UK Universities: భారత్లో యూకే యూనివర్సిటీల ఆఫ్షోర్ క్యాంపస్లు: బ్రిటన్ ప్రధాని
ABN , Publish Date - Oct 09 , 2025 | 10:00 PM
భారత్లో ఆఫ్ షోర్ క్యాంపస్లను తెరిచేందుకు రెండు యూనివర్సిటీలను అనుమతించామని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ తెలిపారు.
ఇంటర్నెట్ డెస్క్: భారత్లో బ్రిటన్ యూనివర్సిటీలు తమ క్యాంపస్లు ఏర్పాటు చేస్తాయని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ (Keir Starmer) గురువారం తెలిపారు. రెండు రోజుల పర్యటన కోసం భారత్ వచ్చిన ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ దిశగా యూనివర్సిటీ ఆఫ్ లాంకాస్టర్, యూనివర్సిటీ ఆఫ్ సర్రీలకు ప్రభుత్వ అనుమతులు లభించాయని అన్నారు. దీంతో, భారత్లో యూకే యూనివర్సిటీల ఆఫ్ షోర్ క్యాంపస్ల సంఖ్య తొమ్మిదికి చేరుకుంది (UK Universities' Offshore Campuses In India).
ఈ ఏడాది మొదట్లో యూనివర్సిటీ ఆఫ్ సౌతాంప్టన్ ఢిల్లీలో తన ఆఫ్ షోర్ క్యాంపస్ను ప్రారంభించింది. ఇక యూనివర్సిటీ ఆఫ్ యోర్క్, యూనివర్సిటీ ఆఫ్ అబర్డీన్, యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్, యూనివర్సిటీ ఆఫ్ లివర్పూల్, క్వీన్స్ యూనివర్సిటీ బెల్ఫాస్ట్, యూనివర్సిటీ ఆఫ్ కాన్వెంట్రీ వచ్చే ఏడాది నుంచి ఇక్కడ తమ ఆఫ్ షోర్ క్యాంపస్లను నిర్వహిస్తాయి.
ఇక రక్షణ రంగానికి సంబంధించి బ్రిటన్ ప్రధాని భారత్తో పలు కీలక ఒప్పందాలు కుర్చుకున్నారు. భారత్కు క్షిపణుల సరఫరాకు 350 మిలియన్ పౌండ్ల కాంట్రాక్ట్ను కుదుర్చుకున్నారు. భారత్, బ్రిటన్ మధ్య జులైలో సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. ఇక భారత ఆర్థిక వ్యవస్థపై బ్రిటన్ ప్రధాని ప్రశంసలు కురిపించారు. 2028 కల్లా భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అవుతుందని అన్నారు. ప్రస్తుతం భారత్, బ్రిటన్ ద్వైపాక్షిక వాణిజ్యం 54.8 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈ వాణిజ్యం కారణంగా ఇరు దేశాల్లో దాదాపు 6 లక్షల ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చాయి. 2022లో భారత్ బ్రిటన్ను జీడీపీ పరంగా అధిగమించి ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది.
ఇవి కూడా చదవండి:
మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవులు.. కర్ణాటక కేబినెట్ ఆమోదం
ఐపీఎస్ ఆఫీసర్ ఆత్మహత్య.. డీజీపీ విషయంలో హర్యానా కీలక నిర్ణయం
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి