కు జై కోహ్లీ
RSS: దేశ భద్రత విషయంలో ప్రతి భారతీయుడు భాగస్వామ్యం కావాలి: ఆర్ఎస్ఎస్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి