Bihar Assembly Elections: సీట్ల పంపకాలపై బీజేపీ కీలక ప్రకటన మరి కొన్ని గంటల్లోనే
ABN , Publish Date - Oct 11 , 2025 | 05:49 PM
సీట్ల షేరింగ్ వ్యవహారంలో అసంతృప్తులు ఉన్నట్టు వస్తున్న ఊహాగానాలకు బీజేపీ అధిష్ఠానం కొట్టి వేస్తున్నప్పటికీ, సాధ్యమైనన్ని సీట్లు దక్కించుకునేందుకు చిరాగ్ పాశ్వాన్ సారథ్యంలోని ఎల్జేజీ (రామ్ విలాస్), హెచ్ఏఎం పార్టీ చీఫ్ జితిన్ రామ్ మాంఝీ కొన్ని కాలంగా పట్టుబడుతున్నాయి.
పాట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు (Bihar Assembly Elections) సంబంధించి ఎన్డీయే (NDA) భాగస్వాముల మధ్య సీట్ల పంపకాలపై బీజేపీ (BJP) కేంద్ర నాయకత్వం ఆదివారం నాడు కీలక ప్రకటన చేయనుంది. సీట్ల షేరింగ్, టికెట్లపై ఈ కీలక ప్రకటన ఉంటుందని బిహార్ బీజేపీ చీఫ్ దిలీప్ జైశ్వాల్ (Dilip Jaiswal) తెలిపారు. శనివారంనాడిక్కడ మీడియాతో ఆయన మాట్లాడుతూ, సీట్ల పంపకాల విషయంలో ఎన్డీయే భాగస్వాముల మధ్య అసంతృప్తులు ఉన్నట్టు వస్తున్న ఊహాగానాల్లో ఎంతమాత్రం నిజం లేదన్నారు.

'ఎన్డీయేలో అంతా సజావుగా ఉంది. సీట్ల షేరింగ్, అభ్యర్థుల జాబితాపై పార్టీ నాయకత్వం త్వరలోనే నిర్ణయించనుంది. ఇందుకు సంబంధించి ఆదివారం మధ్యాహ్నం 11 గంటలకు ఒక కీలక ప్రకటన ఉంటుంది' అని దిలీప్ జైశ్వాల్ తెలిపారు.
ఎవరి డిమాండ్లు వారివే..
సీట్ల షేరింగ్ వ్యవహారంలో అసంతృప్తులు ఉన్నట్టు వస్తున్న ఊహాగానాలను బీజేపీ అధిష్ఠానం కొట్టి వేస్తున్నప్పటికీ, సాధ్యమైనన్ని సీట్లు దక్కించుకునేందుకు చిరాగ్ పాశ్వాన్ సారథ్యంలోని ఎల్జేజీ (రామ్ విలాస్), జితిన్ రామ్ మాంఝీ సారథ్యంలోని హెచ్ఏఎం కొద్దికాలంగా పట్టుబడుతున్నాయి. చిరాగ్కు 20-25 సీట్లు ఇచ్చేందుకు బీజేపీ సముఖంగా ఉందని చెబుతుండగా, అదనంగా మరో 25 సీట్లు ఆయన డిమాండ్ చేస్తున్నారు. కనీసం 45 సీట్లు తమకు దక్కుతాయని ఎల్జేపీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు, జితిన్ రామ్ మాంఠీ సైతం 15 సీట్లు ఇవ్వాల్సిందేనని అంటున్నారు. 15 సీట్లు ఇస్తే 8-9 సీట్లు గెలిచి తీరుతామని, తామడిగిన దాని కంటే తక్కువ సీట్లు ఇస్తామంటే ఎన్నికల్లో అసలు పోటీనే చేయమని చెప్పారు. అయితే ఎన్డీయేలోనే కొనసాగుతామన్నారు. ఈ నేపథ్యంలో సీట్ల షేరింగ్పై బీజేపీ కేంద్ర నాయకత్వం ఆదివారం చేయనున్న కీలక ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇవి కూడా చదవండి..
నా సమయం ఎప్పుడొస్తుందో నాకు తెలుసు.. సీఎం ఊహాగానాలపై డీకే
Read Latest Telangana News and National News