Pakistan: ఐఎంఎఫ్ నుంచి పాకిస్థాన్కు లోన్.. S-400 ఆయుధాల కోసమేనా..
ABN , Publish Date - May 15 , 2025 | 08:39 PM
ఇండియాతో ఉద్రిక్తత వేళ పాకిస్థాన్ ఇటీవల ఐఎంఎఫ్ నుంచి రుణం పొందింది. అయితే ఈ రుణాన్ని పాకిస్థాన్ ఉగ్రవాదానికి లేదా S-400 వంటి ఆయుధాల కొనుగోలు కోసం ఉపయోగించవచ్చనే పుకార్లు వినిపిస్తున్నాయి. ఇది సాధ్యం అవుతుందా, నిపుణులు ఏమంటున్నారనే విషయాలను ఇక్కడ చూద్దాం.
ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల మన ప్రత్యర్థి దేశమైన పాకిస్థాన్(Pakistan)కు అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) నుంచి 2.4 బిలియన్ డాలర్ల (రూ.2,05,21,29,21,120) లోన్ వచ్చింది. ఈ రుణం పాకిస్థాన్ ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి, సంస్కరణలు చేపట్టడానికి ఉద్దేశించినది. కానీ ఈ డబ్బును పాకిస్థాన్ ఉగ్రవాదం లేదా ఆయుధాల కొనుగోలుకు ఉపయోగించవచ్చని పలువురు భావిస్తున్నారు. ముఖ్యంగా, పాకిస్థాన్ ఈ రుణంతో భారత్కు సమానమైన రష్యా తయారీ S-400 గగనతల రక్షణ వ్యవస్థను కొనుగోలు చేయవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
అసలు లోన్ ఉద్దేశం ఏంటి?
ఒక దేశం ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడటానికి, ఆర్థిక స్థిరత్వాన్ని సాధించడానికి IMF రుణాలు ఇస్తుంటుంది. ఈ క్రమంలో పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి చాలా కాలంగా ఇబ్బందికరంగా మారింది. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, విదేశీ మారక ద్రవ్య నిల్వల కొరత వంటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో IMF ఈ రుణాన్ని మంజూరు చేసింది. అయితే, ఈ రుణం ఎలా ఖర్చు చేయాలనే దానిపై IMF కఠిన నిబంధనలు విధిస్తుంది. ఈ డబ్బును ఆర్థిక సంస్కరణలు, అవసరమైన రంగాల అభివృద్ధికి ఉపయోగించాలని చెబుతోంది. ఆయుధాల కొనుగోలు లేదా ఇతర సైనిక అవసరాల కోసం ఉపయోగించడం సాధ్యం కాదని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ పాకిస్థాన్ ఈ డబ్బును నిబంధనలకు విరుద్ధంగా ఉపయోగిస్తే, భవిష్యత్తులో రుణాలు పొందడం కష్టమవుతుంది.
S-400 స్పెషల్ ఏంటి?
రష్యా తయారు చేసిన గగనతల రక్షణ వ్యవస్థలో అత్యంత అధునాతన ఆయుధ వ్యవస్థలలో ఒకటి S-400. ఇది శత్రు విమానాలు, క్షిపణులు, డ్రోన్లను గుర్తించి నాశనం చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. భారత్ 2018లో రష్యాతో ఒప్పందం కుదుర్చుకుని S-400 వ్యవస్థలను కొనుగోలు చేసింది. ఇవి ఇప్పుడు దేశ రక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. చైనా సైతం ఈ వ్యవస్థను రష్యా నుంచి కొనుగోలు చేసింది. కానీ భారత్కు ఇచ్చిన వ్యవస్థలతో పోలిస్తే చైనాకు ఇచ్చినవి కొన్ని మార్పులతో ఉన్నాయని చెబుతున్నారు. ఈ వ్యవస్థ సాంకేతికత అత్యంత గోప్యమైనదని అంటున్నారు.
పాకిస్థాన్ కొంటుందా..
పాకిస్థాన్ S-400 కొనుగోలు చేయాలనుకుంటే దానికి రష్యా అంగీకరించాలి. భారత్-రష్యా మధ్య దశాబ్దాలుగా బలమైన రక్షణ సంబంధాలు ఉన్నాయి. రష్యా నుంచి భారత్ యుద్ధ విమానాలు, ట్యాంకులు, క్షిపణులు వంటి అనేక ఆయుధాలను కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలో రష్యా భారత్తో సంబంధాలను దెబ్బతీసే విధంగా పాకిస్థాన్కు S-400 విక్రయించే అవకాశం చాలా తక్కువగా ఉన్నాయి. ఈ క్రమంలో రష్యా అటువంటి నిర్ణయం తీసుకోదని అంటున్నారు. ఎందుకంటే ఇది భారత్తో సంబంధాలను దెబ్బతీడమే కాక.. రష్యా సాంకేతికత రహస్యాలు పాకిస్థాన్ ద్వారా అమెరికాకు చేరే ప్రమాదం ఉంది. అమెరికాతో పాకిస్థాన్కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఒకవేళ S-400 సాంకేతికత అమెరికా చేతుల్లోకి వెళ్తే అది రష్యాకు పెద్ద దెబ్బ అవుతుంది.
Also Read:
SJaishankar: కశ్మీర్ విషయంలో మూడో దేశం జోక్యం అవసరం లేదు
ఉద్యోగాల క్యాలెండర్ రిలీజ్..ఏ ఎగ్జామ్ ఎప్పుడుందో తెలుసా..
For More Andhra Pradesh News and Telugu News..