Hyderabad: ఇత్తడిని పుత్తడిగా నమ్మించి.. డెంటల్ డాక్టర్ను..
ABN , Publish Date - Jun 28 , 2025 | 10:27 AM
ఇత్తడిని పుత్తడిగా నమ్మించి ఓ డెంటల్ డాక్టర్కు టోకరా వేయబోయిన ఓ ముఠాను కుషాయిగూడ పోలీసులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఎస్సై సుధాకర్రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
- బోల్తా కొట్టించే యత్నం
- పోలీసులకు చిక్కిన ముఠా
హైదరాబాద్: ఇత్తడిని పుత్తడిగా నమ్మించి ఓ డెంటల్ డాక్టర్కు టోకరా వేయబోయిన ఓ ముఠాను కుషాయిగూడ(Kushaiguda) పోలీసులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఎస్సై సుధాకర్రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. స్థానిక హెచ్బీకాలనీకి చెందిన డాక్టర్ ప్రియాంక కుషాయిగూడ చక్రీపురం చౌరస్తాలో ఓ డెంటల్ క్లినిక్ నిర్వహిస్తున్నారు.
ఈ నెల 21న నాగారంలో ఉంటున్న యూపీ రాష్ట్రం ఆగ్రాకు చెందిన దేవేందర్కుమార్(65), రవి(30), గంగూభాయ్(45) ముగ్గురు సభ్యుల ముఠా సదరు క్లినిక్లో దంత పరీక్షలు చేయించుకుని డబ్బుకు బదులు బంగారం ఇచ్చారు. ఆ బంగారాన్ని ఓ జువెలరీ దుకాణంలో తనిఖీ చేయించగా అసలుదేనని తేలింది. అయితే, ఇదే అదనుగా భావించిన ఆ ముఠా సభ్యులు తమ దగ్గర మరో కిలోవరకు బంగారు హారం ఉందని, డబ్బులు అత్యవసరం ఉన్నందున మీకు రూ.4 లక్షలకు విక్రయిస్తామని తెలిపారు.
అందుకు డాక్టర్ ఒప్పుకోవడంతో రెండు రోజుల్లో ఆ బంగారుహారం తీసుకువస్తామని చెప్పి ఫోన్నంబర్ ఇచ్చి వెళ్లిపోయారు. కిలో బంగారుహారం కేవలం రూ.4లక్షలంటే అనుమానించిన డాక్టర్ ముందస్తుగా పోలీసులకు సమాచారం అందించింది. దీంతో రంగంలోకి దిగిన సీసీఎస్, ఎస్ఓటీ పోలీసులు వాళ్లను పట్టుకునేందుకు వ్యూహం పన్నారు. ఈ నెల 26న మధ్యాహ్నం 2గంటల సమయంలో క్లినిక్కు వచ్చిన ముఠా సభ్యులు డాక్టర్తో బంగారుహారం,
డబ్బుల గురించి చర్చిస్తుండగా.. అక్కడ మాటువేసిన పోలీసులు వెంటనే వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి కిలో బరువు గల ఆ హారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దాన్ని తనిఖీ చేయగా బంగారుపూతతో ఉన్న ఇత్తడిహారం అని తేలింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి వారిని అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి.
బంగారం ధర భారీగా తగ్గిందోచ్, కానీ వెండి మాత్రం
ఆర్అండ్బీలో 72 మంది డీఈఈలకు పదోన్నతి
Read Latest Telangana News and National News