Suresh Gopi: మంత్రి పదవిని వదులుకుంటా: సురేష్ గోపి
ABN , Publish Date - Oct 12 , 2025 | 06:25 PM
కేరళ యువ బీజేపీ సభ్యుల్లో తాను ఒకరినని, 2016లోనే తాను బీజేపీలో చేరానని కేంద్ర సహాయ మంత్రి సురేష్ గోపి చెప్పారు. లోక్సభలో ప్రజలు ఇచ్చిన తీర్పునకు గుర్తింపుగా పార్టీ తనను కేంద్ర మంత్రిగా చేసి ఉండొచ్చని అన్నారు.
కన్నూర్: మలయాళ నటుడు, కేంద్ర పెట్రోలియం, పర్యాటక శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి (Suresh Gopi) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవి నుంచి తాను తప్పుకునేందుకు సిద్ధమేనని, అయితే తన స్థానంలో బీజేపీ నుంచి రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన సి.సదానందన్ మాస్టార్ను క్యాబినెట్లోకి చేర్చుకోవాలని సిఫారసు చేశారు. కన్నూర్లో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ ప్రతిపాదన చేశారు. సదానందన్ మాస్టార్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
'చాలా నిబద్ధతతో ఈ మాట చెబుతున్నా. నన్ను తొలగించిన తరువాత సదానందన్ మాస్టార్ను మంత్రి (కేంద్రంలో)గా చేయండి. కేరళ రాజకీయ చరిత్రలో ఇది ఒక సరికొత్త అధ్యాయం అవుతుందని నేను నమ్ముతున్నా' అని సురేష్ గోపి అన్నారు. సదానందన్ మాస్టార్ ఎంపీ కార్యాలయాన్ని త్వరలోనే మినిస్టీరియల్ ఆఫీస్గా ఆప్గ్రేడ్ చేస్తారని తాను ఆశిస్తున్నట్టు చెప్పారు.
రాష్ట్రంలోని యువ బీజేపీ నేతల్లో తాను ఒకరినని, 2016లో తాను బీజేపీలో చేరానని సురేష్ గోపి చెప్పారు. లోక్సభలో ప్రజలు ఇచ్చిన తీర్పునకు గుర్తింపుగా పార్టీ తనను కేంద్ర మంత్రిగా చేసి ఉండొచ్చని అన్నారు. సినిమాలు వదులుకుని మంత్రి కావాలని తాను ఎన్నడూ అనుకోలేదని, ఇటీవల కాలంలో తన ఆదాయం కూడా గణనీయంగా తగ్గిందని చెప్పారు.
కాగా, కన్నూర్ జిల్లాలో బీజేపీ సీనియర్ నేత అయిన సదానంద్ మాస్టార్ కేరళలో చోటుచేసుకున్న రాజకీయ హింసలో బాధితుడు కూడా. 1994లో సీపీఎం కార్యకర్తలుగా భావిస్తున్న కొందరు జరిపిన దాడిలో ఆయన రెండు కాళ్లు పోగొట్టుకున్నారు.
ఇవి కూడా చదవండి..
ఎన్డీయే సీట్ల షేరింగ్ ఫార్ములా ఇదేనా.. ఈరోజే కీలక ప్రకటన
ఆపరేషన్ బ్లూస్టార్ పెద్ద పొరపాటు.. చిదంబరం సంచలన వ్యాఖ్యలు
For More National News And Telugu News