War Preparations: ఏ పరిస్థితులకైనా సిద్ధం
ABN , Publish Date - May 10 , 2025 | 04:07 AM
పాకిస్థాన్తో ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్రం, రాష్ట్రాలు అత్యవసర సన్నద్ధత చర్యలు చేపట్టాయి. ఢిల్లీలో సైరన్లు, మాక్ డ్రిల్స్ నిర్వహిస్తుండగా, పలు రాష్ట్రాల్లో ఉద్యోగుల సెలవులు రద్దు అయ్యాయి.

దేశ రాజధాని ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం
ఎయిర్ సైరన్ల ఏర్పాటు.. మాక్డ్రిల్స్ నిర్వహణ
పలు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగుల సెలవులు రద్దు
శత్రుదాడుల దృష్ట్యా రక్షణ చర్యలు పెంచాలి
రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం ఆదేశం
దేశవ్యాప్తంగా ఆరోగ్య శాఖ సన్నద్ధతపై నడ్డా సమీక్ష
15 వరకు 24 విమానాశ్రయాల మూసివేత
చండీగఢ్లో మళ్లీ సైరన్లు.. జమ్మూలో బ్లాక్ అవుట్
న్యూఢిల్లీ, మే 9: పాకిస్థాన్తో యుద్ధవాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. రాష్ట్రాలు కూడా అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నాయి. సరిహద్దు రాష్ట్రాల్లో పాఠశాలల మూసివేత, రాత్రివేళ విద్యుత్తు కోత, ఉద్యోగులకు సెలవులు రద్దు వంటి చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో దేశ రాజధాని ఢిల్లీలో భారీగా బలగాలను మోహరించడంతో పాటు కంట్రోల్ రూమ్ల ఏర్పాటు, ఎయిర్ సైరన్ల ఏర్పాటు, మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నారు. కీలక సంస్థల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ఢిల్లీలోని ప్రభుత్వ కార్యాలయాలతో పాటు కీలక స్థావరాల్లో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. రద్దీగా ఉండే మార్కెట్లు, రైల్వే స్టేషన్లు, మాల్స్, పార్కులు, మెట్రో స్టేషన్లలో నిఘాను; వీవీఐపీల నివాస ప్రాంతాల్లో భద్రతను పెంచారు. పర్యాటక ప్రదేశాలు, కేంద్ర కార్యాలయాల వద్ద దుకాణాలను మూసివేయించారు. ‘‘సైరన్లను అమర్చుతున్నాం. ఎత్తయిన భవనాలపై ఏర్పాటు చేసి, వీటి పనితీరును పరిశీలిస్తున్నాం. ఢిల్లీలోని 11జిల్లాల పరిధిలో 10 సైరన్లు ఏర్పాటు చేశాం’’ అని అధికారులు వెల్లడించారు. ఇవి శబ్దం చేసినప్పుడు ఎలా స్పందించాలనే విషయంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. మరోవైపు దేశవ్యాప్తంగా ఆస్పత్రుల సన్నద్ధతపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు. ఢిల్లీలోని ఎయిమ్స్, సఫ్దర్జంగ్, రామ్మనోహర్ లోహియా ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది సెలవులను రద్దు చేశారు. అత్యవసర సేవల నిబంధనలు అమల్లో ఉంటాయని తెలిపారు.
పలు రాష్ట్రాల్లో ఉద్యోగుల సెలవులు రద్దు
ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగుల సెలవులు రద్దయ్యాయి. అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేలా వైద్య, విపత్తు నిర్వహణ విభాగాల సంసిద్ధతను సమీక్షిస్తున్నారు. బ్లాక్ అవుట్ విషయంలో ప్రజలకు సూచనలు చేశారు. ఢిల్లీ విమానాశ్రయంలో రెండ్రోజుల్లో 228 విమానాలు రద్దయ్యాయి. శుక్రవారం ఒక్కరోజే 138విమానాలు రద్దయ్యాయి. మరోవైపు.. శ్రీనగర్, చండీగఢ్ సహా ఈశాన్య, పశ్చిమ భారతదేశంలోని 24 విమానాశ్రయాలను ఈ నెల 15వరకు మూసివేస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. దేశవ్యాప్తంగా అన్ని ఎయిర్పోర్టుల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. సరిహద్దు జిల్లాలకు పాక్ నుంచి దాడుల ముప్పు పొంచి ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. చండీగఢ్లో శుక్రవారం ఉదయం నుంచి మరోసారి సైరన్ల మోత వినిపించడం ప్రజలను ఆందోళనకు గురిచేసింది. రాజస్థాన్లోని జైసల్మేర్లో ఓ హోటల్ వద్ద పాక్ డ్రోన్ శకలాలు లభ్యమయ్యాయి. బీఎ్సఎఫ్ క్యాంప్ను లక్ష్యంగా చేసుకొని డ్రోన్ను పంపగా.. బలగాలు కూల్చేశాయి.
జమ్మూ నుంచి ఢిల్లీకి 3 ప్రత్యేక రైళ్లు
జమ్మూలోనూ శుక్రవారం ఉదయం సైరన్లు మోగాయి. తెల్లవారుజామున పేలుడు శబ్దాలు వినిపించినట్లు తెలుస్తోంది. దీంతో నగరాన్ని బ్లాక్అవుట్ చేశారు. శ్రీనగర్లోనూ లైట్లు ఆర్పేసి ఇళ్లలోనే ఉన్నట్లు స్థానికులు తెలిపారు. దాడుల నేపథ్యంలో స్థానికులు ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. జమ్మూ, ఉధంపూర్ నుంచి ఢిల్లీకి మూడు ప్రత్యేక రైళ్లను నడిపే యోచనలో ఉన్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. కాగా, దక్షిణ మధ్య రైల్వే పరిధిలో అన్ని ప్రధాన స్టేషన్లకు పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేసినట్లు సీపీఆర్వో శ్రీధర్ తెలిపారు. గుజరాత్, ఢిల్లీ, రాజస్థాన్ రాష్ట్రాలకు రైళ్లు యథావిధిగా నడుస్తున్నాయని.. ఆ యాప్రాంతాలకు అత్యవసరమైతేనే వెళ్లాలని, లేకుంటే రద్దు చేసుకోవాలని ప్రయాణికులకు సూచించారు.
గుజరాత్ సీఎంకు మోదీ ఫోన్
సరిహద్దుల్లో ఉద్రిక్తతల వేళ భద్రతా సన్నద్ధతపై ప్రధాని మోదీ ఆరా తీశారు. గుజరాత్ ముఖ్యమంత్రికి ఫోన్ చేసి, ప్రస్తుత పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. సున్నిత ప్రాంతాలైన కచ్, బనస్కంతా, పటాన్, జామ్నగర్లో పౌరుల భద్రత కోసం చేపడుతున్న చర్యల గురించి అడిగారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో గుజరాత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రానున్న వారం రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా బాణసంచా, డ్రోన్లపై నిషేధం విధిస్తున్నట్లు ఆ రాష్ట్ర హోంశాఖ మంత్రి ప్రకటించారు.
ఇవి కూడా చదవండి
India Pakistan Tensions: భారత్, పాకిస్తాన్ ఉద్రిక్తత వేళ.. దేశంలో నిత్యావసరాలపై కీలక ప్రకటన
India Pakistan Tension: భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తత వేళ జమ్మూ నుంచి ఢిల్లీకి మూడు ప్రత్యేక రైళ్లు
Virat Kohli: సైనికుల సేవలకు హృదయపూర్వక ధన్యవాదాలు..జై జవాన్కు జై కోహ్లీ
RSS: దేశ భద్రత విషయంలో ప్రతి భారతీయుడు భాగస్వామ్యం కావాలి: ఆర్ఎస్ఎస్..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి