Bound Air India Plane: ఆ విమానంలో పొగలు, ఎమర్జెన్సీ ల్యాండింగ్.. మరో ఫ్లైట్ రద్దు, క్రికెటర్ అసహనం.!
ABN , Publish Date - Nov 28 , 2025 | 09:19 AM
విమాన ప్రయాణానికి సంబంధించిన అంశాలు ఈ మధ్య తరచూ వార్తలకెక్కుతూనే ఉన్నాయి. ఢిల్లీ నుంచి అహ్మదాబాద్కు బయల్దేరిన విమానాన్ని.. దారి మళ్లించి మరలా ల్యాండ్ చేశారు. అలాగే గువహటి నుంచి హైదరాబాద్ వెళ్లాల్సిన ఫ్లైట్ ఒకటి రద్దైంది. దీంతో భారత క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: దేశంలో విమాన ప్రయాణాలపై తరచూ వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఢిల్లీలో టేక్ ఆఫ్ అయిన ఎయిర్ఇండియా విమానం(Air India flight) ఒకటి.. వెంటనే వెనుదిరిగింది. కాక్పిట్(Cockpit)లోకి పొగలు వస్తున్నాయనే సంకేతాలతో ఇలా అర్ధంతరంగా తిరిగి ల్యాండ్ చేయాల్సిన పరిస్థితి నెలకొన్నట్టు అధికారులు తెలిపారు. అయితే ఈ ఘటనలో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. సదరు ప్రయాణికులను ప్రత్యామ్నాయ మార్గం ద్వారా వారి గమ్యస్థానాలకు చేర్చినట్టు ఎయిర్లైన్స్ పేర్కొంది.
నవంబర్ 27న అహ్మదాబాద్ వెళ్లేందుకు AI2939 విమానం ఢిల్లీ నుంచి బయల్దేరింది. టేక్ ఆఫ్ అయిన కాసేపటికే కార్గో హోల్డ్ ప్రాంతంలో పొగ వచ్చినట్టు సూచన కనిపించిందని ఎయిర్లైన్ అధికారులు గుర్తించారు. దీంతో సిబ్బంది అప్రమత్తమై వెంటనే ఆ ఫ్లైట్ను ఢిల్లీకి మళ్లించారు. అనంతరం పూర్తిస్థాయి తనిఖీలు నిర్వహించారు. అయితే.. ఆ విమానంలో అలాంటి పొగ వ్యాపించిన సూచనలేవీ కనిపించలేదని తనిఖీ అనంతరం అధికారులు నిర్ధారించారు.
క్రికెటర్ సిరాజ్ అసహనం..
ఇదిలా ఉండగా.. గురువారం సాయంత్రం గువాహటి నుంచి హైదరాబాద్కు వెళ్లే ఎయిర్ఇండియా ఎక్స్ప్రెస్(Air India Express) IX 2884ను ఊహించని కారణంగా రద్దుచేసినట్టు అధికారులు వెల్లడించారు. ఈ విమానంలోనే టీమ్ఇండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్(Indian cricketer Mohammed Siraj) ప్రయాణించాల్సి ఉంది. సుమారు 4 గంటలైనా ఎలాంటి అప్డేట్స్ లేకపోవడంతో అసహనం వ్యక్తం చేసిన సిరాజ్.. ఈ విషయమై సదరు విమానయాన సంస్థను సామాజిక మాధ్యమం 'X' వేదికగా వివరణ కోరాడు. సరైన కమ్యూనికేషన్ లేకపోవడంతోనే ఇలా జరిగినట్టు సిరాజ్ పోస్ట్కు సమాధానమిచ్చింది ఎయిర్లైన్స్.
ఇవీ చదవండి:
కూలుతున్న భవిష్యత్ తరం!