Hillary Clinton: ట్రంప్ విధానాలతో అమెరికా భారీ మూల్యం చెల్లించుకుంటోంది: హిల్లరీ క్లింటన్
ABN , Publish Date - Dec 08 , 2025 | 10:05 PM
అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలతో అమెరికా భారీ మూల్యం చెల్లించుకుంటోందని మాజీ విదేశాంగ శాఖ మంత్రి హిల్లరీ క్లింటన్ అన్నారు. అధ్యక్షుడికి చెక్ పెట్టే విషయంలో అమెరికా చట్టసభలు కూడా విఫలమయ్యాయని అన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలతో మిత్ర దేశాలు దూరమవుతున్నాయని అమెరికా మాజీ విదేశాంగ శాఖ మంత్రి హిల్లరీ క్లింటన్ అన్నారు. ఫలితంగా అమెరికా ప్రజలు మూల్యం చెల్లించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బరాక్ ఒబామా హయాంలో ప్రభుత్వం భారత్తో సన్నిహిత సంబంధాలను ఆశించిందని తెలిపారు. ఇందుకోసం తాము ప్రయత్నాలు కూడా చేశామని చెప్పారు (Hillary Clinton Criticizes Donald Trump).
చైనాపై కూడా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. చైనా ఆయుధ సంపత్తితో ఆ ప్రాంతంలో అమెరికా మిత్ర దేశాలకు ప్రమాదం పొంచి ఉందని అన్నారు. అమెరికాకు కూడా ముప్పేనని చెప్పారు.
అమెరికా అనుసరించే మౌలిక విలువలకు ట్రంప్ విధానాలు భిన్నంగా ఉన్నాయని హిల్లరీ క్లింటన్ తెలిపారు. రష్యా దారుణ యుద్ధాన్ని ట్రంప్ చాలా అరుదుగా మాత్రమే విమర్శించిన విషయాన్ని గుర్తు చేశారు. ఉక్రెయిన్ను మరింత బలహీనపరిచే శాంతి ఒప్పందాన్ని అంగీకరించేలా కూడా ట్రంప్ ఒత్తిడి తెస్తున్నారని విమర్శించారు. 2014లో కూడా రష్యా ఉక్రెయిన్పై దాడి చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఇలాంటి దుస్సాహసాన్ని ప్రోత్సహించడం మంచిది కాదని ట్రంప్కు హితవు పలికారు. ఉక్రెయిన్ను వీలైనంతగా ఆక్రమించడమే పుతిన్ ఉద్దేశమని పేర్కొన్నారు.
ట్రంప్ తీరుతో మిత్ర దేశాలు దూరమవుతున్నాయని అన్నారు. ఐరోపాపై ట్రంప్ ఘాటు విమర్శలు చేయడం సరికాదని విచారం వ్యక్తం చేశారు. ఇక ట్రంప్కు చెక్ పెట్టే విషయంలో అమెరికా చట్టసభలు కూడా తమకు పట్టనట్టు వ్యవహరిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమ బాధ్యతను నిర్వహించడంలో వారు విఫలమయ్యారని అన్నారు. ట్రంప్ను ఎన్నుకుని తప్పు చేశామా అన్న భావన ప్రజల్లో ఇప్పటికే మొదలైందని అన్నారు. మేము ఇందుకు ఓటేశామా అని అనేక మంది విచారంలో పడ్డారని చెప్పారు.
ఇవీ చదవండి:
హమాస్, ఎల్ఈటీ మధ్య సంబంధాలు.. భారత్కు ఇజ్రాయెల్ కీలక విజ్ఞప్తి
వివిధ దేశాల నుంచి భారతీయుల డిపోర్టేషన్.. వివరాలను వెల్లడించిన కేంద్రం
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి