History Of Pakistan's Terror Track: పాక్ నీచపు టెర్రర్ ట్రాక్ రికార్డ్ ఇదే..
ABN , Publish Date - May 03 , 2025 | 05:27 PM
భారత్ - పాక్ దేశాల మధ్య నియంత్రణ రేఖ ముళ్ల తీగల కంచెలకు ఆవల ఉగ్రవాద లాంచ్ప్యాడ్లు ఉన్నాయి. తర్వాత పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ఉంది. ఇది పాకిస్తాన్ దళాల ఆక్రమణలో ఉన్న భారత భూభాగంలోని ప్రాంతం.
History Of Pakistan's Terror Track: గత నెలలో పహల్గాం దాడి అనంతరం ఉగ్రవాదులతో పాకిస్థాన్ సంబంధాలు మళ్లీ బయటపడ్డాయి. పాకిస్తాన్ తన ఆక్రమిత జమ్మూ కాశ్మీర్(POK) ప్రాంతాన్ని ఉగ్రవాదానికి ఆశ్రయంగా ఎలా ఉపయోగించుకుందో బహిర్గతమైంది. పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ పహల్గాం దాడిపై మొదటిసారి బహిరంగంగా స్పందిస్తూ "విశ్వసనీయమైన, తటస్థ దర్యాప్తు" చేస్తామంటూ చెప్పుకొచ్చారు. అయితే, ఇవి పాకిస్తాన్ నాయకుల ఉద్దేశపూర్వక దుర్మార్గాల్ని నొక్కి చెబుతున్నాయి. దశాబ్దాలుగా భారత్ - పాకిస్తాన్ మధ్య జరిగిన ఘర్షణలను పరిశీలిస్తే, ఉగ్రవాదం అనేది ఇస్లామాబాద్కు అత్యంత శక్తివంతమైన ఆయుధంగా ఎలా ఉందో తెలుస్తుంది.
1947 నుండి పాకిస్తాన్ స్పాన్సర్డ్ (ప్రాయోజిత) ఉగ్రవాదం
పాకిస్తాన్ తన భౌగోళిక రాజకీయ లక్ష్యాలను సాధించడానికి ఉగ్రవాదాన్ని ఉపయోగించడం కొత్త విషయమేమీ కాదు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి ఉగ్రవాదం ఇస్లామాబాద్ యొక్క దురాక్రమణ విధానంలో భాగంగా ఉంది. 1947లో భారత్ - పాక్ విభజన సమయంలో, జమ్మూ, కాశ్మీర్పై దాడి చేయడానికి పాకిస్తాన్ గిరిజన మిలీషియాకు మద్దతు ఇచ్చింది. వారిని భారత్ పైకి ఉసిగొల్పుతూ వచ్చింది. తను అనుకున్నది సాధ్యం కాకపోవడంతో ఉగ్రవాద మౌలిక సదుపాయాలకి మరింత చేదోడునిచ్చింది.
1965 యుద్ధంలో పాకిస్తాన్ సైనికులను 'ఆపరేషన్ జిబ్రాల్టర్' కింద సరిహద్దు దాటించి కాశ్మీర్లోకి పంపారు. స్థానికుల వలె మారువేషంలో వాళ్లు కశ్మీరీలలో తిరుగుబాటును రేకెత్తించడానికి ఉద్దేశించారు, కానీ ఆ ప్రయత్నం కూడా విఫలమైంది.
1999 కార్గిల్ యుద్ధం ప్రారంభమైనప్పుడు, పాకిస్తాన్ ఉగ్రవాదులు మళ్ళీ సరిహద్దులోకి చొరబడ్డారు. అయితే, పాక్ సైన్యం మొదట్లో తమ ప్రమేయాన్ని తిరస్కరించింది, కానీ తరువాత ఆధారాలు వెలువడ్డాయి. వారి ద్వారా శిక్షణ పొందిన ఉగ్రవాదులు భారత భూభాగంలోకి ఎలా ప్రవేశించారో కూడా రుజువయింది.
అంతటితో ఆగని పాకిస్థాన్ ప్రాక్సీ టెర్రర్ గ్రూపులు తీసుకొచ్చి.. లష్కరే తోయిబా, జైష్-ఏ-మొహమ్మద్ వంటి బహుళ ఉగ్రవాద గ్రూపులను సృష్టించింది. ఆ ఉగ్రమూకలకు శిక్షణ ఇచ్చింది. ఆయుధాలు ఇచ్చింది, ఇవి భారతదేశంలోని పౌరులు, మైనారిటీలు, టూరిస్టులు, ఇంకా భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకుని అనేక దాడులను నిర్వహించాయి. అనేక దాడులకు సంబంధించి ఈ గ్రూపులు బాధ్యత వహించడంతో, పాకిస్తాన్ వేషాలు కొనసాగుతున్నాయి.
1990ల నుండి ఉగ్రవాద దాడులు
1990ల నుండి భారతదేశంలో పాకిస్థాన్ స్పాన్సర్ చేసిన ఉగ్రవాదం పెరిగింది. ఇస్లామాబాద్ ఇచ్చిన ఆయుధాలు ధరించి, పాక్ ఇచ్చిన నిధులతో చెలరేగిపోతున్న ఉగ్ర గ్రూపులు 2019 పుల్వామా దాడులతో సహా భారతదేశంలో అత్యంత ఘోరమైన ఉగ్రవాద దాడులకు పూనుకున్నారు.
1993లో, భారత ఆర్థిక రాజధాని ముంబైలో వరుస పేలుళ్లలో 267 మందిని పొట్టనబెట్టుకున్నారు. యావత్ ప్రపంచం ఆంక్షలు విధించినప్పటికీ ఏ మాత్రం పట్టించుకోకుండా పాకిస్తాన్.. ముంబై దాడుల సూత్రధారి దావూద్ ఇబ్రహీంకు ఆశ్రయం కల్పించింది.
2001లో, భారత పార్లమెంటుపై దాడికి పాకిస్తాన్కు చెందిన జైష్-ఎ-మొహమ్మద్ ప్రణాళిక వేసింది. 1999లో కాందహార్లో ఉగ్రవాదులు విమానం హైజాక్ చేసి బందీలకు బదులుగా మసూద్ అజార్ను విడుదల చేయించుకున్నారు.
2008లో మళ్లీ ఉగ్రవాదులు పేట్రేగిపోయారు. ముంబైలో అనేక ప్రదేశాలను లక్ష్యంగా చేసుకున్నారు. ఈసారి దురాగతానికి పాల్పడింది లష్కరే-ఎ-తోయిబా. పట్టుబడిన ఉగ్రవాది అజ్మల్ కసబ్. అతని ఫోన్ ఇంటర్సెప్ట్లు పరిశీలించిన మీదట, అంతర్జాతీయ నిఘా సంస్థల ద్వారా పాకిస్తాన్ ప్రమేయం నిరూపించబడింది.
2016 పంజాబ్లోని పఠాన్కోట్లోని భారత వైమానిక దళ స్థావరంపై ఉగ్రవాదులు దాడి చేశారు. దాడి జరిగిన ప్రదేశాన్ని సందర్శించడానికి పాకిస్తాన్ దర్యాప్తు బృందాన్ని అనుమతించినప్పటికీ, పాకిస్తాన్ అధికారులు ఎటువంటి చర్య తీసుకోలేదు.
2019లో దశాబ్దంలోనే అత్యంత ఘోరమైన దాడి పుల్వామాలో జరిగింది. భారత పారామిలిటరీ సిబ్బంది కాన్వాయ్పై ఆత్మాహుతి బాంబు దాడిలో 40 మంది మరణించారు. పాకిస్తాన్ అనుమానితులపై సమాచారం కోసం భారతదేశం చట్టపరమైన అభ్యర్థనలు చేసింది, కానీ ఇస్లామాబాద్ పట్టించుకోలేదు.
