FASTag Pass Not Valid: ఫాస్టాగ్ పాస్ ఉందా.. ఈ హైవేలపై మాత్రం పాస్ చెల్లదు
ABN , Publish Date - Aug 23 , 2025 | 01:33 PM
కేంద్ర ప్రభుత్వ నిర్వహణలో ఉన్న హైవేలపైనే ఫాస్టాగ్ వార్షిక పాస్ చెల్లుబాటు అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని రహదారుల్లో సాధారణ పద్ధతిలోనే ఫాస్టాగ్ ద్వారా టోల్ చెల్లించాల్సి ఉంటుంది.
ఇంటర్నెట్ డెస్క్: ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఫాస్టాగ్ పాస్ ప్రారంభం కావడంతో భారతీయ వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అనేక మంది ఫాస్టాగ్ పాస్ కొనుగోలు చేశారు. అయితే, ఈ పాస్ అన్ని రహదారుల్లో చెల్లుబాటు అవుతుందనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని హైవేలు, ఎక్స్ప్రెస్ వేస్లోని టోల్ బూత్ల వద్దే పాస్తో చెల్లింపులను అనుమతిస్తారు. మిగతా చోట్ల ఎప్పటిలాగే సాధారణ ఫాస్టాగ్తో చెల్లింపులు జరపాల్సి ఉంటుంది.
ఈ హైవేస్లో వార్షిక పాస్ చెల్లుబాటు
జాతీయ రహదారి 19 (ఢిల్లీ-కోల్కతా), జాతీయ రహదారి 3 (ఆగ్రా-ముంబయి), జాతీయ రహదారి 48 (ఉత్తర-దక్షిణ కారిడార్), జాతీయ రహదారి 27 (పోర్బందర్-సిల్చర్), జాతీయ రహదారి 16 (కోల్కతా-తూర్పు తీర ప్రాంతం), జాతీయ రహదారి 65 (పుణె-మచిలీపట్నం), జాతీయ రహదారి 11 (ఆగ్రా-బికానేర్), జాతీయ రహదారి 44 (శ్రీనగర్-కన్యాకుమారి), ఢిల్లీ-ముంబయి ఎక్స్ప్రెస్వే, ఈస్టర్న్ పెరిఫెరల్ రోడ్, ముంబయి-నాసిక్, ముంబయి-సూరత్, చెన్నై-సేలం, ముంబయి-రత్నగిరి, ఢిల్లీ-మీరట్, అహ్మదాబాద్-వడోదరా తదితర హైవేల్లో ఇది చెల్లుబాటు కానుంది.
రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని రహదారుల్లో ఈ వార్షిక పాస్తో చెల్లింపులు సాధ్యం కాదు. ఈ రహదారుల్లోని టోల్ బూత్స్ వద్ద ఎప్పటిలాగే సాధారణ ఫాస్టాగ్తో టోల్ చెల్లించాల్సి ఉంటుంది. అంటే.. యమునా ఎక్స్ప్రెస్ వే, పూర్వాంచల్ ఎక్స్ప్రెస్ వే, బుందేల్ ఖండ్ ఎక్స్ప్రెస్ వే టోల్ ప్లాజాల వద్ద సాధారణ విధానంలోనే టోల్ చెల్లించాల్సి ఉంటుంది.
ఇక ఫాస్టాగ్ పాస్ ప్రారంభించిన తొలి నాలుగు రోజుల్లోనే సుమారు 5 లక్షల మంది ఈ పాస్లను కొనుగోలు చేశారు. ఈ జాబితాలో తమిళనాడు టాప్లో ఉంది. ఆ తరువాత హర్యాణా, కర్ణాటక రాష్ట్రాలు నిలిచాయి. రూ.3 వేలకు లభించే ఈ పాస్తో ఏటా 200 ట్రిప్పులను అనుమతిస్తారు. టోల్ ప్లాజా మీదుగా ఒకసారి ప్రయాణిస్తే ట్రిప్గా పరిగణిస్తారు.
ఇవి కూడా చదవండి:
టిక్టాక్పై నిషేధం కొనసాగుతోంది.. క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వ వర్గాలు
ప్రధానిపై సోషల్ మీడియాలో కామెంట్స్.. తేజస్వి యాదవ్పై మహారాష్ట్ర పోలీసుల కేసు
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి