Silent Divorce: జీవిత భాగస్వామిలో ఈ మార్పులు కనిపిస్తే జాగ్రత్త!
ABN , Publish Date - Dec 14 , 2025 | 02:42 PM
భార్యాభర్తల బంధం శాశ్వతంగా తెగిపోయే దశకు వచ్చిందన్న ప్రధాన సంకేతాలలో సైలెంట్ డైవర్స్ కూడా ఒకటి. ఈ స్థితికి చేరుకున్నప్పుడు వెంటనే గుర్తించి తగు జాగ్రత్తలు తీసుకోకపోతే జీవితం ఛిన్నాభిన్నమవుతుందని కౌన్సెలర్లు హెచ్చరిస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: భార్యాభర్తలు అన్నాక గొడవలు, ఆ తరువాత రాజీ పడిపోవడాలు సహజం. కానీ కాలం మారే కొద్దీ స్త్రీపురుషులు ఇద్దరిలో ఇగోలు, ఇతరత్రా అసంతృప్తులు పెరిగిపోతున్నాయి. ఇవి చివరకు బంధాలను శాశ్వతంగా తెంచేస్తాయని మానసిక నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా తమకు తెలీకుండానే సైలెంట్ డైవర్స్ ధోరణిలోకి మారిపోయే తీరును గుర్తించి వెంటనే జాగ్రత్తలు తీసుకుంటే సమస్య ముదరక మునుపే పరిష్కరించుకోవచ్చని అంటున్నారు.
ఏమిటీ సైలెంట్ డైవర్స్ (Silent Divorce)
ఈ స్థితిలో ఉన్న జంటల మధ్య మానసిక బంధం బాగా బలహీనపడుతుంది. ఇద్దరి మధ్య స్నేహం కాదుకదా కనీసం అలకలు, గొడవలు కూడా కనుమరుగు అవుతాయి. మాటల స్థానంలో నిశ్శబ్దం వచ్చి చేరుతుంది.
మానసికంగా ఎడం పెరగడంతో శారీరక సాన్నిహిత్యం కూడా తగ్గిపోతుంది.
భార్యాభర్తలు ఇద్దరూ సమాంతరంగా వేర్వేరు జీవితాలను మరో వ్యక్తితో సంబంధం లేనట్టు గడుపుతుంటారు. జీవిత భాగస్వామి ఆశలు, ఆశయాలు, లక్ష్యాలు, ఇష్టాయిష్టాలను అసలేమాత్రం లక్ష్యపెట్టరు.
అవతలి వారి భావోద్వేగాలకు అస్సలు విలువను ఇవ్వరు. వారి క్షేమాన్ని కూడా పట్టించుకోరు. తమకు అసలు అవతలి వారితో సంబంధమే లేదననట్టు రోజులు నెట్టుకొస్తుంటారు.
ఈ స్థితికి చేరుకున్న జంటల మధ్య కనీసం గొడవలు కూడా ఉండవని మానసిక నిపుణులు చెబుతున్నారు. అసలు అవతలి వారు ఏమన్నా పట్టించుకునే స్థితిని ఎప్పుడో దాటిపోతారని చెబుతున్నారు. చట్టపరంగా ఇద్దరూ భార్యాభర్తలుగా చెలామణీ అవుతున్నా వారి మధ్య ఎడం పూడ్చలేని స్థితికి చేరుకుంటుందని చెబుతున్నారు.
ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు మౌనాన్ని ఛేదించాలని నిపుణులు చెబుతున్నారు. ఇగోలను పక్కన పెట్టి మనసు విప్పి మాట్లాడితే క్రమంగా అన్నీ సర్దుకుంటాయని చెబుతున్నారు. లేకపోతే బంధం శాశ్వతంగా తెగిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
ఆఫీసులో ఉద్యోగులు ఎన్నడూ చేయకూడని తప్పులు!
అమెరికాలో షాకింగ్.. మహిళపై జాత్యాహంకారపూరిత వ్యాఖ్యలు
Read Latest and Lifestyle News