Peter Navarro - X fact check : భారత్పై నవారో మాటలు తప్పు.. 'ఎక్స్' ఫ్యాక్ట్ చెక్
ABN , Publish Date - Sep 07 , 2025 | 12:01 PM
ట్రంప్ ప్రాపకం కోసం భారత్ మీద ఇష్టారీతిన మాట్లాడుతున్న పీటర్ నవారో మాటలన్నీ అబద్ధాలని ప్రముఖ సోషల్ మీడియా మాధ్యమం 'ఎక్స్' తేల్చి చెప్పింది. నవారో పోస్టుపై ‘ఎక్స్’ ఫ్యాక్ట్ చెక్ చేసి.. ఆ వ్యాఖ్యలు తప్పని నిర్ధారించింది.
ఇంటర్నెట్డెస్క్: తమ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రాపకం కోసం భారత్ మీద ఇష్టారీతిన మాట్లాడుతున్న డోనాల్డ్ ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో మాటలన్నీ అబద్ధాలని ప్రముఖ సోషల్ మీడియా మాధ్యమం 'ఎక్స్' తేల్చి చెప్పింది. భారత్ మీద ట్రంప్ అదనపు టారిఫ్స్, జరిమానాలు విధిస్తూ చేసిన ప్రకటన మొదలు నవారో చెలరేగిపోతున్నారు. రష్యాతో భారత్ చేస్తున్న చమురు కొనుగోళ్లు మీద నవారో దిగజారి మాట్లాడుతున్నారు.
అయితే.. నవారో భారతదేశం మీద చేసిన ఆరోపణలు అబద్ధమని 'ఎక్స్' తన ఫ్యాక్ట్ చెక్ చేసి చెప్పింది. 'అమెరికా నుంచి చేసుకుంటున్న దిగుమతులపై భారత్ అత్యధిక సుంకాలు విధించడం వల్ల అమెరికా ఉద్యోగాలు దెబ్బతింటున్నాయి.. లాభం కోసమే భారత్.. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోంది. తద్వారా ఉక్రెయిన్తో రష్యా చేస్తున్న యుద్ధాన్ని పోషిస్తోంది.' అంటూ నవారో ఎక్స్లో ఓ పోస్టు పెట్టారు.
ఈ పోస్టుపై ‘ఎక్స్’ ఫ్యాక్ట్ చెక్ చేసి.. ఆ వ్యాఖ్యలు తప్పని నిర్ధారించింది. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడం, కేవలం ఆ దేశ ఇంధన భద్రత కోసమేనని 'ఎక్స్' తెలిపింది. అంతేకాదు, భారతదేశం ఎలాంటి ఆంక్షలను ఉల్లంఘించడంలేదని చెప్పింది. అదే సమయంలో అమెరికా కూడా రష్యా నుంచి వస్తువులు దిగుమతి చేసుకుంటున్న విషయాన్నీ ప్రస్తావించింది. నవారో వ్యాఖ్యలు విద్రోహపూరితంగా చేసినవని వ్యాఖ్యానించింది.
ఇక, ఈ 'ఎక్స్' ఫ్యాక్ట్ చెక్పై నవారో మండిపడ్డారు. ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ పై కూడా ఆయన విమర్శలు చేశారు. 'ఎక్స్' చేసిన నిజాల నిర్ధారణ (ఫ్యాక్ట్ చెక్) ఒక చెత్తగా నవారో అభివర్ణించారు. మరోవైపు, పీటర్ నవారో చేసిన వ్యాఖ్యల్ని భారత్ తీవ్రంగా ఖండించింది. నవారో వ్యాఖ్యలపై దేశ విదేశాంగ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మండిపడ్డారు. అవి సరైనవి కావని.. తప్పుదారి పట్టించేవని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దేశంలోని కొన్ని వర్గాలను లక్ష్యంగా చేసుకుని రెచ్చగొట్టేలా నవారో చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇవి కూడా చదవండి
కవిత వ్యాఖ్యలను..ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నా