Delhi Airport: ఎయిర్పోర్ట్లో చిక్కుకుపోయిన వేలాది మంది ప్రయాణికులు..
ABN , Publish Date - Nov 07 , 2025 | 05:07 PM
ఏటీసీలో సాంకేతిక సమస్య తలెత్తింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ ఎయిర్ పోర్ట్లో వేలాది మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు.
న్యూఢిల్లీ, నవంబర్ 07: దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ (ఏటీసీ) వ్యవస్థలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీని ప్రభావంతో దాదాపు 800 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ముందుగా షెడ్యూల్ చేసిన పలు విమాన సర్వీసులను రద్దు చేశారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ ఎయిర్ పోర్ట్లో వందలాది మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. దీని ప్రభావం ఉత్తరాది ఎయిర్ పోర్టులపైన పడింది.
అయితే ఢిల్లీ ఎయిర్పోర్టులోని రన్ వేపై విమానాలు పార్కింగ్ చేసేందుకు సరిపడినంత స్థలం లేనందున పలు సర్వీసులు రద్దు చేసినట్లు ఎయిర్ పోర్ట్ వర్గాలు వివరించాయి. అయితే గురువారం సాయంత్రం నుంచే ఏటీసీలో ఈ సమస్య ఉత్పన్నమైందని వెల్లడించాయి. ఇక అందుబాటులో ఉన్న డేటా అధారంగా పలు విమానాల సర్వీసులు నడుపుతున్నట్లు తెలిపింది. ఆ క్రమంలో చాలా ఆలస్యంగా విమాన సర్వీసుల నడుస్తున్నాయంది. మరోవైపు ముంబై ఎయిర్పోర్ట్లోనూ ఏటీసీ వ్యవస్థ కుప్పకూలింది. దీంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
ఇక న్యూఢిల్లీ ఎయిర్పోర్టు నిత్యం రద్దీగా ఉంటుంది. ప్రతి రోజు ఇక్కడి నుంచి దాదాపు 1,500 విమానాలు రాక పోకలు సాగిస్తాయి. ట్రాకింగ్ వెబ్ సైట్లో విమాన సర్వీసు బయలుదేరు సమయం దాదాపు 60 నిమిషాలు ఆలస్యం చూపిస్తోంది.
ఈ సాంకేతిక లోపాన్ని పరిష్కరించేందుకు ఎయిర్పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియాతో కలిసి పని చేస్తున్నామని ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లిమిటెడ్ ప్రతినిధి వెల్లడించారు. సాధ్యమైనంత త్వరగా ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు చర్యలు చేపట్టినట్లు వివరించారు.
ఇప్పటికే దీనిపై ఎయిర్ ఇండియా, స్పైస్ జెట్, ఇండిగో ఎయిర్ లైన్స్ సంస్థలు తమ ఎక్స్ ఖాతా వేదికగా స్పందించాయి. ఇలా చిక్కుకుపోయిన ప్రయాణికులకు ఎయిర్పోర్టు సిబ్బంది సహాయం చేస్తున్నారని వివరించాయి.
ఏటీసీ వ్యవస్థలో ఏర్పడిన లోపం కారణంగా.. అన్ని విమాన సర్వీసుల రాకపోకలపై ఈ ప్రభావం పడిందని స్పైస్ జెట్ ఎయిర్ లైన్స్ వెల్లడించింది. అదే విధంగా ఎయిర్ ఇండియా సంస్థ సైతం స్పందించింది. ఈ ఊహించని అంతరాయం కారణంగా ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని తెలిపింది. ఏటీసీలో ఏర్పడిన లోపాన్ని పునరుద్దరించేందుకు టెక్నిషియన్స్ పూర్తి స్థాయిలో పని చేస్తున్నారని అధికారులు తెలిపారు. కొన్ని గంటల్లోనే సాధారణ పరిస్థితికి తీసుకు వస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఎయిర్ పోర్టులో భారీగా ప్రయాణికుల క్యూ లైన్లు దర్శనమిస్తున్నాయి. పలు విమాన సర్వీసులను రీ షెడ్యూల్పై ప్రకటనల మీద ప్రకటనలు చేస్తున్నారు. మరోవైపు విమాన సర్వీసుల ఆలస్యంపై సోషల్ మీడియా వేదికగా ఫిర్యాదులు వెల్లువెత్తాయి.
ఇవి కూడా చదవండి:
పురుషుల్లో టెస్టోస్టెరాన్ స్థాయిలు పెరగాలంటే..
వందేమాతర గీతానికి నేటికి 150 ఏళ్లు.. పులకిస్తోన్న భారతదేశం
For More National News And Telugu News