Former Jharkhand CM Shibu Soren: మాజీ సీఎం, జేఎంఎం వ్యవస్థాపకుడు శిబుసొరేన్ కన్నుమూత
ABN , Publish Date - Aug 05 , 2025 | 03:51 AM
గిరిజనుల హక్కుల కోసం, వారి సాధికారత కోసం, ముఖ్యంగా సంతాలీ జాతి అభివృద్ధి కోసం అవిరళ కృషి సల్పిన
కిడ్నీ వ్యాధికి చికిత్స పొందుతూ.. ఢిల్లీ ఆస్పత్రిలో తుదిశ్వాస
సుదీర్ఘ పోరాటంతో జార్ఖండ్ రాష్ట్రాన్ని సాధించిన నేత శూన్యమే మిగిలింది: సీఎం హేమంత్
ఆస్పత్రికెళ్లి నివాళులర్పించిన మోదీ
జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరు
‘సంతాలీ జాతి గురూజీ’గా గుర్తింపు
రాంచీ/న్యూఢిల్లీ, ఆగస్టు 4: గిరిజనుల హక్కుల కోసం, వారి సాధికారత కోసం, ముఖ్యంగా సంతాలీ జాతి అభివృద్ధి కోసం అవిరళ కృషి సల్పిన జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) పార్టీ వ్యవస్థాపకుడు శిబు సొరేన్ కన్నుమూశారు. 81 ఏళ్ల శిబు.. గత నెల రోజులకు పైగా కిడ్నీ సంబంధిత వ్యాధితో ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం 8.56 గంటల సమయంలో ఆసుపత్రిలోనే ఆయన తుదిశ్వాస విడిచినట్టు డాక్టర్ ఏకే భల్లా ప్రకటించారు. ‘‘నెల రోజుల కిందట ఆయనకు గుండెపోటు వచ్చింది. ఆసుపత్రిలో అత్యవసర చికిత్సల విభాగంలో వైద్యం అందించాం. శిబు ప్రాణాలు కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు చేశాం. సోమవారం పరిస్థితి విషమించి.. ఆసుపత్రిలో కుటుంబ సభ్యుల సమక్షంలోనే ఆయన తుదిశ్వాస విడిచారు.’’ అని డాక్టర్ భల్లా వివరించారు.
సంతాలీ జాతి గురూజీ..
జార్ఖండ్ను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలనే సంకల్పంతో శిబు సొరేన్ చేపట్టిన ఉద్యమాలు.. దేశవ్యాప్తంగా ఆయనకు గుర్తింపు తెచ్చిపెట్టాయి. సుదీర్ఘకాలం ఉద్యమాలతోనే గడిపిన శిబు సొరేన్.. గిరిజనుల హక్కుల కోసం పోరాడారు. ముఖ్యంగా సంతాలీ ప్రజల అభ్యున్నతి, పేదరికం, విద్య వంటివాటి కోసం ఉద్యమాలు చేశారు. ఫలితంగా సంతాలీ జాతి గురూజీ(దిశోం గురూజీ)గా ఆయన మన్ననలు పొందారు. 38 ఏళ్ల కిందట జేఎంఎం పార్టీని స్థాపించారు. జార్ఖండ్ ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. అయితే.. ఆయన రాజకీయ జీవితం వివాదాల సుడుల్లో చిక్కుకుంది. పలు కేసులు కూడా నమోదై.. జైలుకు వెళ్లాల్సి వచ్చింది. కాగా, తన తండ్రి మరణంతో తనకు శూన్యమే మిగిలిందని జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ కన్నీటి పర్యంతమయ్యారు. ‘‘దిశోం గురూజీ మనల్ని వదిలి వెళ్లిపోయారు. నాకిప్పుడు శూన్యమే మిగిలింది.’’ అని ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఇదిలావుంటే, మాజీ సీఎం శిబు మరణంతో ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను నిరవధికంగా వాయిదా వేశారు. రాష్ట్ర ప్రభుత్వం మూడు రోజుల సంతాప దినాలను ప్రకటించింది. పార్టీలకు అతీతంగా పలువురు నాయకులు శిబు సొరేన్ మృతి పంట్ల సంతాపం వ్యక్తం చేశారు. గిరిజన హక్కుల కోసం పోరాడిన యోధుడిగా అభివర్ణించారు.
నేడు అంత్యక్రియలు
శిబు సొరేన్ భౌతిక కాయాన్ని సోమవారం సాయంత్రం ఢిల్లీ నుంచి జార్ఖండ్ రాజధాని రాంచీకి తరలించారు. మంగళవారం ఉదయం వరకు జేఎంఎం కేంద్ర కార్యాలయంలో ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు. అనంతరం.. రామ్గఢ్ జిల్లాలోని శిబు స్వగ్రామానికి తరలించి అక్కడే అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
ఆసుపత్రికి మోదీ
శిబు సొరేన్ మరణ వార్త తెలియగానే.. ప్రధాని మోదీ గంగారామ్ ఆసుపత్రికి చేరుకుని నివాళులర్పించారు. సీఎం హేమంత్ సొరేన్ సహా కుటుంబ సభ్యులను ఓదార్చారు. గిరిజనుల కోసం శిబు జీవితాంతం కృషి సల్పారని, పేదలు, అట్టడుగు వర్గాల అభ్యున్నతిని ఆకాంక్షించారని ప్రధాని పేర్కొన్నారు. అదేవిధంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా శిబు మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు. అమిత్షా, నితిన్ గడ్కరీ సహా పలువురు కేంద్ర మంత్రులు, జార్ఖండ్ గవర్నర్ సంతోష్ గంగ్వార్, ఖర్గే, రాహుల్ గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్, తమిళనాడు సీఎం స్టాలిన్ సంతాపం వ్యక్తం చేశారు. ఆర్జేడీ అధినేత, మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్.. శిబు సొరేన్తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అట్టడుగు వర్గాలకు సామాజిక న్యాయం, సాధికారత కోసం తామిద్దరం కలిసి ఉద్యమించిన రోజులు ఇప్పటికీ కళ్లముందు కదలాడుతున్నాయని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
శ్రీకృష్ణుడే మొదటి రాయబారి.. సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు
గల్వాన్ వ్యాలీ వివాదంలో రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టు వార్నింగ్
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి