Indonesia Fire Accident: ఇండోనేషియాలో భారీ అగ్ని ప్రమాదం.. 20 మంది సజీవ దహనం
ABN , Publish Date - Dec 09 , 2025 | 04:15 PM
ఇండోనేషియాలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో సుమారు 20 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇంటర్నెట్ డెస్క్: ఇండోనేషియా(Indonesia)లో ఘోర విషాదం చోటు చేసుకుంది. ఆ దేశ రాజధాని జకార్తా(Jakartha)లో ఓ ఏడు అంతస్తుల భవనంలో అగ్ని ప్రమాదం సంభవించింది(Fire Accident). ఈ ఘటనలో సుమారు 20 మంది సజీవ దహనమయ్యారు(20 people died). అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టింది. అయితే.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్టు తెలుస్తోంది.
మంగళవారం మధ్యాహ్నం వేళ.. సెంట్రల్ జకర్తా(Central Jakartha)లో ఈ ప్రమాదం జరిగింది. తొలుత.. మొదటి అంతస్తులో మంటలు చెలరేగగా.. ఆ వెంటనే పైఅంతస్తులకూ వ్యాపించాయి. ఉవ్వెత్తున ఎగిసిపడిన మంటలతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే అగ్నిమాపక అధికారుల(Fire Officials)కు సమాచారం అందజేశారు. సహాయక బృందాలు రంగంలోకి దిగి.. తీవ్రంగా శ్రమించి మంటలను ఆర్పివేశారు. అప్పటికే 20 మంది మంటల్లో చిక్కుకుని మృతిచెందారు. వారిలో 15 మంది పురుషులు, ఐదుగురు మహిళలు ఉన్నారు. మరికొందరు గాయపడగా.. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.
ప్రమాదానికి గురైన భవనంలో టెర్రా డ్రోన్(Terra Drone) అనే ఇండోనేషియా సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు అక్కడి అధికారి తెలిపారు. భవనంలో ఉన్నట్టుండి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో.. కొందరు నిచ్చెనల ద్వారా భవనం పైకెక్కి సురక్షితంగా బయటపడ్డారు. ప్రస్తుతం.. వారు బిల్డింగ్పై నిల్చుని సహాయం కోసం అభ్యర్థిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అయితే.. అగ్ని ప్రమదానికి గల కారణాలపై ఇంకా ఎలాంటి స్పష్టతా రాలేదు. మంటల్ని పూర్తిగా అదుపులోకి తెచ్చి, సహాయక చర్యలన్నీ ముగిశాకే స్పష్టమైన వివరాలు అందజేస్తామని అధికారులు పేర్కొన్నారు.
ఇవీ చదవండి:
భారత్తో బలమైన బంధం.. చైనాకు చెక్ పెట్టేందుకు అమెరికా వ్యూహం..
ట్రంప్ విధానాలతో అమెరికా భారీ మూల్యం చెల్లించుకుంటోంది: హిల్లరీ క్లింటన్