Israel Doha Strikes: ఇజ్రాయెల్ దాడులు.. ఖతర్కు ప్రధాని మోదీ సంఘీభావం
ABN , Publish Date - Sep 10 , 2025 | 09:38 PM
ఇజ్రాయెల్ వైమానిక దాడుల నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఖతర్ ఎమిర్ షేక్ తమీమ్కు సంఘీభావం తెలిపారు. సమస్యలకు చర్చలే పరిష్కారమని స్పష్టం చేశారు. ఖతర్ సార్వభౌమత్వ ఉల్లంఘనను ఖండిస్తున్నట్టు తెలిపారు. మధ్యప్రాచ్యంలో శాంతిస్థాపనకు భారత్ కట్టుబడి ఉందని అన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: హమాస్ సంస్థ అగ్రనేతలను టార్గెట్ చేస్తూ ఖతర్ రాజధాని దోహాపై ఇజ్రాయెల్ గగనతల దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ పరిణామంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా ఆందోళన వ్యక్తం చేశారు. ఖతర్ ఎమిర్తో మాట్లాడిన ప్రధాని.. వివాదాలకు చర్చలే పరిష్కారమని అన్నారు. ఖతర్ సార్వభౌమత్వ ఉల్లంఘనను ఖండిస్తున్నట్టు తెలిపారు. ఈ విషయాలను ప్రధాని మోదీ స్వయంగా ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఉద్రిక్తతలు మరింత పెరగకుండా చర్యలు తీసుకోవాలని అన్ని పక్షాలకు పిలుపునిచ్చారు (PM Modi on Doha airstrikes) .
మధ్యప్రాచ్యంలో శాంతి, సుస్థిరతకు భారత్ కట్టుబడి ఉందని ప్రధాని మోదీ అన్నారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా సహించకూడదని కూడా అన్నారు. ఈ ప్రాంతంలో శాంతి స్థాపనకు ఖతర్ చేస్తున్న ప్రయత్నాలను ప్రధాని కొనియాడారు. గాజాలో శాంతి స్థాపనకు ఖతర్ మధ్యవర్తిత్వం ప్రశంసనీయమని అన్నారు. ఈ క్రమంలో ఖతర్ ఎమిర్ షేఖ్ తమీమ్ ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. ఖతర్-భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యంలో పురోగతిపై కూడా ఇరు నేతలు హర్షం వ్యక్తం చేశారు (Hamas leaders killed Doha).
ఇక హమాస్ ప్రకటన ప్రకారం, ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో హమాస్ లీడర్ల బాడీ గార్డ్స్ సహా ఐదుగురు మరణించారు. ఇజ్రాయెల్ దాడిపై విదేశాంగ శాఖ కూడా అంతకుముందు స్పందించిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలు ఆందోళనకరమని విదేశాంగ శాఖ వ్యాఖ్యానించింది.
ఇవి కూడా చదవండి:
హమాస్ నాయకత్వమే టార్గెట్.. దోహాపై ఇజ్రాయెల్ గగనతల దాడి
నేపాల్ మహిళా మంత్రి జీవితం తలకిందులు.. ప్రజాగ్రహం వెల్లువెత్తితే ఇంతే
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి