Assembly Elections: ఆ ఒక్క జిల్లాలోనే.. 15 లక్షల ఓట్ల తొలగింపు ?
ABN , Publish Date - Dec 06 , 2025 | 12:17 PM
రాజధాని నగరం చెన్నైలో 15 లక్షల ఓట్లు తొలగించనున్నట్లు తెలుస్తోంది. ఈ సమాచారంతో స్థానికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఓట్ల తొలగింపు అంశం ఇప్పుడు సర్వత్రా చర్చకు దారితీస్తోంది.
చెన్నై: చెన్నై జిల్లాలో సుమారు 15 లక్షల ఓట్లు తొలగించనున్నట్లు సమాచారం. చెన్నై జిల్లా పరిధిలోని 16 శాసనసభ నియోజకవర్గాల్లో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) పనులు గత నెల 4వ తేదీన ప్రారంభించారు. 3,718 మంది పోలింగ్ స్టేషన్ అధికారులను నియోజకవర్గాల వారీగా ఇన్చార్జి, పర్యవేక్షణ అధికారులుగా నియమించారు. ఈ క్రమంలో, లెక్కింపు ఫారాలు పొందే అంశంపై గురువారం స్థానిక రిప్పన్ భవనంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో డీఎంకే, ఎండీఎంకే, బీజేపీ, కాంగ్రెస్, సీపీఎం సహా 12 గుర్తింపు పొందిన పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. సమావేశంలో అధికారులు మాట్లాడుతూ... చెన్నై(Chennai) జిల్లాలోని 40.04 లక్షల ఓటర్లలో 39.59 మందికి లెక్కింపు ఫారాలు అందజేశామన్నారు. వారిలో 22.79 లక్షల మంది నుంచి ఫారాలు పొందామని తెలిపారు. వారిలో 2.23 లక్షల మంది రెండు ఓట్లు కలిగి ఉన్నట్లు గుర్తించామన్నారు. అలాగే, 1.49 లక్షల మంది మృతిచెందిన జాబితాలో ఉన్నారని తెలిపారు.

8.39 లక్షల మంది శాశ్వతంగా వేరే నియోజకవర్గానికి మారారని, 36,979 మంది స్పందించలేని పరిస్థితుల్లో ఉన్నారని తెలిపారు. ఈ గణాంకాల ప్రకారం 25.99 శాతం మంది ఫారాలు అందించలేదని తెలుస్తుందని, ఈ కారణంగా 10.40ల లక్షల నుంచి 15 లక్షల మందిని ఓటర్ల జాబితాల నుంచి తొలగించే అవకాశముందని అధికారులు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
గుడ్ న్యూస్.. వెండి ధరలో భారీ కోత
రూ.100తో వారసత్వ భూముల రిజిస్ర్టేషన్
Read Latest Telangana News and National News