Indian Air Force: ఎగిరి వెళ్లే శవపేటికలు
ABN , Publish Date - Aug 25 , 2025 | 02:39 AM
భారత వైమానిక దళానికి దాదాపు ఆరు దశాబ్దాలపాటు సేవలందించిన యుద్ధ విమానాలు.. ఎగిరే శవపేటికలుగా పేరొందిన మిగ్ 21లకు ఈ ఏడాది సెప్టెంబరుకల్లా పూర్తిగా సెలవు ప్రకటించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే...
శత్రువులపై ఆత్మాహుతిదాడులకు మిగ్-21 విమానాలు
డీకమిషన్ చేస్తున్న మిగ్-21లను కమికాజే డ్రోన్లుగా మార్చే యోచన?
టార్గెట్ డ్రోన్లుగా.. శత్రు రేడార్లను మభ్యపెట్టే విమానాలుగా వాడకం!
గూఢచర్యానికి ఉపయోగించే ప్రతిపాదనలపై విస్తృత చర్చ
న్యూఢిల్లీ, ఆగస్టు 24: భారత వైమానిక దళానికి దాదాపు ఆరు దశాబ్దాలపాటు సేవలందించిన యుద్ధ విమానాలు.. ఎగిరే శవపేటికలుగా పేరొందిన మిగ్ 21లకు ఈ ఏడాది సెప్టెంబరుకల్లా పూర్తిగా సెలవు ప్రకటించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే! వాటి స్థానాన్ని స్వదేశీ తేజస్ ఎల్సీఏ మార్క్-1ఏ విమానాలతో భర్తీ చేసేందుకు ఐఏఎఫ్ సిద్ధమైంది. అయితే.. మిగ్-21లకు పూర్తిగా వీడ్కోలు పలకడం వల్ల వాయుసేనకు యుద్ధవిమానాల కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో.. డీకమిషన్ చేసిన మిగ్ 21లను ఆత్మాహుతి డ్రోన్లుగా, శత్రు రేడార్లను మభ్యపెట్టే విమానాలుగా.. గూఢచర్యానికి.. ఇలా ఇతరత్రా రకరకాల మార్గాల్లో వినియోగించుకునే ప్రతిపాదనలపై చర్చలు జరుగుతున్నట్టు సమాచారం.
టార్గెట్ డ్రోన్లు: పైలట్ రహిత మిగ్-21లను ఏరియల్ టార్గెట్లుగా వినియోగించడం. అంటే.. ఎయిర్-టు-ఎయిర్, సర్ఫే్స-టు-ఎయిర్ మిస్సైళ్లను పరీక్షించడానికి హైస్పీడ్ టార్గెట్లు అవసరం అవుతాయి. అలాంటి టార్గెట్లుగా మానవరహిత మిగ్-21లను ఉపయోగించాలనే ప్రతిపాదన ఇది. ఒక్కమాటలో చెప్పాలంటే.. మన క్షిపణుల సామర్థ్యాన్ని పరీక్షించుకునేందుకు ఈ మిగ్-21లు ప్రాక్టీ్సగా ఉపయోగపడతాయన్నమాట.
కంబాట్ డ్రోన్లు: మిగ్-21 బైసన్లను ‘కంబాట్ ఎయిర్ టీమింగ్ సిస్టమ్ (క్యాట్స్)’ ప్రోగ్రామ్ కింద కంబాట్ డ్రోన్లుగా మార్చడం. ఇవి మానవ రహిత యుద్ధవిమానాలుగా పనిచేస్తాయి. హైరిస్క్ మిషన్స్లో వీటిని ముందుగా పంపి.. శత్రు రేడార్లు, క్షిపణి రక్షణ వ్యవస్థలు యాక్టివేట్ అయ్యేలా చేస్తారు. ఆ తర్వాత మన యుద్ధవిమానాలు దాడులు చేసి ఆయా రేడార్లు, క్షిపణి రక్షణ వ్యవస్థలను నాశనం చేస్తాయి. అమెరికా ఇప్పటికే పాత ఎఫ్-16లను క్యూఎ్ఫ-16టార్గెట్ డ్రోన్లుగా మార్చి వాడుతోంది. చైనా, రష్యా కూడా పాత యుద్ధవిమానాలను ఇదే తరహాలో వినియోగిస్తున్నట్లు సమాచారం.