పాకిస్తాన్ న్యాయాన్ని ఎలా అడ్డుకుంది
గత దశాబ్దాలుగా పాక్ ప్రేరేపిత ఉగ్రమూకలు చేస్తూ వచ్చిన ప్రతి పెద్ద దాడి తర్వాత భారతదేశం పాకిస్థాన్ ప్రమేయాన్ని నొక్కి చెబుతూ వచ్చింది. దీనికి సంబంధించి పాకిస్తాన్కు తగిన ఆధారాలను అందించింది. అయితే, పాకిస్తాన్ ప్రతిసారీ ఒక స్క్రిప్ట్ ప్రకారం తమ ప్రమేయాన్ని తిరస్కరించడం, లేదా చర్య తీసుకోవడానికి నిరాకరించడం చేస్తోంది.
పాకిస్తాన్ వక్రబుద్ధి కారణంగా ముంబై దాడి సూత్రధారులు హఫీజ్ సయీద్, జాకి-ఉర్-రెహ్మాన్ లఖ్వీ తమ దేశంలో స్వేచ్ఛగా పనిచేయడానికి అనుమతించింది. పదిహేడు సంవత్సరాలు గడిచినా, అంతర్జాతీయ ఒత్తిడి ఉన్నప్పటికీ ముంబై దాడి విచారణలో ఎటువంటి పురోగతి సాధించలేదు.
ఇక, పఠాన్కోట్ దాడి తర్వాత నేరస్థులను రక్షించడానికి పాకిస్తాన్ తన దర్యాప్తును నిలిపివేసింది. అటు, పుల్వామా దాడి తర్వాత నలుగురు అనుమానితుల సమాచారం కోసం భారత్ చేసిన అన్ని చట్టపరమైన అభ్యర్థనలను పాకిస్థాన్ విస్మరించింది.
పాకిస్తాన్ ఉగ్రవాద ట్రాక్ రికార్డ్
పాక్ పెంచి పోషించిన ఉగ్రవాదులు ప్రపంచ వ్యాప్తంగా చేసిన అరాచకాలు యావత్ ప్రపంచానికీ తెలిసిందే. 9/11 దాడి సూత్రధారి ఒసామా బిన్ లాడెన్ పాకిస్తాన్లోని అబోటాబాద్లోని సైనిక అకాడమీ సమీపంలో నివసిస్తున్నట్లు కనుగొన్నారు. అంటే పాక్.. ఉగ్రవాది లాడెన్ కు ఎంతగా సహకరించిందో అర్థం చేసుకోవచ్చు. ఇక, 2011లో లాడెన్ ను US(అమెరికా) దళాలు హతమార్చగా, మరో 9/11 కుట్రదారుడు ఖలీద్ షేక్ మహ్మద్ పాకిస్తాన్లో పట్టుబడ్డాడు.
అంతేకాకుండా, అనేక మంది పాకిస్తానీ పౌరులు లేదా వారి మద్దతు ఉన్న గ్రూపులు భారతదేశ వ్యాప్తంగా ఉగ్రవాద దాడులకు ఎలా పాల్పడిందీ కూడా తేటతెల్లమైనప్పటికీ పాకిస్థాన్ మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోకపోగా, వారికి ఆశ్రయం కల్పిస్తూ తన వక్రబుద్ధిని ప్రదర్శిస్తూనే ఉంది.

ఇవి కూడా చదవండి
Janu Lyri: రెండో పెళ్లి కన్ఫార్మ్ చేసిన జాను లిరి.. అతడి ఫొటో షేర్ చేసి మరీ..
Kannada News: ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. కర్రీ, సాంబార్ సరిగా చేయలేదని..