Russia: సార్వభౌమాధికార దేశాలకు బెదిరింపులా.. భారత్కు బాసటగా అమెరికాపై రష్యా నిప్పులు
ABN , Publish Date - Aug 05 , 2025 | 07:40 PM
అమెరికా హెచ్చరికలపై క్లెమ్రిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ మీడియాతో మాట్లాడుతూ, రష్యాతో వాణిజ్యం నిలిపివేయాలని సార్వభౌమ దేశాలపై ఒత్తిడి తేవడం చట్టవిరుద్ధమని మండిపడ్డారు. ఆయా దేశాలకు తమ భాగస్వాములను ఎంచుకునే హక్కు ఉటుందని అన్నారు.
మాస్కో: రష్యా నుంచి పెద్ద మొత్తంలో చమురు కొనుగోలు చేస్తున్న భారత్పై ప్రస్తుతం ఉన్న 25 శాతం సుంకాలను రాబోయే 24 గంటల్లో మరింత పెంచుతామని ట్రూత్ సోషల్ వేదికగా ఆమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) బెదిరింపులకు దిగడంపై మాస్కో (Moscow) మండిపడింది. భారత్పై వాణిజ్యపరంగా ఒత్తిడిని పెంచుతోందని విమర్శించింది. సార్వభౌమ దేశాలకు తమ వాణిజ్య భాగస్వాములను సొంతంగా ఎంచుకునే హక్కు ఉంటుందని స్పష్టం చేసింది.
అమెరికా హెచ్చరికలపై క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ మీడియాతో మాట్లాడుతూ, రష్యాతో వాణిజ్యం నిలిపివేయాలని సార్వభౌమ దేశాలపై ఒత్తిడి తేవడం చట్టవిరుద్ధమని మండిపడ్డారు. ఆయా దేశాలకు తమ భాగస్వాములను ఎంచుకునే హక్కు ఉంటుందని, అలాంటి బెదిరింపులు తగదని అన్నారు. రష్యా వాణిజ్య భాగస్వాములపై ఒత్తిడి తేవడం బెదిరింపులు కిందకే వస్తుందన్నారు. 'సార్వభౌమాధికార దేశాలు వాణిజ్యం, సహకారం కోసం తమ భాగస్వాముల ఎంచుకుంటాయి. అవి ఆయా దేశాల ప్రయోజనాలకు అనుగుణంగా ఉంటాయి' అని ఆయన చెప్పారు.
ట్రంప్ హెచ్చరిక.. భారత్ దీటుగా జవాబు
భారత్కు ట్రంప్ సోమవారంనాడు తాజా హెచ్చరికలు చేశారు. 'భారత్ పెద్దఎత్తున రష్యా చమురును కొనుగోలు చేయడం మాత్రమే కాదు, కొనుగోలు చేసిన దానిలో ఎక్కువ భాగం భారీ లాభాల కోసం బహిరంగ మార్కెట్లో అమ్ముకుంటోంది. రష్యా వార్ మిషన్లో ఎంతమంది చనిపోయారో వాళ్లకు పట్టింపు లేదు. ఆ కారణంగా అమెరికాకు చెల్లించే టారిఫ్లను గణనీయంగా పెంచుకుంటూ వెళ్తున్నాను' అని అన్నారు. ట్రంప్ ఆరోపణలపై భారత ప్రభుత్వం దీటుగా జవాబిచ్చింది. ఇండియాను అకారణంగా టార్గెట్ చేస్తూ మాట్లాడటం సరికాదని విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. అన్ని ప్రధాన ఆర్థిక వ్యవస్థల తరహాలోనే జాతీయ ప్రయోజనాలు, ఆర్థిక భద్రతను పరిరక్షించేందుకు అవసరమైన అన్ని చర్యలను భారత్ తీసుకుంటోందని తెలిపింది.
ఇవి కూడా చదవండి..
భారత-రష్యా చమురు డీల్స్పై.. ట్రంప్ సర్కార్ ఒత్తిడి
మరిన్ని అంతర్జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి