US Immigration Registration Rule: వలస రిజిస్ట్రేషన్ తప్పనిసరి
ABN , Publish Date - Apr 13 , 2025 | 04:18 AM
ఇకా 18 ఏళ్ల దాటిన వలసదారులకు 30 రోజుల్లో రిజిస్ట్రేషన్ చేయడం తప్పనిసరి. ఈ నిబంధనను పాటించకపోతే జరిమానా లేదా జైలు శిక్ష ఎదురవుతుందని అమెరికా హోం ల్యాండ్ సెక్యూరిటీ ప్రకటించింది

రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే జరిమానా, జైలు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: ‘నీ పేపర్లు చూపించు’.. అమెరికాలో నివసిస్తున్న వలసదారులు ఇకపై ఈ డిమాండ్ను నిత్యం ఎదుర్కొనే పరిస్థితి వచ్చింది. వర్క్ వీసా లేదా స్టూడెంట్ వీసాపై చట్టబద్ధంగా ఉన్నా సరే ఈ పరిస్థితి తప్పదు. ఎందుకంటే అమెరికా పౌరులు కాని 18 ఏళ్ల దాటిన వారెవరైనా 30 రోజులు దాటి దేశంలో ఉంటే తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుందనే నిబంధన ఈనెల 11 నుంచి అమల్లోకి వచ్చింది. అన్ని వేళలా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు తప్పనిసరిగా తమ వద్ద ఉంచుకోవాలని, ఇది పాటించని వారికి ఎలాంటి మినహాయింపులు ఉండవని అమెరికా హోం ల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) డిపార్టుమెంట్ ఓ ప్రకటనలో పేర్కొంది. ఇమిగ్రెంట్స్ అందరూ ప్రభుత్వం వద్ద రిజిస్ట్రేషన్ చేసుకుని, ఆ డాక్యుమెంట్లు తమతో ఉంచుకోవాలని ఇటీవల ట్రంప్ ప్రభుత్వం ఓ చట్ట నిబంధన తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దానికి అమెరికా కోర్టు ఏప్రిల్ 10న ఆమోదం తెలిపింది. ఆ నిబంధనను అడ్డుకోవాలంటూ దాఖలైన పిటిషన్లను జడ్జి ట్రెవర్ ఎన్ మెక్ఫాడెన్ కొట్టివేశారు. దీంతో కొత్త నిబంధన అమల్లోకి వచ్చింది.
2022లో డీహెచ్ఎస్ లెక్కల ప్రకారం భారత్కు చెందిన 2.2 లక్షల మంది అక్రమ ఇమిగ్రెంట్స్ అమెరికాలో నివసిస్తున్నారు. అయితే చెల్లుబాటయ్యే వీసా ఉన్న వారు, గ్రీన్కార్డుదారులు, ఎంప్లాయిమెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్, బోర్డర్ క్రాసింగ్ కార్డు, ఐ-94 అడ్మిషన్ రికార్డులను ఇప్పటికే రిజిస్టర్ అయినట్లుగా భావిస్తారని, కొత్త రిజిస్ట్రేషన్ విధానంతో వారికి ఇబ్బంది ఉండదని చెబుతున్నారు. అయినా కూడా హెచ్1బీ, స్టూడెంట్ వీసా వ్యక్తులు ధ్రువపత్రాలను 24 గంటలూ తమ వద్ద ఉంచుకోవాలని చెబుతున్నారు. తమ పిల్లలు ఇప్పటికే రిజిస్టర్ అయి ఉన్నా కూడా 14 ఏళ్లు దాటిన వారి వేలిముద్రలతో మరోసారి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అడ్రస్ మార్పు ఉన్నా పది రోజుల్లో తెలియజేయాలి. ఈ నిబంధన పాటించపోతే 5 వేల డాలర్ల వరకు జరిమానా లేదా 30 రోజుల వరకు జైలు శిక్ష విధిస్తారు. దీంతో పాటు అమెరికాలో నివసించే అవకాశాన్ని కోల్పోవడంతో పాటు మరోసారి వారు దేశంలోకి ప్రవేశించే అవకాశం ఉండదు.
ఈ వార్తలు కూడా చదవండి:
Minister Kollu Ravindra: కులాలు, మతాల మధ్య చిచ్చుపెడితే.. మంత్రి కొల్లు రవీంద్ర మాస్ వార్నింగ్..
South Central Railway: గుడ్ న్యూస్ చెప్పిన దక్షిణ మధ్య రైల్వే.. ఆ ప్రాంతాల్లో ప్రత్యేక రైళ్లు..