World Diabetes Day 2025: షుగర్ కంట్రోల్ కావాలా..ఈ ఆయుర్వేద చిట్కాలు పాటించండి.!
ABN , Publish Date - Nov 14 , 2025 | 09:20 AM
ప్రతి సంవత్సరం నవంబర్ 14న ప్రపంచ మధుమేహ దినోత్సవాన్ని జరుపుకుంటారు. మధుమేహం ప్రభావం గురించి అవగాహన పెంచడం, చికిత్సను ప్రోత్సహించడం దీని ముఖ్య ఉద్దేశ్యం. కాబట్టి..
ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుత కాలంలో చాలా మంది డయాబెటిస్ వ్యాధితో బాధపడుతున్నారు. శరీరం ఇన్సులిన్కు సరిగ్గా స్పందించనప్పుడు ఈ సమస్య వస్తుంది. ఇన్సులిన్ అనే హార్మోన్, రక్తంలోని గ్లూకోజ్ను కణాలలోకి పంపించి, శక్తిగా మార్చడానికి సహాయపడుతుంది. రక్తంలో గ్లూకోజ్ పేరుకుపోవడం వల్ల గుండెపోటు, పక్షవాతం, మూత్రపిండాల వైఫల్యం వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది.
గతంలో ఈ వ్యాధి కేవలం వృద్ధులలో మాత్రమే కనిపించేది. అయితే, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం, ప్రాసెస్ చేసిన ఆహారాలు తినడం, ఒత్తిడి కారణంగా యువకులు, చిన్న పిల్లలు సైతం డయాబెటిస్ సమస్యను ఎదుర్కొంటున్నారు. అందరికీ మధుమేహం సర్వసాధారణంగా మారింది. ప్రతి సంవత్సరం నవంబర్ 14న ప్రపంచ మధుమేహ దినోత్సవాన్ని జరుపుకుంటారు. మధుమేహం ప్రభావం గురించి అవగాహన పెంచడం, చికిత్సను ప్రోత్సహించడం దీని ముఖ్య ఉద్దేశ్యం. కాబట్టి.. రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేయడానికి సహాయపడే ఆయుర్వేద చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
మునగకాయ
ఆయుర్వేద నిపుణుల ప్రకారం, మునగకాయలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. మునగకాయలు, వాటి ఆకులు ఇన్సులిన్ లాగా పనిచేస్తాయి. వాటిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీరంలో చక్కెరను శక్తిగా మార్చడంలో సహాయపడతాయి. కాబట్టి, మునగాకును ప్రతిరోజూ రసం లేదా పొడి రూపంలో తీసుకోవడం మంచిదని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
బార్లీ
డయాబెటిస్ వారికి బార్లీ చాలా మేలు చేస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను కంట్రోల్ చేయడంలో సహాయపడుతుంది. బార్లీ నీరు, గంజి తీసుకోవడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
ఉసిరి
ఉసిరిలో విటమిన్ సి, క్రోమియం ఉంటాయి. ఇవి ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతాయి. ఉసిరి రసం లేదా తాజా ఉసిరిని ప్రతిరోజూ తీసుకోవడం వల్ల క్లోమం పనితీరు మెరుగుపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.
నోటి పరిశుభ్రత, మూలికలు
నోటి ఆరోగ్యం, జీర్ణక్రియ చక్కెర స్థాయిలతో నేరుగా ముడిపడి ఉంటుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. వేప పుల్లలు లేదా త్రిఫల పొడితో నోటి పరిశుభ్రతను కాపాడుకోవడం, ప్రతిరోజూ ఉదయం గోరువెచ్చని నీటితో మెంతులు లేదా గుర్మార్ పొడిని తీసుకోవడం వల్ల చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
Also Read:
శీతాకాలం.. ఆహారాన్ని పదే పదే వేడి చేసి తింటున్నారా? జాగ్రత్త!
శీతాకాలంలో మీ ఆరోగ్యాన్ని ఇలా కాపాడుకోండి..!
For More Latest News