Share News

Ayurveda Day 2025: ఆయుర్వేద దినోత్సవం ప్రాముఖ్యత.. థీమ్, లక్ష్యాలు మీకు తెలుసా?

ABN , Publish Date - Sep 23 , 2025 | 01:31 PM

నేడు ఆయుర్వేద దినోత్సవం. ఆయుర్వేద వైద్య విధానాన్ని ప్రోత్సహించడానికి, దాని శాస్త్రీయతను ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పడానికి ఈ రోజును జరుపుకుంటారు.

Ayurveda Day 2025:  ఆయుర్వేద దినోత్సవం ప్రాముఖ్యత.. థీమ్,  లక్ష్యాలు మీకు తెలుసా?
Ayurveda Day 2025

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచ ఆరోగ్యానికి ఆయుర్వేదం ప్రాముఖ్యతను తెలియజేయడానికి ప్రతి సంవత్సరం ఈ రోజుని (సెప్టెంబర్ 23) ఆయుర్వేద దినోత్సవంగా జరుపుకుంటారు. ఇది పురాతన భారతీయ వైద్య విధానం. భారతదేశం నేడు 10వ ఆయుర్వేద దినోత్సవాన్ని గోవాలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద (AIIA)లో జరుపుకుంటుంది. ఆయుర్వేదం గురించి ప్రజలకు అవగాహన పెంచడానికి ఈ రోజును జరుపుకుంటారు.


ఆయుర్వేద దినోత్సవం 2025 థీమ్

భారత ప్రభుత్వం 2025 ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా 'ఆయుర్వేదం ఫర్ పీపుల్ & ప్లానెట్' (Ayurveda for People & Planet) అనే థీమ్‌‌ను ప్రకటించింది. ఈ థీమ్ ద్వారా రెండు ముఖ్యమైన విషయాలను హైలైట్ చేస్తున్నారు. మనుషుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, అలాగే, ప్రకృతిని (గ్రహాన్ని) రక్షించడం, ఈ థీమ్ ముఖ్య ఉద్దేశ్యం. ఆయుర్వేదం అనేది కేవలం రోగాలు వచ్చినప్పుడు తీసుకునే చికిత్స మాత్రమే కాకుండా, మంచి జీవనశైలిని పాటించడం, ఆరోగ్యం, భవిష్యత్తు తరాల కోసం ఆరోగ్యకరమైన జీవితం, పర్యావరణం కల్పించడం ఇలా అన్నిటి మీద దృష్టి పెట్టే సంపూర్ణ విధానం అని ఆయుష్ మంత్రిత్వ శాఖ (Ministry of AYUSH) చెబుతోంది.


2025 ఆయుర్వేద దినోత్సవ లక్ష్యాలు

  • ప్రపంచ ఆరోగ్యం కోసం ఆయుర్వేదాన్ని ప్రోత్సహించడం - విదేశాలలో ఉన్న భారతీయ మిషన్ల ద్వారా అంతర్జాతీయ సమాజాలకు ఆయుర్వేద ప్రయోజనాలను వ్యాప్తి చేయడం.

  • జాతీయ ఆరోగ్య కార్యక్రమాలలో ఆయుర్వేదాన్ని కలపడం - నివారణ ఆరోగ్య సంరక్షణ, ప్రజారోగ్య ప్రచారాలలో ఆయుర్వేద వాడకాన్ని ప్రోత్సహించడం.

  • ఆయుర్వేదానికి ప్రపంచవ్యాప్త గుర్తింపు కోసం ఆవిష్కరణలు, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు, పరిశోధనలకు మద్దతు ఇవ్వడం.

  • భారతదేశం అంతటా ఆరోగ్య శిబిరాలు, విద్యార్థులను చేరుకునే కార్యక్రమాలు, అవగాహన ప్రచారాలను నిర్వహించడం.

  • ఆయుర్వేదం స్థిరమైన భవిష్యత్తు కోసం అందించే పర్యావరణ అనుకూలమైన, ప్రకృతి ఆధారిత పరిష్కారాలను హైలైట్ చేయడం.


జాతీయ ధన్వంతరి ఆయుర్వేద అవార్డులు 2025

ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా, ప్రభుత్వం జాతీయ ధన్వంతరి ఆయుర్వేద అవార్డులు 2025ను ప్రదానం చేస్తుంది. ఆయుర్వేద విద్య, పరిశోధన, విధానం, ఆరోగ్య సంరక్షణ రంగాలలో గణనీయంగా కృషి చేసిన వ్యక్తులు, సంస్థలను గుర్తించి ప్రభుత్వం ఈ అవార్డులను అందిస్తుంది. ఆయుర్వేద నిపుణులు ఉత్తమ పద్ధతులను అవలంబించడానికి, జాతీయం, అంతర్జాతీయంగా దాని జ్ఞానాన్ని వ్యాప్తి చేయడానికి ఈ అవార్డులతో ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది.


Also Read:

మెటా కీలక ప్రకటన..

మీ పిల్లలు చూయింగ్ గమ్ తింటున్నారా? ఈ వీడియో చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..

For More Latest News

Updated Date - Sep 23 , 2025 | 01:41 PM