Rahul Gandhi: రాహుల్పై చర్యలకు రంగం సిద్ధం..
ABN , Publish Date - May 15 , 2025 | 04:30 PM
Rahul Gandhi: ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై చర్యలకు రంగం సిద్ధమైందని ప్రభుత్వ ఉన్నతాధికారులు వెల్లడించారు.

పాట్నా, మే 15: తమ ఆదేశాలను ధిక్కరించిన నేపథ్యంలో లోక్సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీపై న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని దర్భంగా జిల్లా ఉన్నతాధికారులు వెల్లడించారు. గురువారం దర్భంగాలో జిల్లా ఉన్నతాధికారులు విలేకర్లతో మాట్లాడుతూ.. దర్బంగాలో అంబేద్కర్ హాస్టల్ వద్ద విద్యార్థులతో ముఖాముఖీ కార్యక్రమానికి నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీకి అనుమతి ఇవ్వలేదని తెలిపారు. స్థానిక టౌన్ హాల్ వద్ద ఈ కార్యక్రమం నిర్వహించేందుకు నిర్వాహకులకు అనుమతి ఇచ్చామని స్పష్టం చేశారు. కానీ రాహుల్ గాంధీ మాత్రం అంబేద్కర్ హాస్టల్ వద్దే విద్యార్థులతో ముఖాముఖీ కార్యక్రమం నిర్వహించేందుకు సిద్ధమయ్యారని చెప్పారు.
ఈ కార్యక్రమాన్ని అడ్డుకొనేందుక పోలీసు సిబ్బంది చేసిన ప్రయత్నాలు ఫలించలేదన్నారు. ఆ క్రమంలో అంబేద్కర్ హాస్టల్ వద్దకు రాహుల్ గాంధీ వస్తున్న క్రమంలో ఆయన్ని యూనివర్సిటీ గేట్ వద్ద పోలీసులు ఆపే ప్రయత్నం చేశారన్నారు. పోలీసుల ప్రయత్నాన్ని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకించాయని చెప్పారు. దీంతో యూనివర్సిటీ గేట్ తెరవక తప్పలేదన్నారు. అనంతరం ఖాన్కా చౌక్ వద్దకు రాహుల్ చేరుకుని.. అక్కడి నుంచి అంబేద్కర్ హాస్టల్ వద్ద ఏర్పాటు చేసిన వేదిక వద్దకు కాలినడకన ఆయన చేరుకున్నారని తెలిపారు. ఆ తర్వాత రాహుల్ గాంధీ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారని చెప్పారు.
మీతో మాట్లాడటానికి, మీరు చెప్పింది వినేందుకు తాను ఢిల్లీ నుంచి వచ్చానని విద్యార్థులకు రాహుల్ గాంధీ వివరించారు. కానీ అధికారులు తానను ఆపేందుకు అడుగడుగునా అడ్డం పడ్డారన్నారు. అలాగే బ్యారీకేడ్స్ను రహదారులకు అడ్డంగా పెట్టారని చెప్పారు. కానీ తాను మరో మార్గం ద్వారా ఇక్కడికి చేరుకున్నారన్నారు. అంతేకాదు.. తనను ఎవరు ఆపలేరన్నారు. ఎందుకంటే తన వెనుక మీ బలం ఉందని చెప్పారు. దీంతో ప్రపంచంలో ఏ శక్తి తనను ఆపలేదని తెలిపారు.
అలాగే బిహార్లోని నితీష్ కుమార్ ప్రభుత్వంతోపాటు ప్రధాని మోదీలపై ఈ సందర్భంగా రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. అదే విధంగా కులగణన నిర్వహించేందుకు పార్లమెంట్ సాక్షిగా ఒప్పుకోని ప్రధాని మోదీ.. తన ఒత్తిడి కారణంగా ఈ గణనను నిర్వహించేందుకు సానుకూలంగా స్పందించారని రాహుల్ గాంధీ ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ప్రధాని మోదీ ప్రభుత్వం.. ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి, కులగణనతోపాటు నిరుపేదలకు వ్యతిరేకంగా పని చేస్తుందని మండిపడ్డారు. ఈ మోదీ ప్రభుత్వం కేవలం అదానీ, అంబానీ సంస్థలకు అనుగుణంగా మాత్రమే పని చేస్తుందంటూ రాహుల్ గాంధీ ఆరోపించారు. మరోవైపు అంబేద్కర్ హాస్టల్ వద్ద రాహుల్ గాంధీని ప్రసంగించేందుకు అనుమతించక పోవడంపై బిహార్లోని కాంగ్రెస్ పార్టీ వర్గాలు ప్రభుత్వంపై నిప్పులు చెరిగాయి. అదీకాక.. హాస్టళ్లలో పరిస్థితు ప్రస్తుతం ఎలా ఉన్నాయో తనకు తెలుసునన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ఆ పరిస్థితులు మారుస్తామని రాహుల్ గాంధీ ప్రకటించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Colonel Sofiya Qureshi: కల్నల్ సోఫియా వివాదం.. సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు
మన మిస్సైల్స్తో కాంగ్రెస్కే అధిక బాధలు
Abhinandan Vardhaman: అభినందన్ వర్థమాన్ను భారత్కి పాక్ ఆర్మీ అప్పగించిన తర్వాత ఏమైందంటే..
For National News And Telugu News