Hero Vijay: ఆ ఎయిర్పోర్టుపై ప్రభుత్వానిది కపటనాటకం..
ABN , Publish Date - Jan 21 , 2025 | 12:25 PM
పచ్చటి పొలాలతో కళకళలాడుతున్న పరందూరు సహా 13 గ్రామాల రైతులకు అండగా ఉండాల్సిన రాష్ట్ర ప్రభుత్వం.. ఎవరినో సంతృప్తి పరిచేందుకు విమానాశ్రయ ప్రాజెక్టు అమలు చేయడానికి ప్రయత్నిస్తోందని ‘తమిళగ వెట్రి కళగం’ నేత, నటుడు విజయ్(Actor Vijay) ధ్వజమెత్తారు.
- అన్నదాతలకు అండగా ఉంటా
- అవసరమైతే న్యాయపోరాటానికి సిద్ధం
- రైతుల ఆశీస్సులతోనే ప్రచారం ప్రారంభం
- పరందూర్ రోడ్ షోలో టీవీకే అధినేత విజయ్
చెన్నై: పచ్చటి పొలాలతో కళకళలాడుతున్న పరందూరు సహా 13 గ్రామాల రైతులకు అండగా ఉండాల్సిన రాష్ట్ర ప్రభుత్వం.. ఎవరినో సంతృప్తి పరిచేందుకు విమానాశ్రయ ప్రాజెక్టు అమలు చేయడానికి ప్రయత్నిస్తోందని ‘తమిళగ వెట్రి కళగం’ నేత, నటుడు విజయ్(Actor Vijay) ధ్వజమెత్తారు. సోమవారం మధ్యాహ్నం పరందూరు ఎయిర్పోర్టు(Airport) ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ 900 రోజులకు పైగా ఆందోళనలు చేస్తున్న పరందూరు, ఏకనాపురం సహా 13 గ్రామాల ప్రజలు, రైతులనుద్దేశించి ఆయన ప్రచార వ్యాన్పై నుంచి ఉద్వేగంగా ప్రసగించారు.
ఈ వార్తను కూడా చదవండి: Chennai: అది మార్ఫింగ్ ఫొటోనే.. ప్రభాకరన్తో సీమాన్ ఫొటోపై డైరెక్టర్ శంగగిరి వివరణ
విక్రవాండిలో పార్టీ మహానాడు తర్వాత ఆయన తొలిసారిగా తన రాజకీయ ప్రచారయాత్రకు పరందూరు నుంచి శ్రీకారం చుట్టారు. పరందూరులోని ఓ కల్యాణమండపం వద్ద గ్రామస్థులు, రైతులు, మహిళలనుద్దేశించి ఆయన మాట్లాడుతూ కొత్త విమానాశ్రయం ఏర్పాటుకు తాను వ్యతిరేకం కాదని, పంటపొలాలు, చెరువులు, వాగులతో సస్యశ్యామలంగా ఉన్న పరందూరు పరిసర ప్రాంతాలకు బదులు మరో చోట ఈ విమానాశ్రయాన్ని నిర్మిస్తే బాగుంటుందన్నారు. 900 రోజులకు పైగా పరందూరు పరిసర గ్రామాల ప్రజలు చేస్తున్న ఆందోళనలపై రాహుల్ అనే బాలుడి ప్రసంగం వీడియో చూసిన తర్వాత ఇక్కడికి వచ్చి ఆందోళనకారులను కలుసుకోవాలని నిర్ణయం తీసుకున్నానని తెలిపారు.
