Hyderabad: చేతబడి అనుమానంతో హత్య..
ABN , Publish Date - Dec 04 , 2025 | 08:19 AM
హైటెక్ యుగంలోకూడా ఈ మూడనమ్మకాల జాడ్యం వదలడంలేదు. చేతబడి చేశాడన్న అనుమానంతో ఓ వ్యక్తిని దారుణంగా కొట్టి హతమార్యారు. ఈ సంఘటన ఉస్మానియా యూనివర్సిటీ సిటీ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉనకనాయి.
- వీడిన మర్డర్ మిస్టరీ
- పోలీసుల అదుపులో ముగ్గురు నిందితులు
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ సిటీ పోలీస్స్టేషన్(Osmania University City Police Station) పరిధిలో రెండు రోజుల క్రితం జరిగిన హత్య కేసును ఓయూ పోలీసులు, నల్లకుంట డిటెక్టివ్ టీం, ఈస్ట్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా ఛేదించారు. చేతబడి చేస్తున్నాడన్న అనుమానంతో హత్య చేసినట్టు తేలింది. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఓయూ పోలీస్ స్టేషన్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈస్ట్జోన్ డీసీపీ బి.బాలస్వామి కేసు వివరాలు వెల్లడించారు.

ధూల్పేట్ మంగళ్హట్కు చెందిన మాగుసింగ్ (58) మంత్రాల ద్వారా వ్యాపారంలో బాగా లాభాలు వచ్చేలా చేస్తానని చిలకలగూడకు చెందిన చేపల వ్యాపారి షేక్గౌస్, అతడి అల్లుడు సయ్యద్ షోయబ్ నుంచి కొంత కాలం క్రితం డబ్బులు తీసుకున్నాడు. కానీ వారి వ్యాపారంలో నష్టాలు రావడంతో పాటు, కుటుంబసభ్యులకు ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. మాగుసింగ్ చేతబడి చేసి ఉంటాడనే అనుమానంతో అతడిపై కక్ష పెంచుకున్నారు. పక్కా ప్లాన్తో డిసెంబర్ 1న మాగుసింగ్ను సయ్యద్ షోయబ్ స్కూటీపై చిలకలగూడకు తీసుకొచ్చాడు.

వచ్చిన వెంటనే షేక్ గౌస్ ఇనుపరాడ్తో అతని తలపై బలంగా కొట్టాడు. తర్వాత షోయబ్కు చెందిన కారులో తీసుకెళ్లి కత్తితో గొంతుకోసి చంపేశారు. మృతదేహాన్ని తార్నాకలోని ఎర్రకుంట కట్ట వద్ద పడేసి వెళ్లిపోయారు. ఇల్యాస్ అనే వ్యక్తి కారు నడిపాడు. విచారణ చేపట్టిన పోలీసులు విశ్వసనీయ సమాచారంతో నిందితులను అరెస్ట్ చేశారు. విచారణలో నిందితులు నేరం అంగీకరించారు. గతంలో షేక్గౌస్ చోరీ, హత్యాయత్నం కేసుల్లో మైలార్దేవ్ పల్లి, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లలో నిందితుడిగా ఉన్నాడు.
ఈ వార్తలు కూడా చదవండి..
మరింత పెరిగిన పుత్తడి ధరలు.. రికార్డు స్థాయికి వెండి
Read Latest Telangana News and National News