కమ్యూనికేషన్ రిలే టవర్: శత్రుస్థావరాలు ఉండే ప్రాంతాల్లో సురక్షిత కమ్యూనికేషన్ కోసం.. మిగ్-21లను ఎగిరే సమాచార ప్రసార టవర్లుగా ఉపయోగించుకునే ప్రతిపాదన ఇది
కమికాజే స్ట్రైక్ రోల్: మానవ రహిత మిగ్-21లో భారీగా పేలుడు పదార్థాలు నింపి ఆత్మాహుతి డ్రోన్గా మార్చి నేరుగా శత్రులక్ష్యాలపై ప్రయోగించడం. అంటే.. ఈ విధానంలో ప్రయోగించిన విమానం ఇక తిరిగి రాదు. దాడి చేసి పేలిపోతుంది. శత్రువుల రేడార్ కేంద్రాలు, క్షిపణి రక్షణ వ్యవస్థలు, రన్వేలపై వీటిని ప్రయోగిస్తారు. దీనివల్ల మనం కోల్పోయేది.. కాలంచెల్లిన పాత మిగ్ విమానాలను మాత్రమే.
గూఢచర్యానికి: మిగ్-21లకు అత్యంత అధునాతనమైన సెన్సర్లను అమర్చి అత్యంత ప్రమాదకరమైన ప్రాంతాల్లో గూఢచర్యానికి పంపొచ్చు. పగలు, రాత్రి శత్రువుల కదలికలను గమనించడానికి.. మేఘాలు, పొగమంచు ఉన్నప్పుడు కూడా భూభాగాన్ని మ్యాప్ చేయడానికి, శత్రువుల సమాచారప్రసారాన్ని పసిగట్టడానికి, శత్రువుల ఎలకా్ట్రనిక్ వ్యవస్థలు ఎక్కడున్నాయో గుర్తించడానికి ఉపయోగించవచ్చు. ప్రస్తుతం మనం హెరాన్, రుస్తుం-2 వంటి యూఏవీలను గూఢచర్యానికి వాడుతున్నాం. కానీ.. మిగ్-21లు వేగంలో వాటికన్నా చాలా మెరుగైనవి. ఎక్కువ పేలోడ్ను మోసుకెళ్లగలవు. స్టెల్త్ సామర్థ్యం లేకపోయినా.. వేగంతో తప్పించుకోగలవు.
అందుకే ఆ పేరు
1963లో తొలిసారి భారత వైమానిక దళం అమ్ములపొదిలో చేరిన మిగ్-21లు దరిమిలా పలు యుద్ధాల్లో సత్తా చాటాయి. ఒక దశలో ఐఏఎఫ్ వద్ద 850కి పైగా మిగ్-21లు ఉన్నాయి. కానీ, ఈ విమానాలు తరచూ కూలిపోవడం వల్ల దాదాపు 200 మంది పైలట్లు చనిపోయారు. పలువురు పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయారు. భారత వాయుసేన విమానాల్లో అత్యధికంగా కూలిపోయినవి ఇవే అందుకే వీటికి ఎగిరే శవపేటికలనే పేరు వచ్చింది.
నాలుగు ఎఫ్-86లు వర్సెస్ మిగ్-21
మిగ్-21లకు ‘ఎగిరే శవపేటికలు’, ‘విడో మేకర్స్’ అనే పేర్లున్నాయిగానీ.. తామెప్పుడూ వాటిని అలా చూడలేదని, వాటి సామర్థ్యం ఏమిటో తమకు తెలుసని ఎయిర్ మార్షల్ (రిటైర్డ్) పృథ్వీసింగ్ బ్రార్ (86) వంటివారు చెబుతున్నారు. 1971 యుద్ధ సమయంలో పాకిస్థాన్ ఎయిర్బే్సలపై బాంబుల వర్షం కురిపించడంలో మిగ్-21లదే కీలకపాత్ర అని ఆయన గుర్తుచేశారు. అప్పట్లో తాను స్వయంగా మిగ్-21లో వెళ్లి పాకిస్థాన్లోని రఫికుల్ ఎయిర్బే్సపై 500 కిలోల బాంబులు రెండింటిని జారవిడిచి.. తిరిగి వస్తుండగా అమెరికాకు చెందిన నాలుగు ఎఫ్-86లు తనను వెంబడించాయని చెప్పారు. ‘‘నా మిగ్-21ను పూర్తివేగంతో నడిపాను. దీంతో పాక్ విమానాలు (మిగ్-21 వేగంతో సరితూగలేక) నన్ను వదిలేశాయి’’ అని ఆయన వివరించారు.
ఇవి కూడా చదవండి..
మరాఠా రిజర్వేషన్పై ఆఖరి పోరాటం.. మనోజ్ జారంగే పిలుపు
రాహుల్ ఓటర్ అధికార్ యాత్రలో జోష్.. హాజరుకానున్న ప్రియాంక
For More National News And Telugu News