పరందూరు సహా 13 గ్రామాలకు చెందిన అన్నదాతలకు తాను అండగా ఉంటానని, ఈ విమానాశ్రయ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ న్యాయపోరాటం చేసేందుకు కూడా తాను సిద్ధమేనన్నారు. తాను అన్నదాతల పాదాలకు నమస్కరించి తన రాజకీయ ప్రచార యాత్రను ప్రారంభిస్తున్నానని వెల్లడించారు. పార్టీ తొలి మహానాడులో పర్యావరణాన్ని కాపాడేందుకు పాటుపడతామని, వ్యవసాయ భూములను కాపాడతామని ప్రత్యేక తీర్మానాలు చేసిన చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఎయిర్పోర్ట్ నిర్మించి ఈ గ్రామాలను ఎడారిగా మార్చటమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయంగా ఉన్నట్టు కనిపిస్తోందని ఆరోపించారు.
ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తానొక ముఖ్యమైన విషయాన్ని చెప్పదలచుకున్నానని, తాను అభివృద్ధి పధకాలకు వ్యతిరేకిని కాననని, ఆ అభివృద్ధి పథకాలను ప్రజలకు ఎలాంటి నష్టం కలుగని ప్రాంతాల్లో చేపట్టాలన్నదే అతన అభిమతమన్నారు. రాజధాని నగరం చెన్నై సహా పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలకే వరద పరిస్థితులు కలగటానికి నీటి వనరుల దురాక్రమణే కారణమని నిపుణులు చెబుతున్నారని, కనుక పొలాలను, కర్షకజీవులను కాపాడేందుకే వచ్చానని చెప్పారు. టంగ్స్టన్ తవ్వకాల ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. .ఈ విమానాశ్రయ ప్రాజెక్టుకు మద్దతుగా ఉండటం గర్హనీయమన్నారు.
ఆందోళనకారుల్లో ఉరకలేసిన ఉత్సాహం...
టీవీకే నేత విజయ్ రాకతో పరందూరు, ఏకనాపురం తదితర గ్రామాలకు చెందిన ఉద్యమకారుల్లో ఉత్సాహం నెలకొంది. ప్రచార వ్యాన్పై నిలిచి పార్టీ జెండా పట్టుకుని వస్తున్న విజయ్కు రైతులు, గ్రామస్థులు, మహిళలు జేజేలు పలికారు. విజయ్ రోడ్షోలో పాల్గొనే నిమిత్తం అక్కడి కల్యాణమండపానికి వచ్చిన పరందూరు, ఏకనాపురం తదితర 13 గ్రామాల వారిని పోలీసులు ఆధార్కార్డులను పరిశీలించిన మీదటే అనుమతించారు. ఎండవేడి అధికంగా ఉండటంతో పార్టీ ప్రధాన కార్యదర్శి బుస్సీ ఆనంద్ అందరికీ టోపీలు, వాటర్బాటిల్స్ను పంపిణీ చేశారు. కాగా సుమారు వందమందికి పైగా రైతులు విజయ్ని చూడటానికి చేత వరికంకులు పట్టుకుని రావడం విశేషం.
గెలుపు మనదే..
పరందూరు పరిసర గ్రామాలకు చెందిన రైతులంతా మంచే జరుగుతుందని, అంతిమ విజయం తమదేనన్న నమ్మకంతో ఉండాలని, తమ పోరాటాన్ని ఎట్టి పరిస్థితులలో ఆపకుండా కొనసాగించాలని విజయ్ పిలుపునిచ్చారు. మీ ఇంటి బిడ్డగా తాను విమానాశ్రయ ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకిస్తానని, మరోమారు ఏకనాపురానికి వస్తానని తెలిపారు. ఈ గ్రామాల్లో తాను పర్యటించకుండా పోలీసులు ఎందుకు అడ్డుకుంటున్నారో అర్థం కావటం లేదన్నారు.
ఈవార్తను కూడా చదవండి: Liquor Price Hike: మద్యం కంపెనీలకు కిక్కు!
ఈవార్తను కూడా చదవండి: Damodhar: క్షేమంగానే దామోదర్?
ఈవార్తను కూడా చదవండి: 40-50 కిలోమీటర్లకో టోల్ప్లాజా
ఈవార్తను కూడా చదవండి: రైతులకు అన్యాయం చేయొద్దు
Read Latest Telangana News and National News