Micro meditation: ‘మైక్రో మెడిటేషన్’ వచ్చేసిందోచ్...
ABN , Publish Date - Nov 09 , 2025 | 01:41 PM
సాధారణంగా ధ్యానం అనేది సమయం ఎక్కువగా తీసుకుంటుంది. ధ్యానానికి మధ్యలో అంతరాయం కలగొద్దు. ‘మైక్రో మెడిటేషన్’ అంటే... కాస్త విరామం తీసుకుంటూనే, కొన్ని నిమిషాల వ్యవధిలో మెదడు, శ్వాసను నియత్రించడం.
- ‘మైక్రో’ ధ్యానం!
కాలం వేగంగా మారుతున్నట్టే, జీవనవిధానం కూడా అత్యంత వేగంగా మారుతోంది. ఆహారపు అలవాట్లలో మార్పులతో ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా ఒత్తిడి, ఆందోళన తగ్గాలంటే... ధ్యానం ఒక్కటే మార్గం. కానీ ఎవరినోట విన్నా ఒక్కటే మాట... టైమ్ లేదు. ఇప్పుడంతా ‘మైక్రో’ ట్రెండ్. దీనికి తగ్గట్టే ‘మైక్రో మెడిటేషన్’ వచ్చేసింది. ఆ విశేషాలే ఇవి...
ఈ తరహా ధ్యానంలో పర్ఫెక్ట్ అనేది ఎవరికి వారుగా తెలుసుకోవాల్సిందే. ఒకరకంగా అవగాహనే సాధన లాంటిదని చెప్పాలి. సాధన చేస్తున్న క్రమంలో మాస్టర్గా మారిపోతారు.
సాధారణంగా ధ్యానం అనేది సమయం ఎక్కువగా తీసుకుంటుంది. ధ్యానానికి మధ్యలో అంతరాయం కలగొద్దు. ‘మైక్రో మెడిటేషన్’ అంటే... కాస్త విరామం తీసుకుంటూనే, కొన్ని నిమిషాల వ్యవధిలో మెదడు, శ్వాసను నియత్రించడం.

తక్కువ సమయం చేస్తున్నారు కాబట్టి ‘మైక్రో’ మెడిటేషన్లో మల్టీటాస్కింగ్ చేయొద్దు. రెగ్యులర్ ధ్యానం లాగానే దీన్ని కూడా పూర్తి అటెన్షన్తోనే చేయాల్సి ఉంటుంది. జీవితంలో ఒక భాగం చేసుకున్నప్పుడే ఫలితం బాగుంటుంది.
నడక మధ్యలోనో, ఆఫీసు సమయం మధ్యలోనో, తినడానికి కాస్త ముందుగానో కాసేపు బ్రేక్ తీసుకుని చేయొచ్చు. ధ్యానం 20 నుంచి 30 నిమిషాలు చేస్తే... ‘మైక్రో మెడిటేషన్’ ఒక సెషన్కు 30 సెకన్ల నుంచి 5 నిమిషాలే ఉంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఇది సంప్రదాయ ధ్యానానికి ‘సింప్లిఫైడ్ వెర్షన్’ అన్నమాట.
మెదడు అనేది నిరంతరం రకరకాలుగా ఆలోచిస్తుంది. కొంతసేపు శ్వాస మీద ధ్యాస పెడితే ‘పారాసింపథెటిక్ నెర్వస్ సిస్టమ్’ను చురుగ్గా చేస్తుంది. స్ట్రెస్ హార్మోన్లను తగ్గించి, పని మీద ఫోకస్ పెరిగేలా దోహదపడుతుంది. సాధన చేస్తున్న కొద్దీ మెదడు మరింత క్లారిటీగా, చురుగ్గా ఆలోచించడం మొదలెడుతుంది.
గతం గురించో, భవిష్యత్తు గురించో ఎక్కువగా ఆలోచించడం వల్ల సహజంగానే ఒత్తిడి, ఆందోళన పెరుగుతుంది. ‘మైక్రో’ మెడిటేషన్ వల్ల వర్తమానం పట్ల అప్రమత్తత పెరుగుతుంది. ‘కేవలం రెండు నిమిషాల డీప్ బ్రీతింగ్ వల్ల ఒత్తిడి తగ్గి, క్రమానుగత హృదయస్పందన పొందొచ్చ’ని అంటున్నారు యోగా నిపుణులు.

భోజనానికి ముందు, ఫోన్ కాల్ మాట్లాడటానికి ముందు, ఎవరి కోసం వేచి చూస్తున్నప్పుడు... ఒకచోట కంఫర్టబుల్గా కూర్చుని, కళ్లు మూసుకుని, మూడుసార్లు నెమ్మదిగా, గాఢంగా శ్వాస తీసుకుని వదలాలి. దీనివల్ల మెదడులో, శరీరంలో మార్పు తెలుస్తుంది. తేలికగా మారిన అనుభూతి కలుగుతుంది.
‘మైక్రో’ ధ్యానం అంటే... రోజువారీ రణగొణ ధ్వనుల మధ్య మీకు మీరుగా, మీకోసం ఏర్పాటు చేసుకున్న నిశ్శబ్ద మందిరం. దీని ఐడియా చాలా సింపుల్. నిద్రలేచిన దగ్గరి నుంచి రాత్రి నిద్రపోయేదాకా పరుగెడుతూనే ఉంటారు కదా. ఆ వేగానికి మధ్యలో కాసేపు పాజ్ బటన్ నొక్కండి. డీప్ బ్రీతింగ్తో వర్తమానంలోకి వచ్చేయండి. ఒత్తిడి, ఆందోళన పెరగక ముందే మెదడును రీసెట్ చేయండి.
ధ్యానం అనేది అవగాహనను బట్టి ఉంటుంది. సరైన అవగాహన ఉంటే కొన్ని ‘మైక్రో’ మూమెంట్స్ కూడా నాడీ వ్యవస్థపై చక్కని ప్రభావాన్ని చూపుతాయి. సుదీర్ఘ సమయం ధ్యానం చేసేందుకు సమయం లేనివారికి ఇది ఉపయోగపడుతుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆన్లైన్ స్కాంలపై జాగ్రత్తగా ఉండాలి.. సీపీ సజ్జనార్ కీలక సూచనలు
కష్టాల కడలి దాటి.. పుట్టగొడుగులతో కోటీశ్వరుడైన వ్యక్తి
Read Latest Telangana News and National News